Apelection: ఏపీ ఎన్నికల్లో ముస్లిం, క్రిస్టియన్లే కీలకం..

Apelection2024:  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చలికాలంలోనే వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగువారి దృష్టి అంతా ఆంధ్రా ఎన్నికలపైనే ఉంది. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని వైఎస్‌ఆర్‌సీపీ ఆశిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వ పగ్గాలు ఖాయమని టీడీపీ- జనసేన కూటమి ధీమాగా ఉంది. రాష్ట్రంలోని పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంటే, అంతకంటే ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్నారని కచ్చితంగా చెప్పవచ్చు.

మైనార్టీల జనాభా, గత ఎన్నికల్లో వారు అనుసరించిన విధానం అంశాలను పరిశీలించడంతోపాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటూ పీపుల్స్‌పల్స్‌ శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే  మైనార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతారో అంచనా వేయవచ్చు. ఏపీలో సుమారు పది శాతం ముస్లింలు, ఒక శాతం క్రిస్టియన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు ఏపీలో మతమార్పిడీలు అధికంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాలలో కూడా మతమార్పిడీలు జరగుతున్నాయి. క్రిస్టియన్లతో పాటు ముస్లింలను కూడా కలుపుకుంటే దాదాపు 30 శాతం మైనార్టీల ప్రభావం ఎన్నికల్లో ఉండబోతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్‌, చిత్తుర్‌ జిల్లాలో పది శాతానికిపైగా, కడప, కర్నూలు జిల్లాలో పదిహేను శాతానికిపైగా మైనార్టీలున్నారు. ప్రధానంగా ముస్లింలు 64 స్థానాలకుపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకంగా ఉన్నారు.

మైనార్టీల నిర్ణయం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కంటే బీజేపీపైనే అధికంగా ఆధారపడి ఉంటోంది. ఇక్కడి పార్టీలు బీజేపీకి అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించే తీరునుబట్టి ముస్లింలు నిర్ణయం తీసుకుంటారని గత ఎన్నికల అనుభవాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ గత ఎన్నికల్లో పొందిన ముస్లిం ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి డేటాను పరిశీలిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయడంతో టీడీపీ 1996లో 36.7%, 1998లో 46.6%, 2009లో 24.8%, 2019లో 46% ముస్లిం ఓట్లు పొందింది. అదే బీజేపీతో కలిసి పోటీ చేసిన 1999లో 28.2%, 2004లో 34%, 2014లో 33% ముస్లిం ఓట్లు పొందింది.  బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పుడు ముస్లిం మద్దతు కోల్పోతున్న టీడీపీ, బీజేపీతో కలవకుండా పోటీ చేసినప్పుడు మాత్రం అధికంగా ముస్లిం ఓట్లను పొందుతోంది. బీజేపీతో పొత్తు లేకుండా 2009లో పోటీ చేసిన టీడీపీకి 24.8% ఓట్లే వచ్చాయంటే అందుకు ప్రధాన కారణం అప్పుడు రాష్ట్రంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కీలక దశలో ఉండడమే.

రాష్ట్ర విభజన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ 2014లో రికార్డు స్థాయిలో 66% మైనార్టీల మద్దతు పొందింది. అదే 2019 ఎన్నికలొచ్చే సరికి 17% ఓట్లు కోల్పోయి 49% ఓట్లే పొందింది. దీనికి ప్రధాన కారణాలు ఆ ఎన్నికలకు ముందు జగన్‌ బీజేపీ కేంద్ర నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించడం. ఈ చరిత్రలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఏమాత్రం ప్రభావం లేని బీజేపీ పరోక్షంగా ఇతర పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు.

వైఎస్‌.రాజశేఖరరెడ్డిని తమ ఆరాధ్య దేవుడిగా భావించే వైఎస్‌ఆర్‌సీపీ ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ ప్రధాన ఆశయమైన సెక్యూలర్‌ భావాలకు తిలోదకాలిస్తుందనే భావన రాష్ట్రంలోని మైనార్టీలలో నెలకొంది. వైఎస్‌ఆర్‌ ఎప్పుడూ రాజీ పడకుండా బీజేపీని, సంఘ్ పరివార్‌ సంస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో వైఎస్‌ఆర్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ కేసు కూడా పెట్టింది. ఇందుకు భిన్నంగా వైఎస్‌.జగన్‌ ప్రతిపక్షంలో

ఉన్నా, అధికారంలో ఉన్నా అనేక కారణాలతో మొదటి నుండి బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సయోధ్యగానే మెలుగుతున్నారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోయిన తర్వాత నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయకముందే జగన్‌ కలిశారు. అప్పటి నుండే జగన్‌ బీజేపీపై సాఫ్ట్‌కార్నర్‌గా ఉంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఇప్పటి వరకూ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకపోయినా, కేంద్రంలో అందరికంటే ముందే బీజేపీకి మద్దతిస్తుండడంతో రాష్ట్రంలోని మైనార్టీలు జగన్‌ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి రాష్ట్రంలో మొదటి నుండి ముస్లింలు, క్రిస్టియన్లు ఏకపక్షంగా మద్దతిస్తున్నారు. ముస్లింలతోపాటు క్రిస్టియన్లకు కూడా జగన్‌ బీజేపీ దోస్తీ నచ్చడం లేదు. క్రిస్టియన్ల ఓటింగ్‌ శాతం తక్కువే అయినా మతమార్పిడీతో క్రిస్టియన్లుగా మారుతున్న సామాజిక వర్గాలకు కూడా బీజేపీతో సయోధ్యపై జగన్‌ అంటే గుర్రుగా ఉన్నారు. బీజేపీతో జగన్‌ తీరు ఇలాగే కొనసాగితే  అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్‌ఆర్‌సీపీ ముస్లిం ఓట్లను నష్టపోయే అవకాశాలున్నాయని ఆ పార్టీ సానుభూతిపరులు భావిస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుండి బీజేపీపై దృఢవైఖరితో లేకుండా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. 1998లో చంద్రబాబు బీజేపీని విమర్శిస్తూ ఆ పార్టీ మసీదులు కూలుస్తుంటే తాము మసీదులు నిర్మిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. 1999 పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో 13 పార్టీలతో కూడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు కూటమిలోని నేతలకు చెప్పకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏవైపు మళ్లారు. 2004 ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండడంతో ఆ పార్టీతో పొత్తుపెట్టుకొని ఓడిపోయానని, ఇకపై బీజేపీతో కలవనని చంద్రబాబు చెప్పారు. మళ్లీ 2014లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు రాష్ట్రానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందనే కారణాలతో 2019 ఎన్నికల ముందు బీజేపీకి రాంరాం చెప్పారు. ఇకపై భవిష్యత్తులో ప్రాణంపోయినా బీజేపీతో కలవమని ఆయన చెప్పగా, టీడీపీతో ఇకముందు పొత్తు పెట్టుకోమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా అన్నారు. ఆ సమయంలో రాష్ట్రానికి వచ్చిన అమిత్‌షాను అడ్డుకొని దేశ వ్యాప్తంగా సంచలనం రేపారు టీడీపీ శ్రేణులు. నిప్పు, నీరుగా సాగిన వీరి తీరులో 2019లో టీడీపీ ఓటమి తర్వాత మార్పు వచ్చింది. 2019కి ముందు బీజేపీపై కఠినంగా వ్యవహరించిన చంద్రబాబు వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించింది.

ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని, రాష్ట్రానికి కావాల్సింది పాచిపోయిన లడ్డూలు కావని 2019లో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. బీజేపీతో పొత్తుపై ఆయన అనేక వివరణలు ఇచ్చినా మైనార్టీలు నమ్మడం సందేహమే. మైనార్టీలకు అన్యాయం జరిగితే మొదటగా తానే స్పందిస్తానని పవన్‌ చెబుతున్నా ప్రస్తుత బీజేపీ పోకడలతో ఆయన మాటలను మైనార్టీలు విశ్వసించడం కష్టమే.

బీజేపీ వ్యవహారాలను వ్యతిరేకించే మైనార్టీలకు ఇతర రాష్ట్రాల్లో  ప్రత్యామ్నాయాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో   ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌, బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్‌, ఒడిస్సాలో  బీజేడీ, కాంగ్రెస్‌లు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. ఆంధ్రాలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ-జనసేన కూటమే ఉండడంతో మైనార్టీలకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మొదటి నుండి పరిశీలిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ ప్రభావం నామమాత్రమే. రాష్ట్రంలో నోటాతో పోటీపడుతున్న బీజేపీ గురించి మైనార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో మైనార్టీలలో అభద్రతా భావం పెరగడంతో పాటు ఆపార్టీపై ఆగ్రహం కూడా ప్రారంభమైంది. అయోధ్య రామాలయం అంశంపై బీజేపీ దూకుడు, త్రిబుల్‌ తలాక్‌ రద్దు, కాశ్మీర్‌ 370 ఆర్టికల్‌ రద్దు, కామన్‌ సివిల్‌ కోడ్‌ ప్రతిపాదన వంటి నిర్ణయాలతో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని  ముస్లింలు భావిస్తున్నారు.

మణిపూర్‌లో క్రిస్టియన్లపై దాడులు చేసినా కేంద్రంలోని, ఆ రాష్ట్రంలోని బీజేపీ సర్కారు సరిగ్గా స్పందించలేదనే అసంతృప్తి ఏపీ క్రిస్టియన్లలో నెలకొని ఉంది. ఈ ఘటనపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు స్పందించకపోయినా పలు క్రిస్టియన్‌ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. మరోవైపు రాష్ట్రంలో మతమార్పిడీలు మితిమీరాయని పలు హిందూ సంఘాలు, సంఘపరివార్‌ పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నాయి. వీరికి పరోక్షంగా  బీజేపీ మద్దతుందని క్రిస్టియన్లు భావిస్తున్నారు. పై పరిణామాలతో ముస్లిం, క్రిస్టియన్‌ సామాజిక వర్గాలు బీజేపీపై ఆగ్రహంతో, ఆ పార్టీతో అంటకాగే పార్టీని కూడా శిక్షించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. అయితే రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ-జనసేన కూటమి మైనార్టీ భావాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే ఎదురుదెబ్బ తప్పదు.

స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేనివిధంగా ఒక రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షం మొత్తం కేంద్రంలోని పార్టీకి మద్దతిచ్చిన సందర్భం లేదు. ఏపీలో మాత్రం పార్టీలు బీజేపీ అడగకపోయినా పోటీపడి మద్దతిస్తుండడంతో ముస్లింలు, క్రిస్టియన్లు, ప్రజాసంఘాలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు బీజేపీనే సమర్థిస్తామంటే మరో ప్రత్యామ్నాయంగా నోటాకి ఓటు వేద్దామనే భావనతో మైనార్టీలున్నట్టు పీపుల్స్‌పల్స్‌ క్షేత్రస్థాయి పరిశీలనలో కనిపించింది. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిచేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉన్నారు.

బీజేపీ పోకడలపై దేశ వ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, ఎన్జీఓలు, మేధావుల సంఘాలు మండిపడుతున్నాయి. వారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో, తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడంలో విజయవంతమయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ-జనసేన కూటమి బీజేపీతో ఎంత దూరం పాటిస్తే అంత మంచిదనే వాస్తవాన్ని గుర్తించి మెలిగితే మేలు జరుగుతుంది. ప్రజాసంఘాలను, మేధావులను కలుపుకోకుండా, వారి సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ఎన్ని కూటములు ఏర్పాటు చేసుకున్నా బీజేపీ పుణ్యాన మైనార్టీల చేతిలో భంగపాటుకు గురవడం ఖాయం.

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

 

More From Author

Actress guttikonda hotness

Actress malavikamohnan mesmerizing