Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భవానీ భక్తుల జాతర..!

Devi Navratri:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు, భవానీ స్వాములు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం( 7 వ రోజు) శ్రీ సరస్వతి దేవిగా ( కాళరాత్రి ) దర్శనమిచ్చారు. అమ్మవార్లను దీపాలు , ప్రత్యేక పూలతో అలంకరించారు. భవానీ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను శరణువేడారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం బిజి బిజిగా గడిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. తనని కలవడానికి వచ్చిన పార్టీ శ్రేణులను కలిసి ముచ్చటించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. వివిధ కార్యక్రమాల తర్వాత భవానీ భక్తులతో కలిసి బిక్ష చేశారు.