సమ్మక్కసారక్కజాతర;
ఓవైపు శివసత్తుల పూనకాలు.. మరోవైపు కోయదోరల విన్యాసాలు చూడటానికి రెండు కళ్లు చాలవు . వనదేవతలకు మొక్కులు చెల్లించడం.. అమ్మవార్లకు నివేదించే బంగారాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరించడం ఈజాతర ప్రత్యేకత. కుంభమేళ తర్వాత జరిగే అతిపెద్ద జాతర కోసం కోట్ల మంది భక్తులు వేచిచూస్తారు. ఇంతలా చెప్తున్నానంటే ఆజాతర ఏంటో ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది కదా! అదేనండి ! మాఘమాసంలో తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగేటువంటి సమ్మక్క _ సారక్క జాతర. ఆజాతర విశేషాలు ఏంటో తెలుసుకుందాం!
భారతదేశంలో కుంభమేళ తర్వాత జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతర కోసం ప్రపంచవ్యాప్తంగా కోటిమందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. రెండేళ్లకోసారి ఈజాతరను మాఘమాసంలో నిర్వహిస్తుంటారు. వనదేవతలను కొలవడం జాతర ప్రత్యేకత.
పురాణకథ;
పూర్వం మేడరాంకు చెందిన కోయదోరలు వేటకోసం అడవికి వెళ్లగా.. పులుల మధ్య పసి పాప కనిపిస్తుంది. ఆపాపను తమ గుడానికి తీసుకొచ్చి సమ్మక్కగా నామకరణం చేశారు. పాప రాకతో ఆప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. సమ్మక్కకు పెళ్లిడుకు రాగానే కాకతీయుల సామంత రాజైన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. సారాలమ్మను గోవిందరాజు వివాహమాడాడు. అయితే కరువు కారణంగా గిరిజనులు పన్నుచెల్లించకపోవడంతో అప్పటి ప్రభుత్వం తండాలపై యుద్ధం ప్రకటించింది. తండావాసులకు.. అధికారులకు మధ్య జరిగిన పోరులో పగిడిద్ద రాజు, నాగులమ్మ, సారాలమ్మ, గోవిందరాజు మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద ప్రాణాలు విడిచారు. అప్పటినుంచి సంపెంగ వాగు ను జంపన్న వాగుగా పిలవడం ఆనవాయితీ. ఇక తనవాళ్ల మరణవార్త విన్న సమ్మక్క ఆగ్రహంతో యుద్ధరంగంలోకి దిగి వీరనారిలా పోరాడింది. ఆమె పోరాటపటిమ చూసి కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడట. అయితే కాకతీయ సైన్యంలో ఓ సైనికుడు దొంగచాటుగా వెన్నుపోటు పోడవడంతోె తీవ్రగాయాలతో మేడారం చేరుకుని గ్రామానికి ఈశాన్యం ప్రాంతంలో ఉన్న చిలకల గుట్టవైపు వెళ్లి అదృశ్యమైపోయిందట. సమ్మక్క కోసం గూడెం వాసులు వెతకగా నెమలినార చెట్టు కింద కుంకుమభరణె కనిపించిదట. అంతలోనే ఈగడ్డ మీద పుట్టిన ప్రతీ వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని పాలించాలని.. ఇక్కడే రెండు గద్దెలు కట్టి రెండేళ్లకోసారి జాతర జరిపించాలని ఆకాశవాణీ వినిపించిదట.
సమ్మక్క పోరాట పటిమతో కళ్లు తెరుచుకున్న కాకతీయ ప్రతాపరుద్రుడు తండాలు కట్టాల్సిన పన్నులు రద్దుచేశాడట. అంతేకాక రెండేళ్లకోసారి జాతరను జరపాలని ఆదేశాలు ఇచ్చాడట.
అంగరంగ వైభవంగా వేడుకలు…
మాఘమాసంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈజాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు మొదట జంపన్నవాగులో స్నానం ఆచరించి సమ్మక్క దర్శనం కోసం వెళతారు.వేడకలో వెదురుకర్ర, కుంకుమభరిణెల్ని ఉత్సవమూర్తులుగా కొలుస్తారు. మొదటిరోజు సారాలమ్మ.. ఆమె భర్త గోవిందరాజులు ..తండ్రి పగిడిద్దరాజు గద్దెపైకి చేరుకుంటారు. కన్నేపల్లి నుంచి సారాలమ్మను.. కొత్తగూడెం మండలం పోనుగుండ్ల నుంచి పగిడిద్ద రాజును గద్దెపైకి పూజారులు తీసుకొస్తారు. గోవిందరాజును ఏటూరునాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి తీసుకొస్తారు. రెండోరోజు చిలకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు సమ్మక్కను కుంకుమభరిణె రూపంలో గద్దెపై ప్రతిష్టిస్తారు.మూడోరోజు భక్తులు బంగారం (బెల్లం) ,కానుకల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. నాల్గోరోజు దేవతలందరూ వన ప్రవేశం చేయడంతో భక్తులు దర్శించి తరిస్తారు.
ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు ;
జాతర కోసం వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు వరంగల్ కి చేరుకుని అక్కడి నుంచి మేడారంకు ప్రత్యేక బస్సుల్లో వెళ్లవచ్చు.