Andhrapradesh:
దేశవ్యాప్తంగా బైక్పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను ప్రజలకు చేరవేస్తున్న జెన్-Z ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అభినందించారు. ఆమె చేపడుతున్న సాహస యాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
సోమవారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించిన సమయంలో వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెకు శ్రీశైలం ఆలయంతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
కనకదుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ను కలిసిన స్వాతి రోజా, ఆయన చూపిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలను ఆమె పవన్ కళ్యాణ్తో పంచుకున్నారు. అదేవిధంగా బైక్ రైడింగ్పై తనకున్న ఆసక్తిని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. యువత సాహసయాత్రల ద్వారా ఆధ్యాత్మికతను, సాంస్కృతిక విలువలను ప్రజలకు చేరవేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

