OTT: వలస నిట్టూర్పుల మాటున మానవత చూపిన ఓదార్పు..!

TouristFamily: 

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా గురించి చెప్పేముందు, ఓసారి దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారుల గురించి మాట్లాడుకుందాం. సరిహద్దు దేశాల నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వలసవచ్చే పరిస్థితి అమెరికాతోసహా ప్రపంచంలోని దాదాపు ప్రతిదేశం అనుభవిస్తూనే ఉంది. ఉన్న దేశంలో తిండి లేక, చేయడానికి పనిలేక, ప్రశాంతంగా ఉండే పరిస్థితులు కనిపించక పక్క దేశాలకు వెళ్లి ఎలాగోలా బతికేద్దామనుకునే పరిస్థితి చాలాచోట్ల ఉంది. మనదేశానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వలసదారులు ఎన్నో ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నారు. ఇందులో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మన దేశం నుంచి విడివడ్డ దేశాలు. ఈ దేశంలోని కొంతమందికి ఆ దేశాల్లో చుట్టాలు ఉన్నారు. సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు బాలూ మహేంద్ర పుట్టుకతో సింహళీ తమిళుడే. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడి ఆయన ఈ దేశ పౌరసత్వాన్ని పొందారు.

వలసదారుల్ని తమలో కలుపుకునేందుకు ఏ దేశానికీ ఇష్టం లేదన్నది వాస్తవం. వనరుల కొరత, ఉపాధి అవకాశాల్లో అసమానతలు, భద్రతలేమి, స్థానిక అల్లర్లు, రాజకీయ అస్థిరతకు అవకాశం వంటి కారణాలే ఇందుకు కారణం. శ్రీలంక వలసదారుల గురించి తెలియాలంటే ముందుగా శ్రీలంకలో జరిగిన పౌరయుద్ధం గురించి తెలియాలి. 1983 నుంచి 2009 వరకూ ఈ యుద్ధం జరిగింది. మెజారిటీ సింహలీయులకు మద్దతు పలికే ప్రభుత్వం, మైనారిటీ తమిళులకు మద్దతుగా నిలిచే ఎల్టీటీఈకి మధ్య ఆ దేశంలో జరిగిన గొడవలు, ఎల్టీటీఈని అణిచే క్రమంలో శ్రీలంక ప్రభుత్వం సాగించిన మారణకాండ ప్రపంచానికి తెలుసు. ప్రభాకరన్‌తోపాటు ఆయన కుటుంబాన్ని అక్కడి సేనలు ఎలా చంపాయో కూడా తెలుసు.

1983 కంటే ముందు కూడా అనేకమంది అటూఇటూ వచ్చినవారు ఉన్నారు. అయితే యుద్ధం కారణంగా అనేకమంది శ్రీలంక తమిళులు తమ దేశం వదిలి భారతదేశానికి శాశ్వతంగా రావాల్సి వచ్చింది. సుమారు లక్షకుపైగా శ్రీలంక తమిళులు భారతదేశానికి వచ్చారని అంచనా. అందులో చాలామంది అధికారిక లెక్కల్లో లేరు. వలస వచ్చినవారికోసం తమిళనాడులో సుమారు 107 క్యాంపులు ఏర్పాటు చేశారు. అంతకుమించిన జనాభా దేశంలో ఎక్కడెక్కడో స్థిరపడింది. ప్రస్తుతం భారతదేశంలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటకలో సుమారు 1,70,000 మంది దాకా శ్రీలంక తమిళులు ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలా వలస వచ్చినవారిని కొందరు మోసం చేసి, ఎలా వేశ్యలుగా మారుస్తున్నారో చెప్తూ భానుకిరణ్ 2009లో ‘అమలా సబేషిణి అల్ఫోన్స్ కోడైక్కాణల్’ అనే బీభత్సమైన తెలుగు కథ రాశారు. శ్రీలంకలో తమిళులు పడుతున్న ఇబ్బందుల గురించి 2013లో మన్నం సిందుమాధురి ‘యాళ్‌పాణం గోస’ కథ రాశారు.

2009లో యుద్ధం ముగిశాక కూడా వలసలు ఆగలేదు. సింహళీయులు అక్కడి తమిళుల మీద చూపిస్తున్న వివక్షే అందుకు కారణం. 2022లో ఆ దేశంలో భయంకరమైన ద్రవ్యోల్బణం నెలకొంది. ధరలు ఉన్నట్లుండి పెరిగాయి. పాల ప్యాకెట్‌కి కూడా వందల్లో చెల్లించాల్సిన పరిస్థితి. అనేకమంది ఉద్యోగాలు పోయాయి. శ్రీలంక తమిళుల పరిస్థితి ఘోరాతిఘోరంగా మారింది. ఆ సమయంలో ఓడ మార్గంలో బోలెడు మంది భారత్ చేరారు. అలా చేరిన ఓ కుటుంబ నేపథ్యాన్ని కథగా మార్చుకోవడం కొత్త పాయింట్. సినిమా చూడటానికి ఈ చరిత్ర అంతా తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఇదంతా తెలిస్తే సినిమా మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ‘వలస వచ్చినవారు తమ మంచితనంతో ఈ ప్రాంతం వారికి దగ్గరవడం, వారికి సమస్య వచ్చినప్పుడు అందరూ ఆ కుటుంబానికి అండగా నిలబడటం’ అనేది గతంలో చూసిన పాయింటే. దానికి రెండు దేశాల భాషనీ, సరిహద్దునీ నేపథ్యంగా ఎంచుకోవడం, పాత్రలకు సరైన నటులను పట్టుకోవడంలోనే సినిమా హిట్టు కొట్టేసింది. కథను వినోదాత్మకంగా నడిపిస్తూనే పాత్రల ఎమోషన్‌ను చూపించడం భలేగా కుదిరింది.

సిమ్రన్, శశికుమార్ చక్కగా చేశారు. వాళ్ల చిన్నబ్బాయి ‘ముల్లి’గా చేసిన కమలేష్ జగన్ గురించి ఇహ చెప్పక్కర్లేదు. యోగిబాబు కామెడీ..లాజవాబ్. రూ.8 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.86 కోట్లు సాధించిందంటే మాటలు కాదు. ఎక్కడా బోరు కొట్టకుండా చివరిదాకా ఓ ఫీల్‌గుడ్ సినిమాగా తీయడం బాగుంది. ఎటొచ్చీ, వాళ్ల మాటల్లో ఇళంగై తమిళం(శ్రీలంక తమిళులు మాట్లాడే తమిళం) సరిగ్గా సెట్ కాకపోవడం మాత్రం లోటు. శ్రీలంక నుంచి వచ్చిన తమిళ ప్రజల భాష కొంచెం వేరేగా ఉంటుంది. విన్నవారికి ఇట్టే అర్థమైపోతుంది. ఈ సినిమాలో కొంత పెట్టారు కానీ, అది సరిపోలేదని తెలిసిపోతుంది.

PS: సినిమాలో ‘అక్రమ వలసదారుల’ పట్ల అందరూ ప్రేమ చూపించడం మంచి పాయింటే అయినా, ఇది చాలా చర్చనీయమైన అంశం. మనదేశానికి మరో దేశపు వలసదారుల్ని భరించే శక్తి నిశ్చయంగా లేదు. చివరకు అది దేశ భద్రతకు ముప్పు తెచ్చే విషయమే. కానీ మానవత వైపు నిలబడాల్సిన సమయంలో తప్పకుండా ఆ కుటుంబాలను అక్కున చేర్చుకోక తప్పదు. కానీ ఎందర్ని? అలా ఎంతమందిని? కష్టం కదా.

– విశీ

Optimized by Optimole