తెలంగాణ: ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసని.. సంస్థ విలీనం అంశం సిబ్బంది ఎప్పటినుంచో కోరుతున్న అంశమని పేర్కొన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడానికి తాను అడ్డుపడబోనని.. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నదే తన ఉద్దేశమని గవర్నర్ స్పష్టం చేశారు.
అంతేకాక తదుపరి నోటిఫికేషన్ ద్వారా సిబ్బంది ప్రయోజనాన్ని రక్షించేలా చూస్తానని.. ఉద్యోగుల ఆందోళన పరిష్కరించాలన్నదే తన ప్రధాన ధ్యేయమని తమిళి సై వివరించారు. చీఫ్ సెక్రటరీ పంపిన ఫైల్స్ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తున్నాయని.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు పూర్తిస్థాయిలో పటిష్టంగా ఉందా లేదా అన్నది తనకు ప్రధానమని గవర్నర్ తేల్చిచెప్పారు.
ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వం పంపిన వివరణతో సంతృప్తి చెందని గవర్నర్ కింద తెలిపిన ఆరు అంశాలపై వివరణ కోరారు.
1. కేంద్రం వాటా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం కాదా?
2. ఆర్టీసీ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు సమర్పించాలి.
3. తాత్కాలిక ఉద్యోగుల ప్రయోజనాల రక్షణకు తీసుకునే చర్యలు ఏంటి?
4. ఆర్టీసీ స్థిర , చరాస్తుల వివరాలు తెలపాలి . ఆర్టీసి స్థలాలు, భవనాలు ప్రభుత్వం తీసుకుంటుందా?
5. బస్సుల ,ఉద్యోగుల నిర్వహణను ఎవరు చూస్తారు? సిబ్బంది ప్రయోజనాల రక్షణలో కార్పొరేషన్ పాత్ర ఎలా ఉంటుంది?
6. ఆర్టీసీ ఉద్యోగులు డిప్యూటేషన్ పై సంస్థలోనే పనిచేస్తారా?