APpolitics: ‘వై నాట్‌ 175’ ఎవరి నినాదమయ్యేనో!

APpolitics: ‘వై నాట్‌ 175’ ఎవరి నినాదమయ్యేనో!

APpolitics:   వై నాట్‌ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి? ఉన్నట్టుండి ఓ నినాదం శిబిరం మారిస్తే ఎలా ఉంటుంది? రాత్రికి రాత్రి నాయకులు శిబిరాలు మారుస్తున్న రాజకీయ వాతావరణంలో ఉన్నాం! నాయకుల సంగతలా ఉంచి…. నిన్నటి దాకా ఒక శిబిరంలో ఘాటుగా చలామణి అయిన ఓ నినాదం ప్రత్యర్థి శిబిరానికి మారి, అక్కడ చర్చనీయాంశమౌతున్న పరిస్థితి!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయంలో ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషణలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని 175 కు 175 స్థానాలూ గెలవాలన్నది ఆయన తపనగా ఉండిరది, ‘సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎందరు ఏకమైనా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ధీటుగా ఎదుర్కొంటాం’ అని గంభీరంగా పలికిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు టీడీపీ`జనసేన`బీజేపీ కూటమిగా ఏర్పడ్డాకఉలిక్కిపడ్డారు. వారి ఊహలు తారుమారై, ఏ పొరపొచ్చాలూ లేకుండా పాలూ`నీళ్లలా కలిసిపోయిన కూటమి రాష్ట్రమంతా బలపడుతున్న తీరు పాలక వైకాపాలో కొంత చికాకు పెంచింది. అందుకు నిదర్శనమా అన్నట్టు పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌ మళ్లీ ఆ నినాదాన్ని ఎక్కడా ఎత్తడం లేదు. దీన్ని బట్టి ఇన్నాళ్ల ‘వైనాట్‌ 175’ గర్జన మేకపోతు గాంభీర్యమా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.ఈ పరిస్థితి చూసిన కూటమిలో పట్టుదల పెరిగింది. బయటకు అనకపోయినా… ‘ఏం, మనమెందుకు 175 పై గురిపెట్టి, క్లీన్‌స్వీప్‌ కోసం యత్నించొద్దు?’ అన్న అంతర్గత సంభాషణలు సాగుతున్నాయి.

 


ఎన్నికల్లో పొత్తులు సాధారణం. అంతిమంగా ఎవరు గెలిచారు? అన్నదే ప్రధానం! ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలద్దని జనసేన`టీడీపీ`బీజేపీ పొత్తుకు సిద్ధమైతే, అది నేరమైనట్టు, లోగడ ఎవరూ పొత్తు పెట్టుకోనట్టు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. పొత్తులను వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగానే చూడాలి.


2004లో టీడీపీని గద్దె దించడానికి వైఎస్‌ఆర్‌సీపీ ఆరాధ్యదైవం, దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి నేతఅత్వపు కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ కూడా 2014లో తెలంగాణలో సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో బీజేపీని ఓడిరచడానికి కాంగ్రెస్‌ ‘ఇండియా’ కూటమిని ఏర్పటు చేస్తే, మూడోసారి అధికారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వపు బీజేపీ చిన్నచిన్న పార్టీలతో సైతం పొత్తులకు దిగింది. పొత్తులు పెట్టుకున్న డా.వైఎస్‌ఆర్‌, నరేంద్ర మోదీలు సింహాలు కాదా..? పిల్లులా..? దీనికి వైఎస్‌ఆర్‌సీపీ నేతల వద్ద సమాధానం ఉందా?

జనసేన- టీడీపీా – బీజేపీ పొత్తు దరిమిళా వైఎస్‌ఆర్‌సీపీకి ఒక్క సీటూ రాదని ‘పందేల ఉభయగోదావరి’ జిల్లాల్లో పందేలు కాస్తున్నారు. ఉత్తరాంధ్రాతో పాటు ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకూ ఈ పొత్తు ప్రభావం బలంగా ఉండే అవకాశాలున్నాయి. రాయలసీమలో గట్టి పోటీ ఇవ్వగలదు.
ప్రముఖ సంస్థలు ఏపీలో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే గతంలో కంటే టీడీపీ`జనసేన`బీజేపీ ఓట్ల శాతం పెరిగినట్టు వెల్లడవుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతిచ్చిన వివిధ సామాజికవర్గాలు, సమూహాలు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యాయని సర్వే సంకేతాల్ని బట్టి తెలుస్తోంది. ప్రజాక్షేత్రం ఇలా ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ 175 సీట్లు గెలుచుకోవడం ఎలా సాధ్యం?

క్షేత్రం నుంచి లభించే ప్రాథమిక సమాచారం, సర్వే గణాంకాల ద్వారా వెల్లడయ్యే ద్వితీయ సమాచరం కూడా ఒకే విషయాన్ని దృవపరుస్తున్నాయి. జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు ఏ విధంగా ఉండబోతోందో పరిశీలించడానికి ప్రముఖ సిఎస్‌డిఎస్‌`లోక్‌నీతి సంస్థ వివిధ అధ్యయనాల ద్వారా వెల్లడిరచిన డేటాను అన్వయించినపుడు… 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి కట్టగా జనసేన మద్దతిచ్చింది. అప్పుడు టీడీపీకి 44.5 శాతం, బీజేపీ 2.18 శాతం కలిపితే 46.68 శాతం ఓట్లు రాగా, వైఎస్‌ఆర్‌సీపీకి 44.12 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 2.56 శాతం ఓట్ల తేడాతో టీడీపీ అధికారం చేపట్టింది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన టీడీపీకి 39.26 శాతం, జనసేనకు 5.15 శాతం, బీజేపీకి 0.84 శాతం ఓట్లు వచ్చాయి. 49.95 శాతం ఓట్లు, 151 సీట్లతో వైసీపీ అధికారం చేపట్టింది. టీడీపీ 24 సీట్లలో గెలిచింది. విడిగా తలపడ్డ టీడీపీ-జనసేన-బీజేపీలు సాధించిన ఓట్లను కలిపితే వారికి మరో 34 చోట్ల గెలిచే అవకాశాలుండేవి. అదేవిధంగా 1 నుండి 2 శాతం ఓట్లతో ఓడిపోయిన స్థానాలు 10 కాగా, 3 నుండి 5 శాతం ఓట్లతో ఓడిపోయిన స్థానాలు 11 ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే… నాడు తక్కువ తేడాతో ఓడిన 21 సీట్లలో మెజారిటీ ఈసారి కూటమికి దక్కే ఆస్కారముంది. అంటే, 79 స్థానాల్లో 70కిపైగా కూటమి సాధించొచ్చు.


2019లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వైసీపీికీ 45.55, టీడీపీకి 27.32 శాతం వచ్చాయి. ఒపీనియన్‌ మేకర్స్‌గా పేరున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు వైసీపీపై అసంతఅప్తితో ఉన్నారు. సీపీఎస్‌ రద్దు, సమయానికి జీతాలు రాకపోవడం, బెనిఫిట్స్‌ అందకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో వారు కనబరచిన ఉత్సాహంలోనే వారి మనోభావాలు స్పష్టమయ్యాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పి కూడా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో నిరుద్యోగ యువత జగన్‌ ప్రభుత్వంపై కోపంగా ఉంది. శాసనమండలి ఎన్నికల్లో (పట్టభద్రులు) మూడు సీట్లనూ టీడీపీ గెల్చుకుంది. 2019లో టీడీపీకి వచ్చిన ఓట్లతో పోలిస్తే 2023 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఉత్తరాంధ్రాలో 4.27%, తూర్పు రాయలసీమలో 5.28%, పశ్చిమ రాయలసీమలో 3.78% ఓట్లను పెంచుకుంది. వైసీపీ ఉత్తరాంధ్రాలో 18.89%, తూర్పు రాయలసీమలో 19.10%, పశ్చిమ రాయలసీమలో 13.37% ఓట్లను కోల్పోయింది. ఓటమిపై ఆత్మపరిశోధన చేసుకోకుండా పట్టభద్రులు తమ ఓటర్లు కాదని వైసీపీ నిస్సిగ్గుగా ప్రకటించింది. వాలంటీర్ల సాయంతో తిరిగి అధికారంలోకి రాగలమని వైసీపీ భావిస్తోంది. కానీ, ఎమ్మెల్సీ ఫలితాల్ని బట్టి వాలెంటీర్ల ప్రభావం నామమాత్రమేనని స్పష్టమైంది.

రాష్ట్రంలో పథకాల నుంచి పార్టీ టికెట్ల వరకు ప్రతిదీ కులం చుట్టే తిరుగుతోంది. దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ‘క్యాస్ట్‌ వార్‌’ ఉంటుందే తప్ప సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పే ‘క్లాస్‌ వార్‌’ మాత్రం కాదు. సీఎస్డీఎస్‌`లోక్‌నీతి డేటా ప్రకారం 2014లో వైఎస్‌ఆర్‌సీపీకి 64 శాతం రెడ్లు ఓట్లు వేయగా, 2019లో అది 86 శాతానికి పెరిగింది. 2014లో వైఎస్‌ఆర్‌సీపీకి 57 శాతం వచ్చిన ఎస్సీ ఓట్లు 2019కి 76 శాతానికి, 2014లో 37 శాతం వచ్చిన బీసీ ఓట్లు 2019లో 39 శాతానికి పెరిగాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలే ఆ పార్టీకి వెన్నెముకగా ఉంటున్నారు. బీసీల్లో మార్పు వచ్చినప్పుడల్లా టీడీపీ ఓడిపోతూ వస్తున్నది. 1989, 2004, 2009, 2019 ఎన్నికల్లో ఇదే ప్రతిబింబించింది. 2014లో టీడీపీకి 54 శాతం బీసీ ఓట్లు రాగా, 2019లో 46 శాతానికి పడిపోయింది. బీసీల్లో 8 శాతం ఓట్లు కోల్పోవడం, టీడీపీకి ప్రధాన మద్దతుదారులైన కమ్మ సామాజికవర్గం ఓట్లు కూడా 2014 తో పోలిస్తే 12 శాతం తగ్గడంతో ఘోరంగా ఓడిరది. 2019లో 7 శాతం రెడ్లే టీడీపీకి మద్దతిచ్చారు. ఇంత తక్కువ రెడ్డి మద్దతు ఇదివరకెప్పుడూ లేదు.
2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన జనసేనకు వచ్చిన మొత్తం ఓట్లలో 26 శాతం కాపులవే! టీడీపీ`జనసేన`బీజేపీ కలిసి పోటీచేస్తే కొన్ని బీసీ కులాలు ఈ కూటమికి ఓటు వేయరని వైఎస్‌ఆర్‌సీపీ ప్రచారం చేస్తోంది. కానీ, 2014లో జనసేన టీడీపీకి మద్దతిచ్చినప్పుడు కూడా బీసీ కులాల ఓట్లు 54 శాతం టీడీపీ కే లభించాయి. ఈ పొత్తుతో కుల సమీకరణాలు తిరిగి 2014లాగా మారి, కూటమికి అనుకూలించే ఆస్కారముంది. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడల్లా టీడీపీకి ముస్లిం ఓట్లు తగ్గుతున్నాయి. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే టీడీపీకి 33 శాతమే ముస్లిం ఓట్లు రాగా, 2019లో బీజేపీకి ఎదురు తిరగడంతో అవి 46 శాతానికి పెరిగాయి. 2014 ఎన్నికలప్పుడు గోద్రా మారణహోమం వంటి అంశాలు ప్రచారంలో ఉన్నా 33 శాతం ముస్లింలు టీడీపీతోనే ఉండటం విశేషం!

2019 ఎన్నికల్లోలాగా ఏకపక్షంగా రెడ్డి సామాజికవర్గం వైసీపీ వైపు నిలబడేందుకు ఇప్పుడు సిద్ధంగా లేరు. వాలంటీర్లను తీసుకొచ్చి, స్థానికంగా తమ నాయకత్వాన్ని దెబ్బ తీశారని పాలకపక్షంపై ఆగ్రహంగా ఉన్నారు. వర్గాల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ప్రతి సామాజికవర్గంలో, సమూహాల్లో వైసీపీకి 2019లో దొరికిన మద్దతు ఇప్పుడు లభించకపోవచ్చు.
కూటమి లోపలాబయట, పొత్తుపట్ల సానుకూలత పెరిగింది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పవన్‌పై ఉన్న అభిమానం, వ్యక్తిగత ఆరాధన కూటమికి కలిసొచ్చే అంశం. ఈ రెండు జిల్లాల్లో జనసేనకు 15-25 శాతం ఖచ్చితమైన ఓట్లుంటాయి. కొన్ని స్థానాల్లో 30 శాతం వరకు, కొన్ని ఇతర జిల్లాల్లో 10-15 శాతం వరకూ ఆ పార్టీకి ఓట్లుంటాయి. రాయలసీమలో జనసేనకు కనీసం 5 శాతం వరకు నిర్ణయాత్మక ఓట్లున్నాయి.


ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి అకౌంట్లల్లో డబ్బులు వేయడం, సంక్షేమ పథకాలే వైఎస్‌ఆర్‌సీపీని గెలిపిస్తాయనుకుంటే అత్యాశే అవుతుందని జనవాక్యం. దివంగత ఎన్టీఆర్‌ తాను హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ 1983-89 వరకు అమలు చేసినా, 1989లో టీడీపీ ఘోరంగా ఓడటమే కాక కల్వకుర్తిలో స్వయంగా ఆయనే ఓటమి పాలయ్యారు. 2004`2009 మధ్య దివంగత నేత డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా 2009 ఎన్నికల్లో బటాబటి మెజార్టీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల ఫలితాల తరువాత మీడియా సమావేశంలో, శాసనసభ సాక్షిగా, తమకు పాస్‌మార్కులు మాత్రమే వచ్చాయని వైఎస్‌ఆర్‌ స్వయంగా అంగీకరించారు. ప్రభుత్వం పథకాల లబ్ది చేకూరుస్తున్నా, పెరిగిన నిత్యవసర ధరలు, కరెంట్‌`బస్‌చార్జీలు, పన్నుల మోత తలుచుకున్నపుడు… ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాగేసుకుంటున్నట్లుందని విమర్శలున్నాయి. సంక్షేమం పేరిట అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రోడ్ల దుస్థితిపై జనం ఆగ్రహంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మటం లేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాలు మరింత మెరుగై వస్తాయనే భావన బలపడటమే కారణం. ‘ఒక్క చాన్స్‌ ఇస్తే, రాజన్న పాలన తీసుకొస్తా’ అన్నందుకు 2019లో వైఎస్‌ఆర్‌సీపీని జనం గెలిపించారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడానికి విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలా ఇప్పుడు దూరమయ్యారు. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధినేత్రి హోదాతో షర్మిల రోజూ, ఘాటుగా జగన్‌ను విమర్శిస్తున్నారు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలలో ఇప్పుడు అలాంటి కసి, పట్టుదల లేవు. సీఎంగా ఆయన ప్రస్తుత పాలనే గీటురాయిగా మారుతుంది కాబట్టి, ఈసారి దివంగతనేత డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సానుభూతి, ‘‘రాజన్న కార్డూ’’ పనిచేయదు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతిచ్చిన సామాజికవర్గాలు దూరమవుతుండగా, టీడీపీకి దూరమైన సమూహాలు, ముఖ్యంగా బీసీలు, రైతులు తిరిగి వారికి దగ్గరవుతున్నారు.


కూటమిలోని పార్టీలకు లోగడ లభించిన ఓట్ల శాతాలతో లెక్కించినా… ఈ సారి వారి విజయం తేలికే అనిపిస్తోంది. సామాజిక విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ చెప్పిన దృష్ట్యాంతమొకటుంది. దాన్ని ఇక్కడ అన్వయిస్తే…. కిందటి సారి కూటమి పార్టీలకు ఓటేసిన వారిలో ఎవరూ ఈ సారి వైసీపీకి వేస్తామన్నవారు లేరు. కానీ, కిందటి సారి వైసీపీకి ఓటేశామని అంగీకరిస్తూనే, ఈ సారి మాత్రం వైసీపీకి వేయబోమన్న వాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇన్ని సానుకూలతల మధ్య… జాగ్రత్తగా, సమైక్యంగా ముందుకు వెళితే నిస్సందేహంగా రేపటి ఎన్నికల్లో ‘వై నాట్‌ టీడీపీ-జనసేన`బీజేపీ?’ అనే నినాదమైనా నిజమౌతుంది.

================

– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ