రైతులకు అండగా జనసేన నిలుస్తుంది: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి రైతులు ఆవేదనలో ఉంటే వారికి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం తన బాధ్యతలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విఫలమైందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నీట మునిగిన పంటను చూసి బాధలో ఉన్న రైతు తమ ఆవేదనను పంచుకొనే అవకాశం లేకుండా ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేసి, బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. మీడియా ముందుగానీ, ప్రతిపక్షాల దగ్గరగానీ మాట్లాడితే పథకాలు తీసేస్తామని రైతులను బెదిరిస్తున్న దాఖలాలు మా దృష్టికి వచ్చాయన్నారు. తడిచిన ధాన్యం రైతులది కాదు, వ్యాపారులది అంటూ సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కష్టపడి సాగు చేసే రైతును ఈ విధంగా వేధిస్తున్న తొలి ప్రభుత్వం వైసీపీదేనని దుయ్యబట్టారు. పంటలు కోల్పోయిన రైతులను కలిసి జనసేన పక్షాన అండగా ఉంటామని చెప్పాలని  పవన్ కళ్యాణ్ నాయకులకు, శ్రేణులకు సూచించారు. ఆ మేరకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నాయకులు క్షేత్ర స్థాయిలో రైతాంగాన్ని కలిసి నష్టాలను పరిశీలించి, రైతులకు బాసటగా నిలుస్తామని మనోహర్ హామీ ఇచ్చారు.

పంట కోతలు మొదలయ్యే సమయానికి ఆర్బీకేల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మనోహర్. కనీసం సంచులుగానీ, టార్పాలిన్ షీట్లుగానీ అందించలేకపోయిందన్నారు.వరి, మొక్కజొన్న మొలకలు వచ్చేస్తున్నాయని జనసేన శ్రేణులు గుర్తించాయని అన్నారు. వరి సాగు చేస్తే ఎకరాకి 33 బస్తాలు మాత్రమే తీసుకొంటామని చెప్పడం కూడా రైతులను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. గత మూడేళ్లుగా ప్రతి పంట సీజన్లో రైతులు నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నష్ట పరిహారం చెల్లింపు కూడా సక్రమంగా చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిచిన ప్రతి గింజను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తేమ శాతం, కొనుగోలు పరిమితి లాంటి నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందిపెడితే జనసేన పార్టీ కచ్చితంగా రైతుల పక్షాన నిలిచి పోరాడుతుందని మనోహర్ హెచ్చరించారు. 

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole