Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పూర్ణచంద్రరావు. గత ఐదేళ్లుగా స్వేచ్ఛ ఈయనతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.. పెళ్లి చేసుకోకుండా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన స్వేచ్ఛ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా పూర్ణచంద్రరావుతో కుమార్తెకి తగాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై అతనితో కలిసి ఉండలేనని స్వేచ్ఛ తమతో చెప్పిన విషయాన్ని వెల్లడించారు. కుమార్తె మృతిపై అనుమానంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా, స్వేచ్ఛ మృతితో పూర్ణచంద్రరావు అదృశ్యమయ్యాడు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు, స్వేచ్ఛ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కీలక డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇక పూర్ణచంద్రరావు గురించి మరిన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. అతనికి గతంలో వివాహం అయినట్లుగా చెబుతున్నారు. సమాచారం ప్రకారం, అతను టీ న్యూస్లోనే ఓ సమయంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పని చేశాడు. బీఆర్ఎస్ ముఖ్య నేత సంతోష్ రావుకు అతడు అత్యంత సన్నిహితుడు అని, ఆయనే ఉద్యోగం ఇప్పించారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోనూ పూర్ణచంద్రరావు చురుకైన పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది.
అటు పూర్ణచంద్రరరావు బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కేసు చిక్కుముడి వీడాలంటే పూర్ణచంద్రరావును పోలీసులు పట్టుకున్న తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోస్టుమార్టం రిపోర్టులో మృతి కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.