తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినేట్ మంత్రిగా ‘కిషన్ రెడ్డి’..

సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. విద్యార్ధి దశ నుండే జాతీయవాదాన్ని పుణికి పుచ్చుకుని.. నమ్మిన సిద్ధాంతాన్ని సమాజంలో విస్తరింపచేస్తూ.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి.. తెలంగాణ తరపున తొలి కేబినేట్ మంత్రిగా ఎదిగిన గంగాపురం కిషన్ రెడ్డి ప్రస్థానం ఎందరో యువనేతలకు ఆదర్శం.

సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా… కిషన్రెడ్డి ప్రస్థానం

విద్యార్థి దశ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గంగాపురం కిషన్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. జయప్రకాశ్ నారాయణ్, వాజ్‌పేయి ఆదర్శాలకు ఆకర్షితుడై…. విద్యార్థి దశలోనే జనతా పార్టీలో చేరారు. టూల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన కిషన్‌రెడ్డి… 1980 నుంచి 1994 వరకు భాజపా కార్యాలయంలోనే నివాసముంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1980లో భాజపా రంగారెడ్డి జిల్లా యువమోర్చా కన్వీనర్‌ బాధ్యతలతో ప్రారంభం కాగా… 2002లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.

2004లో మొదటిసారి ఎమ్మెల్యే…
2004లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లిన కిషన్‌రెడ్డి… 2009లో అంబర్‌పేట్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2010లో ఉమ్మడి రాష్ట్ర భాజపా పగ్గాలు స్వీకరించి… నాలుగేళ్ల పాటు ఏపీ అధ్యక్షుడిగా, 2014 నుంచి 2016 వరకు తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాజపా చివరి అధ్యక్షుడిగా.. తెలంగాణ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత కిషన్ రెడ్డికి దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా… మరుసటి ఏడాది 2019లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టారు. తొలిసారి ఎంపీ అయిన కిషన్‌రెడ్డికి మోదీ మంత్రివర్గంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా స్థానం దక్కింది.

ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి:

మోదీతో కలిసి యూఎస్ పర్యటన…
విద్యార్థి దశ నుంచే సమస్యలపై పోరాడే నైజం ఉన్న కిషన్‌రెడ్డి… హైదరాబాద్‌లో భాజపా చేపట్టిన అన్ని ఉద్యమాల్లోను కీలక పాత్ర పోషించారు. యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయం నుంచి నేపాల్ సరిహద్దు బిహార్ వరకు సరిహద్దు భద్రతా చైతన్య యాత్ర- సీమా సురక్షా జాగరణ యాత్ర నిర్వహించి… దేశ సరిహద్దుల్లో నివసించే ప్రజల్లో చైతన్యం నింపారు. ‘వరల్డ్‌ యూత్‌ కౌన్సిల్‌ ఎగైనెస్ట్‌ టెర్రరిజం’ అధ్యక్షుడిగా తీవ్రవాద ప్రభావిత దేశాల్లో పర్యటించి… అనేక ఉగ్రవాద వ్యతిరేక సదస్సుల్లో కిషన్‌రెడ్డి ఉపన్యసించారు. 1994లో యువమోర్చా జాతీయ కార్యదర్శిగా అమెరికా ప్రభుత్వ ఆహ్వానం మేరకు నాడు గుజరాత్ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నేటి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి భాజపా ప్రతినిధిగా కిషన్‌రెడ్డి అమెరికా ప్రభుత్వ పనితీరు, ప్రజల జీవన విధానాలపై అధ్యయనం చేసేందుకు 45 రోజుల పాటు యూఎస్లో పర్యటించారు.
ఆదర్శ యువనాయకుడు…
15 ఏళ్లు శాసన సభ్యుడిగా ఉన్నా… ఏనాడు వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయకుండా కిషన్‌రెడ్డి హుందాగా వ్యవహరించారు. భాజపా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా నది ప్రాంతంలోని కృష్ణ గ్రామం నుంచి 2012లో తెలంగాణ పోరుయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర 24 రోజులపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కొనసాగింది. శాసనసభలో చిన్న పిల్లల అంశంపై అత్యధిక సమయం మాట్లాడిన శాసనసభ్యుడిగా ఐరాస నుంచి బెస్ట్‌ చైల్డ్‌ ఫ్రెండ్‌ ఎమ్మెల్యేగా అవార్డు అందుకున్నారు. అమెరికా మేరీలాండ్ స్టేట్ గవర్నర్ చేతులమీదుగా దేశంలోని ఆదర్శ యువ నాయకుడిగా అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఇండో అమెరికన్ వ్యాపార సంబంధాలను కొనసాగించే కమిటీల్లోనూ సభ్యుడిగా కిషన్‌రెడ్డి పనిచేశారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ…
కేంద్ర సహాయ మంత్రి హోదాలోనూ… తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రాష్ట్ర అవసరాలు, కేటాయింపులు, నిధుల విడుదలలో మంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ సకాలంలో పనులు జరిగేలా కృషి చేస్తున్నారు. చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ ప్రాంతీయ కార్యాలయ తరలింపు, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణలో కిషన్‌రెడ్డి తన వంతు కృషి చేశారు.
దేశవ్యాప్తంగా మహిళల రక్షణకు హెల్ప్ లైన్, జిల్లాల్లో ఆయుష్ కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కరోనా వేళ విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్‌’, విపత్తువేళ లాక్‌డౌన్‌ నిబంధనల రూపకల్పన, రాష్ట్రాల మధ్య సమన్వయ బాధ్యతలు పర్యవేక్షించారు. కరోనా సంక్షోభంలో సమర్థవంతంగా పనిచేసిన కిషన్‌రెడ్డి… మోదీ కేబినెట్‌లో పదోన్నతి పొందారు. ఆయనకు పర్యాటక, సాంస్కృతికశాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేటాయించారు.

కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కిషన్ రెడ్డి స్పందిస్తూ..”నాపై విశ్వాసం ఉంచిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తాను”.

“నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన శ్రీ అమిత్ షా గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. శ్రీ అమిత్ షా గారి శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇందుకుగానూ వారికి కృతజ్ఞుడనై ఉంటాను. బీజేపీ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారితోపాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను”-

“నవభారత నిర్మాణం కోసం శ్రీ నరేంద్రమోదీ గారి స్వప్నం సాకారాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ అమరవీరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతానికి నా ముందున్నాయి” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Optimized by Optimole