కరీంనగర్: తెలంగాణ రాజకీయాల్ని ఊగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ పాలనలో అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయనీ, ఫోన్ ట్యాపింగ్ పేరుతో స్వేచ్ఛను హరించారని” ఆయన ఆరోపించారు. సిరిసిల్లను కేంద్రంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కార్యచరణ సాగిందని బండి సంజయ్ తెలిపారు. “దీనికి వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అనేక మంది బాధితులు ఉసురు పోసుకున్నారు. ఈ దుర్మార్గ చర్యలకు కేంద్ర పాత్రధారి ప్రభాకర్ రావు,” అని ఆయన విమర్శించారు.
బీజేపీ నేతలతో పాటు తన ఫోను కూడా ట్యాప్ చేయించారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఈ వేధింపులకు గురయ్యారు. అనుమానం పుట్టిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేయించిన ఘాతుక చరిత్ర కేసీఆర్దే” అని ఆరోపించారు. జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడం అత్యంత ప్రమాదకరమైన పరిణామమని పేర్కొన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. “గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే డిమాండ్ చేసిన సంగతి మరువలేం. ఇప్పుడు మాత్రం కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులు ఇవ్వడంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోంది,” అని ఆరోపణలు గుప్పించారు.
“ఏసీబీ మాజీ అధికారి రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ‘కేసీఆర్ చెప్పినట్టే ఫోన్ ట్యాపింగ్ చేశాం’ అని స్పష్టంగా చెప్పినా, కేసీఆర్పై ఇప్పటికీ నోటీసులు ఎందుకు జారీ చేయడం లేదు?” అని ప్రశ్నించారు. “కేసీఆర్, కేటీఆర్ల మధ్యా, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందా?” అని సంశయం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం తనపై మొత్తం 109 కేసులు పెట్టిందని వెల్లడించిన బండి సంజయ్, అప్పట్లో తనను అరెస్ట్ చేసిన పరిస్థితిని వివరించారు. “టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో అర్ధరాత్రి నా ఇంట్లోకి చొచ్చుకువచ్చి నన్ను అరెస్ట్ చేశారు. నేను నైట్ డ్రెస్లో ఉన్నానన్న విషయం తెలుసినా, ప్రభాకర్ రావు ఆదేశాలతోనే పోలీసులు నన్ను అరెస్టు చేశారు” అని గుర్తుచేశారు.
కేసీఆర్ పాలనలో మీడియా సైతం ఫోన్ ట్యాపింగ్కు బలి అయ్యిందని ఆరోపించారు. జర్నలిస్టులు తమ భద్రత కోసం వాట్సాప్, ఫేస్ టైం, సిగ్నల్ వంటి యాప్లను వాడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. “వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేసిన మూర్ఖుడు ప్రభాకర్ రావు,” అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియాకు వచ్చేందుకు ముందే కేటీఆర్ యూఎస్ వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ, ఈ క్రమంలో ఉన్న అనుమానాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేటీఆర్ అమెరికాలో ఉన్న సమయంలోనే ప్రభాకర్ రావు భారత్కు వచ్చి లొంగిపోవడం యాదృచ్ఛికమా?” అని ప్రశ్నించారు.
“బీఆర్ఎస్ను గద్దె దించింది బీజేపీ పార్టీయే. కేసీఆర్ మెడలు వంచేలా పోరాటాలు చేశాం. బీఆర్ఎస్తో ఒప్పందం ఉంటే పోరాటం ఎందుకు చేస్తాం?” అని బండి సంజయ్ అన్నారు.ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. “కేంద్రానికి నేరుగా విచారణ చేసే అవకాశం లేకపోవడంతోనే ప్రస్తుతం ఆగుతున్నాం. లేదంటే ఇప్పటివరకే నిందితులందరినీ చట్టం ముందుకు తీసుకొచ్చి శిక్షించి ఉండేవాళ్లం” అని హెచ్చరించారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బండి సంజయ్ తాజా వ్యాఖ్యలతో మరింత వేడి రాజేసింది.