Becareful: పెళ్లయిన రెండో రోజుకే బిడ్డ పుట్టింది.. ఎలా?

Big alert:  పెళ్లయినవారికి పది నెలల తర్వాత కానీ బిడ్డ పుట్టే అవకాశం లేదు. అది కూడా వారిద్దరి మధ్య లైంగిక బంధం సరిగ్గా ఉంటేనే సాధ్యం. అయితే పెళ్లయిన రెండో రోజే బిడ్డ పుట్టడం ఎక్కడైనా సాధ్యమేనా? తమిళనాడులో ఈ విషయం జరిగింది. ఇది అనేక అనుమానాలకు ఆస్కారమివ్వడంతోపాటు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.

తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయికి, అబ్బాయికి గతేడాది అక్టోబరులో వివాహ నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు వారిద్దరికీ అస్సలు పరిచయం లేదు. పెద్దలు సంబంధం చూసి నిశ్చయం చేశారు. ఈ ఏడాది మార్చిలో వారి పెళ్లి జరిగింది. పెళ్లిలో, పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో అమ్మాయి ముభావంగా ఉండటం అందరూ గమనించారు. అయితే పెళ్లి పనుల్లో అలిసిపోవడం వల్ల అలా ఉందని అంతా అనుకున్నారు.

అత్తారింటికి వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి, ఆమె వెంట వచ్చినవారు విడిగా ఓ గదిలో ఉండిపోయింది. అత్తింటి వాళ్లెవర్నీ లోపలికి రాకుండా చూసుకున్నారు. ‘కొత్తిల్లు కదా, అమ్మాయి సిగ్గుపడుతోంది కాబోలు’ అని అత్తింటివారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రెండో రోజు ఉదయం కొత్త పెళ్లికూతురు కడుపునొప్పితో ఇబ్బంది పడుతోంది. నొప్పి మరీ ఎక్కువ కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు తనకు ప్రసవ నొప్పులు వస్తున్నాయని, వెంటనే లేబర్ వార్డుకు పంపించారు.

ఈ విషయం తెలిసి అత్తింటివారికి ఆశ్చర్యంగా అనిపించింది. పెళ్లయిన రెండో రోజు ప్రసవం ఏమిటని వారంతా అనుమానపడ్డారు. అమ్మాయి పుట్టింటివారిని పిలిచారు. వారు వచ్చి విషయం తెలుసుకొని, కాసేపు తటపటాయించి ‘దీనికి కారణం మీ అబ్బాయే’ అన్నారు. వాళ్ల మాటల ప్రకారం, పెళ్లికి ముందే అబ్బాయి అమ్మాయి శారీరకంగా కలిశారు. అయితే అక్టోబరులో వాళ్లు కలిశారు అనుకున్నా, ఇప్పటికి ఆరు నెలలే అయ్యింది. అంతలో బిడ్డ ఎలా పుడుతుంది? ఆ విషయం బయటకు ఎందుకు చెప్పలేదు?

ఇదే మాట అమ్మాయి తరఫు వాళ్లను అడిగారు. ‘నిశ్చితార్థం మేలో జరిగింది కదా. అప్పుడే వాళ్లిద్దరూ కలిశారు’ అన్నారు వాళ్లు. మే నుంచి మార్చికి పది నెలలు ఉంది కాబట్టి వాళ్లు ‘మే’ నెల అనే మాట అనేశారు. ఏదో మోసం జరుగుతోందని అబ్బాయి ఇంటివాళ్లకు అర్థమైంది. నిశ్చితార్థం మేలో జరగలేదని, అక్టోబరులో జరిగిందని, ఐదు నెలల్లో బిడ్డ ఎలా పుడతుందని గొడవకు దిగారు. అదేదో మీ అబ్బాయినే పిలిచి అడగాలని వాళ్లు అన్నారు. ఈ చర్చ ఇక్కడ ఇలా జరుగుతుండగానే అక్కడ కొత్త పెళ్లికూతురికి ప్రసవం జరుగుతోంది.

కొత్త పెళ్లి కొడుకు ఆసుపత్రికి వచ్చాడు. అతనికీ ఈ విషయం ఆశ్చర్యంగానే ఉంది. తనకు, ఆ అమ్మాయికీ ఇప్పటివరకూ శారీరకంగా ఎటువంటి బంధం ఏర్పడలేదని అతను కచ్చితంగా చెప్పేశాడు. ఆడపిల్లవాళ్లు ఒప్పుకోలేదు. నీ వల్లే ఆ అమ్మాయికి గర్భం వచ్చిందని గొడవపడ్డారు. అలా అనుకున్నా, అక్టోబరులో జరిగిన నిశ్చితార్థానికి, మార్చిలో జరిగిన పెళ్లికి ఐదు నెలలే ఉందని చుట్టూ ఉన్నవారు వాదించారు. మొత్తానికి ఆ అమ్మాయికి బిడ్డ పుట్టేసింది.

‘ఆ బిడ్డ నీ బిడ్డే అని, అమ్మాయిని, ఆ బిడ్డనీ తీసుకుని వెళ్లమని’ అమ్మాయి ఇంటివాళ్లు బలవంతం చేశారు. అబ్బాయి వాళ్లు ససేమిరా అన్నారు. నిజమేమిటో చెప్పకుండా తమను మోసం చేస్తున్నారని వాదించారు. గొడవ పెద్దదైంది. అమ్మాయిని తీసుకెళ్లకపోతే మీ మీద వరకట్నం వేధింపుల కేసు పెడతామని అమ్మాయి తరఫువాళ్లు బెదిరించారు. మమ్మల్ని మోసం చేశారని మీ మీద కేసు పెడతామని అబ్బాయి తరఫువాళ్లు గట్టిగా నిలబడ్డారు.

చివరకు కొందరు పెద్దమనుషులు ముందుకొచ్చి సర్దిచెప్పాలని చూశారు. ‘జరిగిందేదో జరిగిపోయింది, కావాలంటే ఆ బిడ్డను వాళ్ల పుట్టింట్లో ఉంచేయ్. ఆ అమ్మాయితో కాపురం చేసుకో’ అని సూచించారు. దానికి అబ్బాయి ఏమాత్రం సిద్ధంగా లేడు. ‘అమ్మాయి తప్పు చేసింది. విడిపోవడమే మేలు’ అని ఇటు అమ్మాయి తరఫువాళ్లకు చెప్పాలని చూశారు. వాళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. తన అమ్మాయి ఆ అబ్బాయితోనే ఉండాలని పట్టుబట్టారు.

చివరకు ఈ పంచాయితీ కులపెద్దల దాకా చేరింది. రెండు కుటుంబాలనూ పిలిపించి మాట్లాడారు. ‘అమ్మాయి కడుపుతో ఉన్న విషయం కనీసం పెళ్లిలో అయినా చూడలేదా?’ అని వాళ్లు అబ్బాయి తరఫు వాళ్లను ప్రశ్నించారు. అమ్మాయి పెళ్లికి పట్టుచీరలు, లెహంగాలు వేసుకోవడం వల్ల గుర్తుపట్టలేదని వాళ్లు చెప్పారు. పెళ్లి ఫొటోలు చూశాక వాళ్లకూ నిజమే అనిపించింది. అమ్మాయిదే తప్పని తేలింది. ఆమె నాలుగో నెల గర్భవతిగా ఉన్నప్పుడే నిశ్చితార్థం చేశారని తెలిసింది. అప్పటికీ ఆమె తరఫు మనుషులు మాత్రం తప్పు ఒప్పుకోవడం లేదు. అమ్మాయి అత్తారింటికి వెళ్లాలని పట్టుబట్టారు. కులపెద్దలు వారికి ఉన్న విషయం చెప్పి, అమ్మాయిని బిడ్డతో సహా పుట్టింటికి పంపించారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతో ఉంటోంది. మధ్యలో రాయబారాలు జరుగుతున్నాయి కానీ, అబ్బాయి తరఫువాళ్లు ఒప్పుకోవడం లేదు.

ఆ అమ్మాయితో కలిసి ఉండటానికి అబ్బాయికి ఇష్టం లేదు. ఆ అబ్బాయికి విడాకులు ఇవ్వడానికి అమ్మాయి తరఫువాళ్లు అంగీకరించడం లేదు. రేపోమాపో ఈ విషయం కోర్టుకు వెళ్తుంది. అక్కడ ఈ కేసు నాలుగైదు ఏళ్లు నడుస్తుంది. అప్పటిదాకా ఆ అమ్మాయి పుట్టింట్లో ఇబ్బందులు పడుతూ బిడ్డను పెంచాలి. ఇటు అబ్బాయి మరో పెళ్లి చేసుకోకుండా బతకాలి. పెద్దల తప్పుడు నిర్ణయం, మోసం కారణంగా ఇద్దరి జీవితాలు ఇలా ఎటూకాకుండా పోయాయి.

PS: నిజంగా అలా గర్భవతిగా ఉంటూ మోసం చేయడం సాధ్యమేనా అనే అనుమానం రావొచ్చు. రెండేళ్ల క్రితం గుంటూరుకు చెందిన ఒకావిడ రైలు ఎక్కబోతుండగా ఉన్నట్టుండి కడుపునొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమెకు ప్రసవం చేశారు. ఆమె కడుపుతో ఉన్న విషయం ఆమెకే తెలియలేదని తర్వాత తెలిసింది.

– విశీ

Optimized by Optimole