Minorityvotes: ముస్లీం ఓట్ల చుట్టూ ముగ్గుపోత..!

Muslimvoters:

పలు అస్తిత్వాలు, భాషా వైవిధ్యాలు, మత-కుల ప్రభావాల సంఘమంగా ఉన్న మహారాష్ట్ర ఎన్నికల సముద్రంలో రాజకీయ పార్టీలు ఎత్తుగడల ఈదులాటతో ఓట్లవేట మొదలెట్టాయి. ఎక్కడ? ఏ ఊతం పట్టుకుంటే, అధిక ఓట్లు దక్కి విజయతీరాలు చేరుతామనే వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. మూడేసి పార్టీలు జట్లు కట్టిన రెండు ముఖ్య కూటములు, ‘మహాయుతి’, ‘మహా వికాస్ అఘాడి’ (ఎమ్వీయే)లు ఇప్పుడిదే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక వ్యూహం, దాదాపు 12 శాతంగా ఉన్న ముస్లీం మైనారిటీల ఓట్ల చుట్టూ, ఎప్పట్లాగే రాజకీయ క్రీ(నీ)డ మొదలైంది. హిందుత్వకు వ్యతిరేకంగా వారి ఓట్లను సొమ్ముచేసుకునేందుకు ఒకరు, వారిని బూచిగా చూపి హిందూ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి మరొకరు… ఇదీ వరస! ఇక్కడ మెజారిటీ ముస్లీంలు వ్యూహాత్మకంగా ఓటు వేస్తారనే ప్రచారముంది. ‘ఎవరినో గెలిపించడం కన్నా మరెవరినో ఓడించడమ’నే వైఖరే వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందంటారు పండితులు. ముస్లీం అంశం ఈ ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపొచ్చన్నది గతాన్ని బట్టి అంచనాకు రావాల్సిందే!

రెండు బలమైన కూటములు తలపడుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పోటీ సూచనలే కనిపిస్తున్నాయి. మిత్ర విబేధాలు, పార్టీ చీలికలు, కొత్త కలయికలు, మారే సమీకరణాలు, ఒకరిపై ఒకరి పోటీ ప్రభుత్వాల ఏర్పాటు…. గడచిన అయిదేళ్లు మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి రాజ్యమేలింది. గట్టి సంఖ్యాబలంతో ఈసారి స్థిరమైన ప్రభత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదల అటు ‘మహాయుతి’, ఇటు ‘మహావికాస్ అఘాడీ’ కూటముల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, ఎవరూ ఏ అవకాశాన్నీ వదలకూడదనే తలంపుతో పావులు కదుపుతున్నారు. పూర్తి ఆధిక్యత కోసం ఇప్పట్నుంచే ఎత్తులు, పైఎత్తులకు తలపడుతున్నారు. ప్రధాన స్రవంతి ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్కు తోడు ప్రాంతీయంగా ప్రాబల్యమున్న శివసేన, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లూ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు కూటముల్లో క్రియాశీలక పాత్ర పోషించే శివసేన, ఎన్సీపీలు ఈసారి ప్రత్యేకంగా నాలుగు పార్టీలుగా తలపడుతున్నాయి. 2022-23లో చోటుచేసుకున్న ‘పవర్ పాలిట్రిక్స్’లో ఒక్కో పార్టీ రెండుగా చీలిన విషయం తెలిసిందే!

ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని శివసేన బీజేపీతో చేతులు కలిపి ‘మహాయుతి’లో భాగమైతే, ఉద్దవ్ థాక్రే నాయకత్వం వహిస్తున్న శివసేన కాంగ్రెస్తో కూడి మహా అఘాడీ భాగస్వామి అయింది. అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ మహాయుతిలో ఉంటే, శరద్పవర్ నేతృత్వపు ఎన్సీపీ ఎమ్వీయేలో భాగంగా ఉంది. ఇప్పుడీ రెండు కూటములు, రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న ముస్లీం ఓట్లపై దృష్టి కేంద్రీకరించాయి. వాటి చుట్టు ముగ్గుపోసి వ్యూహాలు అల్లుతున్నాయి. మైనారిటీలుగా ఉండి కూడా మెజారిటీ వారిని ఓడించడమనే ఎత్తుగడతో ముస్లీంలు ‘వోట్ జిహాద్’కు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. అవన్నీ తప్పుడు లెక్కలని, ముస్లింల ఉనికిని, త్యాగాలను కించపరిచేలా మాట్లాడుతున్న బీజేపీ నాయకత్వం, వారికి క్షమాపణలు చెప్పి ఎన్నికల బరిలో దిగాలని ప్రత్యర్థులు సవాల్ విసురుతున్నారు. కిందటిసారి ఎన్నికల్లో స్వల్ప (5 కన్నా తక్కువ శాతం) ఓట్ల వ్యత్యాసంతో గెలుపోటములు ఖరారయిన నియోజకవర్గాలు 71 ఉండటంతో ఈ వ్యూహ`ప్రతివ్యూహాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

‘ఓట్ జీహాద్’లో నిజానిజాలు
ఇదొక గణాంక ప్రాతిపదిక. ‘తాము బహుళ సంఖ్యాకులుగా ఉన్న ఒక నియోజకవర్గంలో ముస్లీం మైనారిటీలు మూకుమ్మడిగా బీజేపీ ప్రత్యర్థులకు ఓటువేసి మెజారిటీవర్గమైన హిందువులను ఓడిస్తున్నారు’ అన్నది బీజేపీ నాయకుల వాదన. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ‘ధూలే’ స్థానం పరిధి అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీజేపీ అభ్యర్థికి 1.9 లక్షల ఓట్ల ఆధిక్యత లభించినా, ముస్లీం ఆధిక్యత ఉన్న ఒక్క ‘మాలెగావ్ సెంటర్’ అసెంబ్లీ స్థానంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి లభించిన ఏకపక్ష ఆధిక్యత వల్ల బీజేపీ అభ్యర్థి నాలుగువేల ఓట్లతో ఓడిపోయినట్టు, ఉదాహరణతో పీపీపీ ప్రదర్శన ఇచ్చి ప్రచారం చేశారు. ఇదే కారణంగా మహాయుతి కూటమి 14 స్థానాలు కోల్పోయిందన్నది వారి వాదన. హిందువులు జాగృతం కావాలని బహిరంగంగానే చేస్తున్న ఈ ప్రచారంలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉండటం విశేషం. కానీ, ప్రత్యర్థి ఎమ్వీయే కూటమి నాయకులు దీన్ని ఖండిస్తున్నారు. అదంతా బీజేపీ చేస్తున్న ఓ ‘సానుకూల అన్వయవాదన’ తప్ప వాస్తవాలు వేరంటున్నారు. వారూ గణాంకాలతో తమ వాదన వినిపిస్తున్నారు. పైగా, లోక్సభ- అసెంబ్లీ ఎన్నికలకు పొంతన లేదని, ఇప్పుడు ఎక్కడి లెక్కలు అక్కడే ఉంటాయనేది వారి వాదన. ముస్లీం జనాభా అధికంగా ఉన్న 38 అసెంబ్లీ స్థానాల్లో, 2019 తో పోల్చిచూస్తే 20 (సగానికి ఎక్కువ) స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు 2024 ఎన్నికల్లో తమ ఓటు శాతాన్ని పెంచుకున్నట్టు జాబితా వెల్లడించారు. కిందటిసారి అసెంబ్లీకి ఎన్నికైన పదిమంది ముస్లీంలలో 8 మంది ఆ స్థానాల నుంచే వచ్చారు. ప్రస్తుత సభలోని మొత్తం పదిమంది ముస్లీం ఎమ్మెల్యేలలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, సమాజ్వాది పార్టీల నుంచి ఇద్దరేసి ఉండగా మజ్లిస్, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు. అధిక ముస్లీం జనాభా స్థానాలు కూడా ఏకపక్షంగా ఏం లేవని, ఆ 38లో కాంగ్రెస్11, బీజేపీ 11, అవిభక్త శివసేన 9, అవిభక్త ఎన్సీపీ 3, మజ్లిస్ 2, ఎస్పీ 2 స్థానాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు.


మజ్లీస్ ప్రభావమెంత?
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లీస్ (ఎఐఎంఐఎం) మహారాష్ట్ర ఎన్నికల్లో దశాబ్దకాలంగా పాత్ర పోషిస్తోంది. 2014 ఎన్నికలతో రంగ ప్రవేశం చేసి, ఔరంగాబాద్ సెంట్రల్, బైసుల్లా 2 అసెంబ్లీ స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది. ప్రకాశ్ అంబేద్కర్ నాయకత్వంలోని ‘వంచిత్ బహుజన్ అఘాడీ’ (వీబీయే)తో అప్పుడు ఏర్పడ్డ పొత్తు, 2019 ఎన్నికలప్పుడు సీట్ల పంచాయితీలో వికటించి ఆ రెండు స్థానాలు నిలబెట్టుకోలేకపోయింది. కానీ, మాలేగావ్ సెంట్రల్, ధూలే 2 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానం (ఔరంగాబాద్ సెంట్రల్) గెలిచి మజ్లీస్ మరోమారు వార్తలకెక్కింది. మరో నాలుగు చోట్ల రెండోస్థానంలో నిలిచింది. అంతే కాకుండా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లీస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం, అక్కడి గెలుపు మార్జిన్ కంటే అధికం. 2014 లో 22 చోట్ల పోటీ చేసి 0.9 శాతం ఓట్లు సాధిస్తే, 2019లో 44 చోట్ల పోటీచేసి 1.34 శాతం ఓటువాటా పొందింది. పరిమిత ప్రభావమే అయినా… తక్కువ ఓటు వ్యత్యాసాలతో గెలుపోటములు నిర్ణయమయ్యే తీవ్ర పోటీలో మజ్లీస్ అభ్యర్థులు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ముస్లీం ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకే పోటీ చేస్తోందనే ఆరోపణలు బీజేపీ వ్యతిరేకపార్టీల నుంచి మజ్లీస్ ఎదుర్కోవాల్సి వస్తోంది. గణాంకాలు మాత్రం ఆ వాదనను దృవపరచడం లేదు. ఉదాహరణకు విజేతల మార్జిన్ కన్నా మజ్లీస్ ఎక్కువ ఓట్లు పొందిన 13 నియోజకవర్గాల్లో, 7 చోట్ల బీజేపీ దాని భాగస్వాములు గెలిస్తే 6 చోట్ల కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి నెగ్గింది. ‘‘హర్యానా, జమ్ము`కశ్మీర్లో మేం పోటీ చేయలేదు కద, ముస్లీం ఓట్లు చీల్చలేదు కద, మరి కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు?’’ అన్న అసద్ ప్రశ్న హేతుబద్దమే అంటారు పరిశీలకులు. 5 చోట్ల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన మజ్లీస్ ఈసారి కూడా పెద్ద సంఖ్య స్థానాల్లో పోటీచేసే అవకాశాలున్నాయి. పొత్తులకు కలిసి రావాలంటే 28 స్థానాలు ఇవ్వాలన్న మజ్లీస్ ప్రతిపాదనకు ఎమ్వీయే అంగీకరించక ఇంకా పొత్తు కుదరలేదు. పొత్తు లేకుంటేనే బెటర్ అని ఎమ్వీయే భావిస్తున్నట్టుంది.


స్వల్ప వ్యత్యాసాలతో గుబులు..!
పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ముస్లీం ఓటింగ్ సరళి తమ అభ్యర్థుల గెలుపోటముల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన పార్టీల ఆలోచన. బిజేపీ పక్షాలు ఆందోళన చెందితే, వ్యతిరేక పక్షాలు కొంత ఆశావహంగా ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 శాతం కన్నా తక్కువ ఓట్ల తేడాతో 27 చోట్ల, 2- 3 శాతాల మధ్య ఓట్ల వ్యత్యాసంతో 14 చోట్ల, 3- 4 శాతాల మధ్య ఓట్ల తేడాతో 11 చోట్ల, 4- 5 శాతాల ఓట్ల మధ్య తేడాతో 19 చోట్ల, అంటే 5 శాతం లోపు ఓట్ల వ్యత్యాసంతో మొత్తం 71 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇలా తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన వారిలో బీజేపీ (29), కాంగ్రెస్ 12), శివసేన (5) తో పాటు ఇండిపెండెంట్లు (5) ఉన్నారు. ఇక ముస్లీం జనాభా 15 శాతానికి మించి ఉన్నవి 51 నిజయోజకవర్గాలు కాగా 10- 15 శాతాల మధ్య ముస్లీం జనాభా ఉన్న నియోజకవర్గాలు 54 ఉన్నాయి. 5`10 శాతాల మధ్య జనాభా ఉన్నవి 91, 5 కన్నా తక్కువ ముస్లీం జనాభా ఉన్నవి 92 నియోజకవర్గాలున్నాయి.

బీజేపీ, వారి మిత్రపక్ష అభ్యర్థులను ఎక్కడెక్కడ ఎవరు ఓడిరచగలుగుతారో… ఆ నమ్మకాన్ని బట్టే ముస్లీం ఓటర్లు అటువైపు మొగ్గవచ్చనే అభిప్రాయం ఉంది. ఏ అంశం ఏ మేరకు అభ్యర్థుల జాతకాలను మారుస్తుందో….. నవంబరు 23 వరకు వేచి చూడాల్సిందే!

===========================

_ దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, డైరెక్టర్ – పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

Optimized by Optimole