APpolitics: మన రాష్ట్రంలో పిల్లలకు మంచి ఆహారం, చదువు కలిపి ఇవ్వాలన్న సంకల్పంతో డొక్కా సీతమ్మ పథకం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యవేక్షణలో… ఈ పథకంలో కొత్త ఒరవడి వచ్చింది. ఆ ఒరవడి పేరు సన్న బియ్యం! మధ్యాహ్నన భోజన పథకంలో పోషకాలు కలగలసిన సన్న బియ్యం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుకు మంచి నిర్ణయం తీసుకున్నట్లయింది.
దొడ్డు బియ్యం వల్ల అన్నం ముద్దగా మారడంతో పిల్లలు తినలేకపోతున్నారని, దీంతో ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లల హాజరుశాతం పడిపోతోందని పీపుల్స్ పల్స్ సహా అనేక రీసర్చ్ సంస్థలు ఇప్పటికే అనేక క్షేత్రస్థాయి నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికల ఆధారంగా, పిల్లల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలనే సంకల్పంతో 2025-26 విద్యా సంవత్సరంలో డొక్కా సీతమ్మ పథకంలో ఉన్న 44,000కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, 4,000 హాస్టళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ మొదలుపెట్టింది. ఈ సన్న బియ్యం ద్వారా 37 లక్షల మందికి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోంది.
ఈ సన్న బియ్యానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. చిన్న వయసులో సరైన పోషకాహారం అందకపోవడం వల్ల విద్యార్థులు సరిగ్గా చదవలేకపోతున్నారని పిల్లల ఆరోగ్యం, విద్య, పోషణ, సురక్షితతపై నిరంతరం అధ్యయనం చేసే యూనిసెఫ్ సంస్థ అనేక అధ్యయనాల్లో వెల్లడించింది. ఈ సంస్థ మార్గదర్శకాల ప్రకారం…ఈ సన్నం బియ్యంలో లోహాలు, విటమిన్లు కలిపి రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు పోషకాహారం అందిస్తోంది. పైగా ఈ సన్న బియ్యం నేరుగా మన రైతుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీని వల్ల ఒకవైపు రైతులకు ఆదాయం, మరోవైపు పిల్లలకు తాజా, నాణ్యమైన బియ్యం అందించడంలో సహాయపడుతోంది. విద్యార్థులకు అందిస్తున్న ప్రతి సన్న బియ్యం బస్తాకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే, ఆ బియ్యం ఎవరు పండించారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకం, సర్టిఫికేషన్ వివరాలు తెలుస్తాయి. ఇది పాఠశాలల్లో సరఫరా తనిఖీ చేయడానికి, సమస్యలు ఉంటే తెలియజేయడానికి ఉపయోగపడుతుంది.
డొక్కా సీతమ్మ పథకానికి ముందుగా రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేసేవారు. ఇప్పుడు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ చొరవతో ఇప్పుడు పౌర సరఫరాల శాఖనే నేరుగా పాఠశాలలకు సన్న బియ్యం పంపుతోంది. దీంతో సరఫరా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారి, అక్రమాలు, లొసుగులు తగ్గాయి. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి క్యూఆర్ కోడ్ వ్యవస్థ తీసుకురావడం వల్ల సరఫరా గొలుసులో పారదర్శకత పెరిగింది, అవినీతి తగ్గింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంపై విద్యార్థుల అభిప్రాయం తెలుసుకోవడానికి కొంతమందితో మాట్లాడటం జరిగింది. సన్న బియ్యం రుచి, నాణ్యత పట్ల విద్యార్థులు సంతోషిస్తున్నారు. “ఇప్పుడు అన్నం రుచి చాలా బాగుంది. ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం కోసం ఎదురు చూస్తున్నాం” అని గుంటూరు జిల్లాలో ఆరవ తరగతి చదివే హరికా చెప్పింది. కర్రీల నాణ్యత పెరగాలని చెప్తున్నప్పటికీ…దాదాపు రాష్ట్రంలో ఇలాంటి అభిప్రాయమే వినిపిస్తోంది. సన్న బియ్యంతో అన్నం వండటం వల్ల పాఠశాలల్లో భోజనం తీసుకునే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది హాజరు పెరగడానికి, విద్యాభ్యాసానికి సానుకూల సంకేతంగా చూడొచ్చు. ప్రతి పాఠాశాలకు తగిన మోతాదులో బియ్యం అందివ్వడం పట్ల టీచర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సన్న బియ్యం ప్రవేశపెట్టడం వల్ల టీచర్లు కూడా విద్యార్థులు తినే ఆహారాన్నే తీసుకోవడం అనేక చోట్ల కనిపించింది. “సన్న బియ్యం వచ్చాక, డస్ట్ బిన్ లో వేస్టేజ్ తగ్గింది. క్యూఆర్ కోడ్ వల్ల సరఫరా ట్రాకింగ్ సులభమైంది” అని కాకినాడలోని ఒక గ్రామీణ పాఠశాల హెడ్మాస్టర్ వెంకట్రావ్ చెప్పారు. అయితే, కొన్ని పాఠశాలల్లో బియ్యం నిల్వ సౌకర్యాలు తక్కువగా ఉండటం, వంట నాణ్యతలో తేడాలు ఉండటం వంటి సవాళ్లు ఉన్నాయి. ఇవి పరిష్కారం కావాల్సి ఉంది.
తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా ఈ పథకం పట్ల ఉన్న సంతృప్తిని తెలియజేస్తున్నాయి. “నా కూతురు బడి భోజనం చాలా రుచిగా ఉందని చెప్తోంది. ఆరోగ్యంగా ఉంటోంది” అని విజయనగరంలో లక్ష్మి అనే మహిళ చెప్పారు. రైతుల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. “ఈ పథకం రైతులకు ఆదాయం ఇస్తోంది, పిల్లలకు మంచి భోజనం అందిస్తోంది. అందరికీ లాభం” అని గోదావరి జిల్లా రైతు రమేష్ అభిప్రాయపడ్డారు. సన్న బియ్యం వల్ల వంట పనిని సులభంగా మారిందని, అన్నం ముద్దగా మారే సమస్య తీరిపోయిందని వంట బాధ్యతను నిర్వర్తిస్తున్న స్వయం సహాయక బృందాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
స్టూడెంట్ యూనియన్లు కూడా ఈ పథకాన్ని అభినందిస్తున్నాయి. “సన్న బియ్యం పథకం ద్వారా పిల్లల ఆరోగ్యం, చదువుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అద్దం పడుతుంది” అని విజయవాడలోని ఒక స్టూడెంట్ లీడర్ రాజు చెప్పారు. పోషకాలు కలిగిన సన్న బియ్యం వల్ల రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఇప్పటికే అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లోనూ పునరావృతం అవుతుంది. మంచి భోజనం వల్ల పిల్లలు స్కూల్కు ఎక్కువగా వస్తున్నారు. “మొదటిసారి పిల్లలకు రుచికరమైన, పోషకాలతో కూడిన సన్న బియ్యం అందుతోంది.ఇది రైతులకు కూడా ఆదాయాన్ని, గౌరవాన్ని తెస్తోంది” అని మంత్రి నాదేండ్ల మనోహర్ చెప్పిన మాటలను ఏకీభవించకుండా ఉండలేం.
అయితే, ఈ పథకంలో సవాళ్లు కూడా ఉన్నాయి. సన్న బియ్యం ధర ఎక్కువ కావడం, కొన్ని పాఠశాలల్లో నిల్వ సౌకర్యాలు తక్కువగా ఉండటం, వంట నాణ్యతలో తేడాలు ఉండటం, క్యూఆర్ కోడ్ సిస్టమ్ సక్రమంగా ఉపయోగించేందుకు ఉపాధ్యాయకులను శిక్షణ అందించాల్సిన అవసరం కూడా ఉందని మా పరిశీలనలో తేలింది. గతంలో మధ్యాహ్న భోజనంలో వచ్చిన సమస్యలు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ సన్న బియ్యం పథకం పిల్లల ఆరోగ్యం, చదువు, రైతుల ఆదాయాన్ని మెరుగుపరుస్తున్న గొప్ప ప్రయత్నంగా చూడాలి. మొదటి దశలో అమలు సాఫీగా సాగింది, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మన పిల్లలకు ఆరోగ్యకరమైన, భవిష్యత్తు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పథకం… నిల్వ సౌకర్యాలు, ఖర్చు నిర్వహణ, శిక్షణ వంటి సవాళ్లను అధిగమించి, ప్రభుత్వం, ప్రజలతో కలిసి పనిచేస్తే ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం అవ్వడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది.