లక్షలాది బిడ్డల జీవితాలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నపత్రాలను కోట్లకు కేసీఆర్ కుటుంబం అమ్ముకుంది: రేవంత్
Tcongress:“ కేసీఆర్.. బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీ, కొడుకును టాటాను చేసి నువ్వు చార్లెస్ శోభరాజ్ గా మారడమేనా బంగారు తెలంగాణ? ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో మర్రిగూడ క్రాస్ రోడ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం అక్కడే జరిగిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. “ ఈ రోజు ప్రశ్నపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి. 10వ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్ లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇంటర్ పరీక్ష పత్రాలను సరిగ్గా దిద్దికుంటే 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు బస్టాండులలో, జీరాక్స్ సెంటర్లలో దొరుకుతున్నాయి. లక్షలాది బిడ్డల జీవితాలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నపత్రాలను వందలాది కోట్లకు కేసీఆర్, అతని కుటుంబం అమ్ముకుంది. తెలంగాణలో పరీక్షలు రాయించలేని స్థితిలో రాష్ట్రంలోని ప్రభుత్వం ఉంది. సమైక్య రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఇదేనా కేసీఆర్ దేశానికి చూపించాలనుకుంటున్న తెలంగాణ మోడల్? ” అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నల్లగొండ జిల్లా అంటే రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, పాల్వాయి, ఆరుట్ల కమలాదేవి, చకిలం శ్రీనివాసరావు లాంటి నాయకులు గుర్తొస్తారన్నారు రేవంత్. బండినక బండి కట్టి అని నైజాం సర్కారు దుర్మార్గాలను ప్రశ్నించిన బండి యాదగిరిది ఈ జిల్లా బిడ్డేనని గుర్తు చేశారు. మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి ఈ నల్లగొండ బిడ్డ అని పేర్కొన్నారు.డిసెంబర్ 9న తర్వాతా కేసీఆర్ ఇంకా నేను ఉద్యమం చేయలేను చేతులెత్తేసి అండ కోసం జానారెడ్డి ఇంటికొచ్చి 7-8 గంటలు చర్చలు జరిపింది నిజం కదా అని రేవంత్ ప్రశ్నించారు. అనాటి చర్చల ఫలితంగావే జేఏసీ పుట్టుకొచ్చిందన్నారు. దొరగారు వస్తే జెండాలు కట్టింది మనం, రాష్ట్రం ఏర్పాటు అవుతుంటే ప్రాణాలు తీసుకుంది మనమని ఆయన వ్యాఖ్యానించారు. జేఏసీ అంటే జానా యాక్షన్ కమిటీ అని ఇక్కడి ప్రజలకి నేను గుర్తు చేయదలచుకున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు.
ఉద్యమ సమయంలో పదవులను ఎడమ కాలి చెప్పుతో సమానమని కేసీఆర్ అన్నాడు. కానీ ఆసన్నాసి తాను రాజీనామా చేసిన స్థానంలో సెలక్షన్లు, కలెక్షన్లు అంటూ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు అని కేసీఆర్ పై తీవ్రస్థాయిలో రేవంత్ విరుచుకుపడ్డారు..1969 తెలంగాణ ఉద్యమంలో మంత్రిపదవికి రాజీనామా చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ..మలి దశ ఉద్యమంలో అటువంటి త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని రేవంత్ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు టీ పీసీసీ చీఫ్. అది జరగాలంటే నల్లగొండలో 12కు 12 గెలిపించాలన్నారు. మీరు 12కు 12 గెలిపించండి అని రేవంత్ పిలుపునిచ్చారు. అదే జరిగితే రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తెచ్చే బాధ్యత మేం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిరుద్యోగులకు అండగా నిలవడానికి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ, ఇందిరా గాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీ మే మొదటివారంలో ఈ గడ్డకు రాబోతున్నారన్నారు. సరూర్ నగర్ సభకు వేలాదిగా తరలిరండని పిలుపునిచ్చారు. ఆ సభను విజయవంతం చేయాలన్నారు. కొత్త సంవత్సంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.