తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకొనున్నాయి. ప్రభుత్వ హామీ మేరకు థియేటర్లు తెరవాలని సిని ఎగ్జిబిటర్లు, థియేటర్లు నిర్వాహకులు నిర్ణయించారు. కరోనా లాక్ డౌన్ తో ఏడాది నుంచి థియేటర్లు మూసి ఉంచిన నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్నామని.. ఆదుకోవాలని ఎగ్జిబిటరర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం చాంబర్, సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సునీల్ నారంగ్, అనుపమ్రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్గౌడ్, బాలగోవింద్, రాజ్తాడ్ల తదితరులు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
థియేటర్లు మూసి ఉంచిన కాలానికి సంబంధించి ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని.. ఎస్జీఎస్టీని రద్దు చేయాలని.. షూటింగ్ అనుమతుల చార్జీలను తగ్గించాలని కోరారు.
కాగా సిని ఎగ్జిబిటర్లు, థియేటర్ల నిర్వాహకులు సమస్యలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి స్పందించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆదివారం నుంచి సినిమా థియేటర్లను తెరవచ్చని ఫిలిం చాంబర్ తీర్మానించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ థియేటర్లు తెరవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అంతా ఏకాభిప్రాయానికి వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ఫిలిం చాంబర్ నేతలు ప్రకటించారు