Apnews: ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం: నాదెండ్ల మనోహర్

Janasena: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందన్నారు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం  రూ. 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోళ్లు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 34,78,445 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, తూకం తేడాలు, తేమ శాతం తేడాలు లేకుండా నిబద్ధతతో ధాన్యం కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమని అన్నారు. శనివారం సాయంత్రం తెనాలిలోని మంత్రి మనోహర్  క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా  నాదెండ్ల మాట్లాడుతూ “గత వైసీపీ హయాంలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా తంటాలు పడేవారు. దళారీల ప్రమేయంతో అహర్నిశలు శ్రమ చేసి పండించిన పంటను సరైన ధరకు అమ్ముకోలేక మధనపడేవారు. అప్పటి ప్రభుత్వమే ఏ మిల్లర్ కు అమ్మాలో కూడా నిర్ణయించేది. మిల్లుల దగ్గర రాత్రింబవళ్లు వేచి చూసి మరి ధాన్యం అమ్ముకోవలసిన పరిస్థితి ఉండేది. ఎంత చేసిన సరైన మద్దతు ధర రాక తేమశాతం పేరు చెప్పి అన్నదాతను నిలువునా మోసం చేసేవారు. ఇన్ని జరిగి ధాన్యం అమ్మితే ఆ డబ్బులు ఎన్ని నెలలకు వస్తాయో.. అసలు వస్తాయో రావో కూడా తెలియని అయోమయ పరిస్థితి అన్నదాతల్లో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట అన్నదాతలకు సంబంధించిన సమస్యల మీద దృష్టి పెట్టాం. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరించి, రైతులకు డబ్బులు ఇవ్వకుండా బాకీ పెట్టిన రూ. 1674 కోట్లను నెలలోనే విడుదల చేసాం. అన్నదాతలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అది నిదర్శనం. దాని తర్వాత కూడా అన్నదాతల సమస్యల మీద, వారికి ఎలా మేలు చేయాలి అన్నదానిమీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు.

24 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేయడం రికార్డు..
గత ప్రభుత్వంలో అన్నదాతలు ఎంతగా మోసపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని..దాన్ని అధిగమించి ఈ ఖరీఫ్ సీజన్లో రూ. 8,003 కోట్ల ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా ధాన్యం డబ్బులను 24 గంటల్లో జమ చేయడం ఓ అరుదైన రికార్డుగా మనోహర్ అభివర్ణించారు. ధాన్యం కొనుగోలుపై వైసీపీ వర్గాలు దుష్ప్రచారం చేసినా దాన్ని తిప్పి కొట్టగలిగామని.. అన్నదాతలకు ఎక్కడా గోతాలు సమస్య, రవాణా సమస్య, తేమ సమస్య లాంటివి లేకుండా పటిష్టంగా ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగామని తెలిపారు. ధాన్యం కొనుగోలు తీరు మీద వైసిపి ఎన్ని పన్నాగాలు పన్నినా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని.. ఎక్కడా చిన్న పొరపాటుకు తావు లేకుండా, పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వ అతిపెద్ద విజయంగా మంత్రి పేర్కొన్నారు.


వైసీపీ రైతును నిలువునా మోసం చేసింది..
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీకి కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. కూటమి ప్రభుత్వం రైతుకు అన్ని విధాల అండగా ఉండే ప్రభుత్వం. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 4,038 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే, కూటమి ప్రభుత్వంలో 40,009 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది 746 శాతం అధికం. బాపట్ల జిల్లాలో వైసిపి హయాంలో 29,164 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తే, కూటమి ప్రభుత్వ హయాంలో 91,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది 215 శాతం అధికం. పల్నాడు జిల్లాలో వైసిపి హయాంలో కేవలం 67 మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 13,572 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వ హయాం కంటే కూటమి ప్రభుత్వ హయాంలో 18 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు చేయడం ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.5,699 కోట్ల రూపాయల మేర ధాన్యం కొనుగోలు చేస్తే, కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు రూ.8,003 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతుల ఖాతాలో వాటిని జమ చేయడం ఓ అరుదైన విషయం. వ్యవసాయం మీద, రైతుల మీద కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సమయంలో 4.36 లక్షల మంది రైతులు పంటలు వేస్తే, కూటమి ప్రభుత్వ హయాంలో 5.49 లక్షల మంది రైతులు పంటలు వేసుకోవడం కూటమి ప్రభుత్వం మీద రైతులకు ఉన్న నమ్మకాన్ని తెలుపుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Optimized by Optimole