మరోసారి ఆంధ్రాకు జగన్ ఎందుకు వద్దో ప్రజలకు వివరిస్తాం : నాదెండ్ల మనోహర్
Janasenaparty: “వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్” అనేది జనసేన నినాదమని అన్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఎందుకు జగన్ ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదో కూడా ప్రజలకు వివరిస్తామని..వారిని చైతన్యపరుస్తామని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకులు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి సిద్ధమైపోతున్నారని.. నిన్న మొన్నటి వరకు గడపగడపకు ప్రభుత్వం.. జగనన్నకు చెబుదాం… జగనన్నే మా నమ్మకం అంటూ రకరకాల కార్యక్రమాలు చేసి విఫలం చెందిన వైసీపీ నాయకులు మరోసారి ఎన్నికల ముందు “వై ఏపీ నీడ్స్ జగన్ ” అంటూ ప్రజలకు టోపీ పెట్టడానికి వస్తున్నారని ఆయన హెచ్చరించారు. తెనాలిలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “జగన్ ఏపీకి ఎందుకు అవసరం లేదు అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా జనసేన పార్టీ వివరిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజలను చైతన్యపరుస్తారని.. ఆంధ్ర ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వ దురాగతాలపై వారిని జాగరుకులను చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
జగన్ ఎందుకు ఏపీకి అవసరం లేదు అంటే…
1. ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ తీసి, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో ఆర్భాటంగా చెప్పి తర్వాత కనీసం ఏ ఒక్క ఉద్యోగం తీయకుండా యువతను మోసం చేసినందుకు.. జగన్ వద్దు
_ రాష్ట్రంలో 6.16 లక్షల మంది నిరుద్యోగ యువత తమ పేర్లు ఉపాధి కార్యాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే వారికీ ఈ ప్రభుత్వం దారి చూపలేకపోయింది. ప్రతి ఏటా ఖాళీలను అనుసరించి నోటిఫికేషన్ వేస్తామని చెప్పి.. ప్రతి సంవత్సరం ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన హామీ ఊసే లేదు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ విషయంలోనూ గందరగోళం సృష్టించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చింది. గత నాలుగున్నరేళ్లలో డీఎస్సీ నోటిఫికేషన్ జాడే లేదు. నిరుద్యోగ యువతను ఉద్యోగాలు లేకుండా నిలువునా ముంచిన జగన్ మళ్లీ ఈ రాష్ట్రానికి వద్దే వద్దు.
2. అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్ లో రద్దు చేస్తామని ఉద్యోగులను నమ్మించి నట్టేట ముంచినందుకు జగన్ వద్దు.
* సీపీఎస్ పరిధిలోకి వచ్చే సుమారు రెండున్నర లక్షల మంది ఉద్యోగులకు మాయ మాటలతో జగన్ తన పాదయాత్రలో మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు జీపీఎస్ పేరుతో బలవంతపు స్కీమ్ తీసుకువచ్చి ఉద్యోగుల తలపై రుద్దారు. దీనివల్ల వారికి ఉద్యోగ భద్రత, భవిష్యత్తు భద్రత లేక అగమ్య గోచరపరిస్థితిలో ఉన్నారు. చెప్పిన మాటను తప్పి కొత్త పథకంతో ఉద్యోగులను నిలువునా మోసం చేసిన జగన్ అసలు వద్దు..
3. సంపద సృష్టి అనే విషయాన్ని పక్కన పెట్టి అప్పులతో రాష్ట్రం భవిష్యత్తు లేకుండా బటన్లు నొక్కుతూ కాలం గడుపుతున్న జగన్ ఈ రాష్ట్రానికి వద్దు..*
_ రాష్ట్రం అప్పు భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో సంపద సృష్టించడానికి అనువుగా 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టలేదు. రకరకాల మార్గాల్లో అప్పులను తీసుకువచ్చి రాష్ట్రం భవిష్యత్తు లేకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. వచ్చిన ఆదాయం అంతా అప్పులు, వాటి వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. రెవెన్యూ లోటు దారుణంగా పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్రం మీద రూ.9.61 లక్షల కోట్ల అప్పు ఉంది. గత నాలుగున్నర ఏళ్లలో రూ.2.61 లక్షల కోట్లను సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కామని ముఖ్యమంత్రి చెబుతున్నాడు. మరి అప్పులు చేసిన మిగిలిన డబ్బు ఏమైపోయింది..? రోడ్లు దారుణంగా ఉన్నాయి.. వ్యవసాయం అధోగతి పాలయింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు లేదు. మరి అప్పు తెచ్చిన అన్ని లక్షల కోట్లు ఈ ప్రభుత్వం ఏం చేసింది..? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, సంక్షేమం ముసుగు వేస్తున్న ముఖ్యమంత్రి మళ్ళీ వద్దే వద్దు..
4. రాష్ట్ర రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చట్టసభ సాక్షిగా చెప్పిన వ్యక్తి తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మాట తప్పిన వ్యక్తి అవసరం లేనే లేదు.
* గత ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో సైతం రాజధానికి సంపూర్ణ మద్దతు తెలిపిన వైసీపీ నాయకుడు తాడేపల్లిలోనే తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటానని ఎన్నికల వేళ ప్రజల్ని నమ్మించాడు. గెలిచిన తర్వాత మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించి, చివరకు ఇప్పుడు దసరా నుంచి విశాఖలో పాలన మొదలుపెడతానని చెబుతున్నాడు. విశాఖలో ఇప్పటికే లక్షల కోట్ల మేర సంపదను కాజేసి మళ్లీ అక్కడ నుంచి పాలన చేస్తున్నాం అని రాష్ట్ర ప్రజలకు గత 5 ఏళ్లలో రాజధాని లేకుండా చేసిన ఈ సీఎం వద్దు.
5. ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణగా చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గాలికి వదిలేసిన జగన్ మాకొద్దు..
* ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు 2022 జూన్ నాటికి పూర్తి చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. వైసీపీ మంత్రుల గడువు తేదీలకు లెక్కేలేదు. విభజన చట్టంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును అటక ఎక్కించడానికి ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రభుత్వం పన్నాగం పన్నింది. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించే ఒప్పందంపై సంతకం చేసి వచ్చి ఆంధ్ర ప్రజలకు కడుపు కోత మిగిల్చిన ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అసలే వద్దు.
6. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎన్నికల్లో ఘనంగా ప్రకటించిన వైయస్ జగన్ తర్వాత దానిని పూర్తిగా పక్కన పెట్టి మద్యాన్ని ఏరులై పారించి, లక్షలాది మందిని కల్తీ మద్యానికి బలి చేసినందుకు అస్సలు వద్దు..
* రాష్ట్రంలో మద్యం లేకుండా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి గత నాలుగేళ్లలో ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా రూ.1.10 లక్షల కోట్ల మద్యం అమ్మిన ప్రభుత్వం రికార్డు సృష్టించింది. డిజిటల్ లావాదేవీలకు ఏమాత్రం అవకాశం లేకుండా, డబ్బులు అక్రమంగా పక్కదారి పట్టించి భారీగా అవినీతికి పాల్పడింది. కేవలం మధ్యలోనే రూ. 40 వేల కోట్ల మద్యం ఆదాయం వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్ళింది. విషపూరిత రసాయనాలు కలిసిన మద్యం బ్రాండ్లను తీసుకువచ్చి ప్రజల జీవితాలతో ఆటలాడుకుని, ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మళ్ళీ వద్దే వద్దు..
ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు వద్దో చెప్పుకోవడానికి సవాలక్ష కారణాలు కనిపిస్తాయని మనోహర్ పేర్కొన్నారు.