National: బీహార్‌ ఎన్నికల దిక్సూచి ఎటువైపు…?

Bihar election2025:

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పాట్నా రాజధానిగా గల బీహార్… సంకీర్ణ ప్రభుత్వాలకు ‌పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌, జన్‌ సురాజ్‌ పార్టీలు బీహార్ రానున్న ‌ శాసనసభ ఎన్నికల్లో పోటాపోటీగా తలపడుతున్నాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలుండడంతో దేశ వ్యాప్తంగా బీహార్‌పై ఆసక్తి నెలకొంది.

బీహార్‌ రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువ. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రూ.28,485 తలసరి ఆదాయంతో దేశంలోనే పేద రాష్ట్రంగా నిలిచిన బీహార్‌ అస్తిరమైన ప్రభుత్వాలతో మరింత వెనుకబడింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ (యూ) కొద్ది కాలం తర్వాత మహాఘట్‌ బంధన్‌తో చేతులు కలిపింది. అనంతరం తిరిగి ఎన్డీఏతో జత కట్టింది. తొమ్మిది సార్లు బీహార్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీష్‌ కుమార్‌ పలుమార్లు కూటములు మారడం రాజకీయ అస్తిరతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల కూర్పు కూడా ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో ఎన్డీఏ ఎన్నికలకు సిద్దమవుతున్నా, కూటమిలోని బీజేపీ ఎత్తుగడలను అంచనా వేయలేము. మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వం వహిస్తున్న మహాఘట్‌ బంధన్‌ కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌దే ఆధిపత్యం. ఈ రెండు కూటములకు పోటీగా బరిలోకి దిగుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్‌ నేతృత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


రాష్ట్రంలో బీజేపీ, జేడీ (యూ) పార్టీలు సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ ఉండడంతో పాటు దాని మాతృ సంస్థ ఆర్‌ ఎస్‌ ఎస్‌ ప్రచారం కలిసి వచ్చే అంశం. రాష్ట్రంలో జేడీ (యూ) కంటే బలంగా కనబడుతున్న బీజేపీ సీట్ల కేటాయింపులోనే పైచేయికి వ్యూహాలు రచిస్తోంది. గత ఎన్నికల్లో 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 43 స్థానాల్లో గెలవగా, 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో తామే అధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ చెబుతుంటే, 2024 పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను చూపుతూ, సమ స్థానాల్లో పోటీ చేయాలని జేడీ(యూ) వాదిస్తోంది. లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో, జేడీ (యూ) 16 స్థానాల్లో పోటీ చేయగా ఈ రెండు పార్టీలు చెరో 12 చోట్ల గెలిచాయి. ఎన్నికల్లోపే కూటమిలో ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులేస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి హిందువుల్లోని అగ్రవర్ణాలు, యాదవేతరుల ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి మహిళల దన్నూ ఉంది. సీఎం నితీష్‌ బీహార్‌ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు ఇటీవల ప్రకటించడంతో ఎన్డీఏకు మహిళల మద్దతు రెండింతలైంది. దీంతోపాటు రోడ్ల నిర్మాణం, మద్య నిషేధం, సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏకు లబ్ది చేకూర్చనున్నాయి. నితీష్‌ కుమార్‌ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీయేకు సానుకూలంగా ఉన్నారు.
బలం సంగతి అలా వుంటే, నిజానికి పాలక ఎన్డీఏ కూటమికి బీహార్‌లో ఆశించినంత సానుకూలత లేదు. కూటమిలోని చిన్న పార్టీలతో సవాళ్లు ఎదురవుతున్నాయి. చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్న వేళ ఎన్డీఏ ఓట్లు చీలే ఆస్కారముంది. మరో పార్టీ హిందుస్థాని అవామ్‌ మోర్చ (హెచ్‌ఏఎమ్‌) ఎక్కువ స్థానాలు కోరుతుండడంతో కూటమిలో గందరగోళం నెలకొంది. ఎన్డీఏ కూటమి నాయకత్వ లోపం ఎదుర్కొంటుంది. సీఎం నితీష్‌ కుమార్‌ కు ప్రజాదరణ తగ్గడంతోపాటు వయసురీత్యా ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు కూడా మైనసే! 20 ఏళ్లుగా జేడీ (యూ) అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత కూడా గుదిబండగా మారనుంది. ప్రభుత్వోద్యోగాల భర్తీ ఆశించిన మేర జరగకపోవడంతో యువత అసంతృప్తిగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడాన్ని మహాఘట్‌ బంధన్‌ సానుకూలంగా మలచుకుంటే ఎన్డీఏకు తిప్పలు తప్పవు.
ప్రతిపక్ష మహాఘట్‌ బంధన్‌ ఆశలన్నీ ఆర్జేడీ వ్యవస్థాపకులు లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు ప్రజాదరణ ఉందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. రాష్ట్రంలో నిరుద్యోగం, ఉపాధి కోసం బీహారి యువత వలసలు, ద్రవ్యోల్బణంతో నిత్యవసర ధరలు పెరగడం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను యువనేత తేజస్వీ యాదవ్‌ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. వందేళ్లపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూటమిలో కీలక భాగస్వామి. వామపక్ష పార్టీలు కూటమికి అదనపు బలం. మైనార్టీ, ఓబీసీ ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఈ కూటమి భవిత్యం ముస్లిం, యాదవ్‌ సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలతో పాటు వికాశ్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపి)ల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య పైనే మహాఘట్‌బంధన్‌ విజయవకాశాలు ఆధారపడ్డాయి.


మహాఘట్‌ బంధన్‌ కూటమిలో పెద్దన్న పాత్ర పోషించాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ ఆచితూచి వ్యవహరిస్తోంది. 2020 శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ గెలుపు 19 చోట్లకు పరిమితం అవడం వల్లే అధికారానికి దూరమయ్యామనే భావన ఉంది. ఆ ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈ సారి జాగ్రత్త పడుతోంది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు ప్రజాదరణ ఉన్నా, ఆయన తండ్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ హయాంలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంతో ‘జంగల్‌ రాజ్‌’గా ముద్రపడడం ఆర్జేడీకి నష్టం చేకూర్చే అంశం. మరోవైపు మహాఘట్‌ బంధన్‌ పార్టీల మధ్య ఓట్ల బదిలీయే కూటమి విజయానికి పెద్ద పరీక్షగా మారనుంది.
జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడిరచిన ప్రశాంత్‌ కిశోర్‌ బీహార్‌ లో రాజకీయ అదృష్టంపై దేశ వ్యాప్త రాజకీయ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జన్‌ సురాజ్‌ పార్టీ స్థాపించిన ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో, యువతలో ఆదరణ ఉన్నా రాష్ట్ర కుల రాజకీయాలు, పొత్తు జిత్తుల మధ్య ప్రశాంత కిశోర్‌ వ్యూహాలు ఫలించడం అంత తేలిక కాదు. సోషల్‌ మీడియా వేదికలపై జన్‌ సురాజ్‌ బలంగా కనిపిస్తున్నా, సంస్థాగతంగా బలహీనంగా ఉంది. పరిమిత కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్త ప్రచారంమే ఆ పార్టీకి కష్టం. జన్‌ సురాజ్‌ గెలుపు కంటే, ఆ పార్టీ చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాఘట్‌ బంధన్‌ కూటమి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయం.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహరచనలు, ప్రణాళికలు రూపొందిస్తుంటే బీహార్‌ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల వేళ పాలక పక్షానికి మేలు చేసేలా పనికట్టుకొని భారీగా ఓట్లను, అనుమానాస్పదం పేరుతో తొలగిస్తున్నారని, ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో, బీహార్‌ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. దీనిపై ఉన్నత న్యాయ స్థానం కూడా జోక్యం చేసుకొని ఎన్నికల కమిషన్‌ కు కొన్ని సూచనలు చేసింది.
ఎన్నికల కమిషన్‌ గణాంకాల ప్రకారం బీహార్‌ లో 40 లక్షలకుపైగా ఓటర్లపై అనుమానాలున్నాయి. వీటిలో 14 లక్షలకుపైగా మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయంటారు. 19 లక్షలకుపైగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. 7 లక్షల మంది ఇతర చోట్ల కూడా ఓటర్లుగా నమోదయ్యారు. 11 లక్షలకుపైగా ఓటర్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. ఓటర్లలో బంగ్లాదేశ్‌, మయాన్మార్‌, నేపాల్‌ దేశస్తులున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే, ఏడాది కిందటి లోక్‌సభ ఎన్నికలప్పుడు రాని ఈ అంశాలన్నీ ఇప్పుడే రావడం వివాదాస్పదమవుతోంది. ప్రక్షాళనపై అభ్యంతరాలు లేకపోయినా ఎన్నికల ముందు చేపట్టడంపైనే సందేహాలున్నాయి.
నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్‌లో జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపథ్యంలో బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. తేడావస్తే మాత్రం నితీష్‌ కుమార్‌ వైఖరీలో మార్పు వచ్చినా ఆశ్చర్యం లేదని గతనుభవాలే చెబుతున్నాయి. ఎన్డీఏకు మెజార్టీ వచ్చినా నితీష్‌ కుమార్‌ విషయంలో బీజేపీ వైఖరి మారితే కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది. ఈ సమీకరణాల దృష్ట్యా బీహార్‌ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు కేంద్రకంగా మారనున్నాయి. ఎన్డీఏ, మహాఘట్‌ బంధన్‌, జన్‌ సురాజ్‌ పోరు మధ్య…. ఎలక్షన్‌ కమిషన్‌ తాజా ప్రక్షాళన-ప్రభావాలతో బీహార్‌ ఎన్నికల రాజకీయ దిక్సూచి ఎటు వైపు మళ్లేనో? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


-దిలీప్‌ రెడ్డి,
పొలిటికల్‌ అనలిస్ట్‌, డైరెక్టర్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ.

Optimized by Optimole