విజయవాడ: ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సెటైర్లు పేల్చారు. సీఎం జగన్ పై ఆర్ధిక మంత్రికి బాగా నమ్మకం ఉన్నట్లు ఉందన్న ఆమె..జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది వస్తుందని ముందే గ్రహించారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ఎవరికి జీతాలు రాకపోయినా… ఆర్ధిక మంత్రి గారు మాత్రం టoచన్ గా జీతం తీసుకుంటున్నారని అన్నారు. తిరిగి తిరిగి తీసుకోచ్చిన అప్పుల్లో.. ఎందుకైనా మంచిదని ఆర్ధికమంత్రి తన జీతం ముందే తీసేసుకుంటున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
ఏపీలో అత్యంత నిరుపేదలు ఎవరైనా ఉన్నారంటే.. ఆర్థిక మంత్రి బుగ్గన మాత్రమేనని పద్మశ్రీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు ఏమైపోయిన పర్వాలేదన్న ధీమాలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. ముందు తన కడుపు నిండిందా లేదా అనే చూసుకునే వ్యక్తి బుగ్గన మాత్రమేనని కుండబద్దలు కొట్టారు. మాకు జీతాలు ఇవ్వండి మహాప్రభో అని ఉద్యోగులు మోర పెట్టుకుంటున్న ఆర్ధిక మంత్రిలో ఏమత్రాం చలనం లేదన్నారు. జగన్ ప్రభుత్వం చెబుతున్న కరోనా ఆర్ధిక కష్టాలు ప్రజలకు, ఉద్యోగులకేనా ? అని ఆమె ప్రశ్నించారు.దేశ చరిత్రలో ఒక ప్రభుత్వంపై ఉద్యోగులు గవర్నర్ కి ఫిర్యాదు చేసిన ఘటన ఎక్కడ లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందన్నారు.సీఎం జగన్ ఇకనైనా తన వాళ్ల సంక్షేమం కాకుండా తనను నమ్ముకున్న వాళ్ల ఆకలి బాధలు చూడాలని పద్మశ్రీ హితువు పలికారు.