J&Kpolls: గాయపడ్డ కశ్మీరీల తీర్పేంటి..??

Jammukashmir:

భూతలస్వర్గం కశ్మీర్ గాయాలు మాన్పే ఎన్నికల చికిత్సకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది ‘…ఇవన్నీ కాదు, మాకు ఎన్నికైన ప్రభుత్వం కావాలి’ అంటున్న సగటు జమ్మూ -కశ్మీర్ ప్రజల ఆకాంక్ష తీర్చే ఎన్నికల ప్రక్రియ మొద లైంది! అధికరణం 370 ఎత్తివేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగలేదు. భారత ఎన్నికల కమీషన్ జమ్మూ-కశ్మీర్లో ఇటీవల రెండోసారి పర్యటించి, క్షేత్ర సమాచారం సేకరించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. భద్రతపై కేంద్రం ఇటీవలే ఓ ఉన్నతస్థాయి భేటీ జరిపింది. సెప్టెంబరు మాసాంతం లోపు ఎన్నిలు జరుపాలని సుప్రీంకోర్టు ఇదివరకే కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూ-కశ్మీర్లో వచ్చే సెప్టెంబరు 18 నుంచి అక్టోబర్ 1 వరకు 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ తేదీలు ప్రకటించింది. దశాబ్దాలుగా గాయాలతో నెత్తురోడుతున్న కశ్మీర్ అసలేం కోరుకుంటోంది? ప్రజలేమంటున్నారు? పార్టీలు ఎలా ఉన్నాయి? జనం ఆకాంక్షలు తీర్చే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందా? ఇవీ సమాధానం రావాల్సిన ప్రశ్నలు!

కశ్మీర్లో రేపు జరుగబోయే ఎన్నికలు, భారత రాజ్యాంగం అధికరణం 370 ఎత్తివేత సబబా, తప్పా తేల్చే ప్రజాతీర్పు (రెఫరెండం) లాంటివే! కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ అధికరణాన్ని కేంద్రంలోని బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం ఎత్తివేసి ఇప్పటికి సరిగ్గా అయిదేళ్లు. అధికరణం 370 కిందటి ప్రత్యేక ప్రతిపత్తి తాత్కాలికమైన ఏర్పాటు మాత్రమేనని, దాన్ని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని, కేంద్ర నిర్ణయాన్ని అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం కిందటేడు డిసెంబరులో సమర్థించింది. ఇక ఈ అంశంపై ప్రజాకోర్టు తీర్పు రేపటి ఎన్నికల ద్వారా వెలువడనుంది. చివరి సారిగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు 2014లో జరిగాయి. అప్పుడు ఏర్పడ్డ బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 2018 నవంబరులో రద్దయి, కశ్మీర్ రాష్ట్రపతిపాలనలోకి వచ్చింది. ఆగస్టు 2019లో అధికరణం 370 రద్దయి, కశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోవడమే కాక జమ్మూ -కశ్మీర్, లడక్ రెండు కేంద్రపాలిత ప్రాంతా (యూటీ) లుగా విడిపోయింది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలన లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో, లెఫ్ట్నెంట్ గవర్నర్ కింద, అధికారుల పాలనే ఇప్పటికీ సాగుతోంది. దీని పట్ల ప్రజల్లో అసంతృప్తి బలపడుతూ వస్తోంది.
ఉన్నతస్థాయి అధికారుల్లో యాబై శాతానికి మించి బయటివారే అనేది జనాగ్రహం. రాష్ట్ర హోదా సత్వరం-జాప్యంతో నిమిత్తం లేకుండానే ఎన్నికలు జరిపి తీరాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు దరిమిళా వాటిని వెంటనే నిర్వహించాల్సి న అత్యవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే ‘పీపుల్స్పల్స్’ సర్వే సంస్థ క్షేత్ర అధ్యయనం చేస్తోంది. ఇంతలో కశ్మీర్లో ఎన్నికల నగారా మోగింది.

ప్రజాభిప్రాయమే గీటురాయి…
ఎన్నికలు, తద్వారా ఏర్పడే ప్రజాప్రభుత్వాన్ని కశ్మీరీలు కోరుకుంటున్నారు. చరిత్రలో తరచూ ఎన్నికల బహిష్కరణకు మొగ్గే ఇక్కడి ప్రజలు, అనూహ్యంగా ఎన్నికల్లో స్వచ్ఛందంగా పొల్గన్నారు. నిన్న ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో, రికార్డు స్థాయిలో 58 శాతం పోలింగ్ నమోదు చేశారు. దీనికి ధీటుగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల నిర్వహణ ద్వారా మాత్రమే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. రాజకీయ ఆలోచనా విధానమైనా, ఎన్నికల్ని చూసే దృష్టయినా జమ్మూ ప్రాంత ప్రజలు కశ్మీర్ లోయవారికి లోగడ కొంత భిన్నంగా ఉండేవారు. కానీ, ఇప్పుడు అంతా ఒకే రీతిన ఆలోచిస్తున్నట్టు జనక్షేత్రంలో పర్యటిస్తున్న ‘పీపుల్స్పల్స్’ పరిశీలకుల దృష్టికి వచ్చింది. అధికారుల పాలన బాగోలేదంటున్నారు. సమస్యలు జఠిలమౌతున్నాయి తప్ప పరిష్కారాలు లభించడం లేదనే భావన ఉంది. ప్రజాప్రతినిధుల వ్యవస్థ లేక పాలనలో ప్రజల భాగస్వామ్యం కొరవ డింది. రాష్ట్రం ఉన్నపుడు… శీతాకాలం జమ్మూలో, వేసవి శ్రీనగర్లో (రెండు రాజధానులు) జరుపుకొనే ‘దర్బార్’ల పట్ల ఒకప్పుడు ముక్కువిరిచిన వారు కూడా ఇప్పుడు వాటిని కోరుకుంటున్నారు. జిల్లా అభివృద్ది మండళ్లు (డీడీసీ), బ్లాక్ అభివృద్ది మండళ్ల (బీడీసీ) వ్యవస్థతో మేలేమీ లేదనే పెదవి విరుపుంది. ప్రజలకు నమ్మిక కలిగించేందుకు, వారి వినతుల స్వీకరణకు లెఫ్ట్నెంట్ గవర్నర్ ‘ఆమ్ కీ అవాజ్’ కార్యక్రమం పెట్టినా, ‘బ్యాక్ టు విలేజ్’ వంటి ప్రోత్సాహక చర్యలు చేపట్టినా ప్రజలు అంతగా సంతృప్తి చెందడం లేదు. కేంద్రం చెప్పే అభివృద్ది మిథ్య అని, కొత్తగా తెచ్చిన ‘డొమిసిల్ లాస్’ వల్ల, స్థానికతకు భంగం కలుగటమే కాక కశ్మీరీ భూములు బయటివారి పాలయ్యే ప్రమాదాన్ని స్థానికులు శంకిస్తున్నారు. టోల్ ప్లాజాలు, విరివిగా వైన్స్లు, తావి-రావి నదుల గర్భం నుంచి ఇసుక తరలింపు వంటివి… కశ్మీరీలకు నచ్చడం లేదు. పెట్టుబడులతో ప్రయివేటురంగం విస్తరించని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తోంది. ఇదొక పెద్ద సమస్య! నిరుద్యోగిత దేశసగటు (6.6 శాతం) కన్నా కశ్మీర్లో అత్యధికంగా (10.7 శాతం) ఉండటం చదువుకున్న యువతలో అశాంతిని రేపుతోంది.


శాంతి భద్రతలే సవాల్!
కశ్మీర్లో ఉగ్రవాదర-శాంతిభద్రతల పరిస్థితిని ఎలా కొలవాలి? అన్నదెప్పుడూ మీమాంసే! ఇదివరకు కశ్మీర్ లోయ, సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైన ఉగ్రవాద చర్యలు, హింస ఇటీవల జమ్మూతో సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. దాడులు, ఇతర హింసాత్మక చర్యలు ఇటీవలి కాలంలో పూంచ్, రజౌరీ, దోడ, కత్వ, దంగ్రీ వంటి ప్రాంతాల్లోనూ చోటుచేసుకున్నాయి. లోగడ ఈ పరిస్థితి లేదు. రిటైర్డ్ జడ్జీలు, విశ్రాంత సైనికాధికారులు, ఇతర విద్యావంతులతో కూడిన బృందమొకటి ఇటీవల జమ్మూ-కశ్మీర్ వివిధ ప్రాంతాల్లో పర్యటించి, ‘మానవ హక్కుల’పై అధ్యయన నివేదిక విడుదల చేసింది.ఉగ్రవాదచర్యలు పెరిగినట్టు నొక్కిచెప్పింది. ఏడాది కాలంలో సాధారణ పౌరుల మీద తీవ్రవాదుల దాడి సంఘటనలు పెరిగి, సుమారు పాతిక ఘటనలు నమొదయ్యాయంది. పౌరుల మీద ఉపా(యుఏపీయే) వంటి ఉగ్రవాద చట్టాల కింద నమోదు చేసే కేసుల సంఖ్య కూడా రమారమి (2020-2023 లో 2700) పెరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు.

పరువు వేటలో పార్టీలు..

అధికరణం 370 అనుకూల, ప్రతికూల వాదనలెలా ఉన్నా… కశ్మీర్లో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రజాదరణ, పలుకుబడి పరీక్షకు సిద్దమయ్యాయి. గాయపడ్డ నేల మీద, కొత్త భరోసా కల్పిస్తూ కశ్మీరీల మనసు గెలువ చూస్తున్నాయి. 370 ఎత్తివేసిన తర్వాత, దేశ ప్రధాని-బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ ఇప్పటికి నాలుగుసార్లు కశ్మీర్లో పర్యటించారు. ఇక కేంద్ర మంత్రులవి 72 పర్యటనలు. నిన్నటి లోక్సభ ఎన్నికల్లో, బరిలో దిగిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ (పిడిపి), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ)లను ప్రజలు ఓడించారు. అయిదింట రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు (జమ్మూ, ఉదమ్పూర్) గెలిస్తే, రెండు స్థానాలను నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) కైవసం చేసుకుంది. ఎన్సీ నాయకుడు ఒమర్ అబ్దుల్లాపై ఒక స్వతంత్ర అభ్యర్థి, జైలు నుంచే పోటీపడి గెలుపొందడం విశేషం! రేపటి ఎన్నికల్లో పోటీ చేయనని ఒమర్ అబ్దుల్లా ప్రకటించిన నేపథ్యంలో, ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా కేంద్రకంగానే కశ్మీర్లో ఈసారి ‘ఇండియా’ కూటమి రాజకీయాలు సాగవచ్చు. కశ్మీర్ క్రికెట్ బోర్డుపరమైన అవినీతి కేసులో ఫరూఖ్పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు తాజాగా వెల్లడించడం, రేపటి ఎన్నికల్లో ఆయనకది కలిసి రావచ్చు! 370 అధికరణం రద్దు దరిమిళా… బీజేపీ పట్ల, దానితో అంటకాగుతున్న పార్టీల పట్ల ప్రజల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకతకు నిన్నటి ఫలితాలక నిదర్శనం. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల సరళిని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా విశ్లేషించినపుడు, ఇది మరింత స్పష్టమౌతోంది. ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే సంకేతాలు లేవు.

కిందటి (2014) ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచి, సంకీర్ణ సర్కారులో ప్రధాన భాగస్వామిగా ఉన్న పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ)కి నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే ఆధిక్యత దక్కింది. బీజేపీకి 29 చోట్ల, కాంగ్రెస్కు 7 చోట్ల ఆధిక్యత దక్కగా ఎన్సీ 36 చోట్ల ఆధిక్యత పొందింది. 2014 ఎన్నికల్లో 15 సీట్లు గెలిచిన ఎన్సీ, ఈసారి ఎక్కువ సీట్లు గెలిచి, ‘ఇండియా’కూటమిలో కీలకపాత్ర పోషించవచ్చు. కిందటి ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పరిస్థితి ఈసారి మెరుగుపడొచ్చు!

లోక్సభలో ప్రస్తుత విపక్షనేత రాహుల్గాంధీ, లోగడ కన్యాకుమారి నుంచి చేపట్టిన ‘భారత్ జోడో’యాత్రను కశ్మీర్లో ముగించినపుడు లభించిన ప్రజాదరణ దృష్ట్యా పార్టీ ఇక్కడ ఆశావహంగా ఉంది. ఇద్దరు తెలుగు నేతలు, ఆర్ఎస్ఎస్ ముఖ్యుడైన రామ్మాదవ్, నాటి బీజేపీ నాయకుడిగా 2014 ఎన్నికల్లో` తదనంతరం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తే, ఇప్పుడు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధినేత కిషన్రెడ్డి కశ్మీర్ ఇంచార్జీగా రేపటి ఎన్నికల్లో ముఖ్యభూమిక పోషించనున్నారు. స్థానిక నాయకుల నుంచి ఢిల్లీ పెద్దల దాకా ఎవరి పాత్ర ఎంతున్నా… కశ్మీరీల మనోభావాలే జమ్మూ-కశ్మీర్ భవిష్యత్తును లిఖిస్తాయి.

dilip reddy

-దిలీప్‌రెడ్డి,
పొలిటికల్‌ ఎనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ.

Optimized by Optimole