హైదరాబాద్: యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని, రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించేతత్వం గల గడ్డ అని, ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “లీడర్” పేరిట నిర్వహించబోయే రాజకీయ శిక్షణా తరగతుల పోస్టర్ ను ఆదివారం నాడు తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ నెల మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు. జూలైలో హైదరాబాద్ లో శిక్షణా తరగతులు ప్రారంభించి ఆగస్టు నుంచి జిల్లాల్లో ప్రతీ నెల నిర్వహిస్తామని వివరించారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరు, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, యువత శిక్షణా తరగతుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధుల విధులు, పరిధి, పరిమితులు అందరికి తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజాసమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అభివృద్ధికి నిధులు సాధించడం వంటి అంశాలపై శిక్షణ ఉంటుందని వివరించారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే అన్ని దారులు ప్రజాసంక్షేమం వైపు వెళ్తాయని అభిప్రాయపడ్డారు.
యువతను, మహిళలను, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతీ ఒక్క నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. తాము చేస్తున్న పోరాటాలన్నింటికీ ఫలితం వచ్చేటటువంటి రోజు వచ్చిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చినందున రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం మహిళ అభ్యర్థుల నాయకులు కావాల్సిన అవసరం ఉంటుందని, డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ153కు పెరుగుతాయని, లోక్ సభ సీట్లు కూడా పెరుగుతాయని, కాబట్టి మనం నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ నిర్ణయాలు జరిగే చోట మన అభిప్రాయాలు ఉండాలని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
మరోవైపు తెలంగాణ జాగృతిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, మహిళలు చేరారు. వరంగల్, హన్మకొండకు చెందిన విద్యార్థులు, యువత, హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి, ముక్కపల్లి భారతి నాయకత్వంలో అంబర్ పేట ప్రాంతాలకు చెందిన మహిళలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.