దేశంలో మరోసారి పెరగనున్న వంట గ్యాస్ ధర..

దేశంలో నిత్యవసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడిపై ధరల భారం ఎక్కువవుతోంది. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరో చేదు వార్త వినాల్సి వస్తోంది. వంట గ్యాస్ ధరలను పెంచేందుకు చమురు సంస్థలు మరోసారి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి సిలిండర్‌పై ఏకంగా 100 రూపాయలు వరకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి సహజవాయు కంపెనీలు. అయితే దీపావళి పండుగకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 వరకు పెరగనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందునే తాము కూడా ధరలను పెంచాల్సి వస్తోందని చమురు, సహజవాయు కంపెనీలు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. జూలై నుంచి ఇప్పటివరకు రూ.90కిపైగా సిలిండర్ ధర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.952గా కొనసాగుతోంది.

Related Articles

Latest Articles

Optimized by Optimole