Salmankhan: లారెన్స్‌బిష్టోయీకి సల్మాన్‌ టార్గెవడంపై రాంగోపాల్‌ వర్మ ‘దిగ్భ్రాంతి’..!

Nancharaiah merugumala senior journalist:

తల్లిలేని జింక పిల్లలకు చనుబాలిచ్చే స్త్రీలున్న బిష్ణోయీ సమాజంలో పుట్టిన హిందూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌బిష్టోయీకి సల్మాన్‌ టార్గెవడంపై రాంగోపాల్‌ వర్మ ‘దిగ్భ్రాంతి’!

జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. పిల్లలకు ఆవుపాలు తాగించి పెంచే మన సమాజంలో ఇది వింత. ఇలాంటి దృశ్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు.

కిందటేడాది భారత నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ దుబాయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బిష్ణోయీ సమాజం గురించి చెప్పిన మాటలివి. (ముంబైలో మొన్న ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ బిష్ణోయీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ ముఠా పంపిన షార్ప్‌షూటర్ల చేతుల్లో హత్యానంతరం ఈ వీడియో వైరలవుతోంది)
నిజమే, రాజస్తాన్‌లో తమ ప్రాణాలు ఒడ్డి మరీ చెట్లను సంరక్షిస్తూ పశుపక్ష్యాదులను కాపాడే జాతిగా బిష్ణోయీలకు మంచి పేరుంది. రాజస్థాన్‌ తర్వాత తక్కువ సంఖ్యలో వారు హరియాణా, పంజాబ్‌లో నివసిస్తున్నారు. కర్ణాటక లింగాయతుల మాదిరిగానే అనేక కులాల సంగమంతో ఏర్పడిన జాతి బిష్ణోయీలు. మూడు రాష్ష్రాల్లో ఓబీసీ జాబితాల్లో ఉన్న బిష్ణోయీలు ‘ప్రకటిత’ శాఖాహారులు. 1979లో హరియాణా ముఖ్యమంత్రిగా (జనతాపార్టీ తరఫున) చౌధరీ (ఇది గౌరవనామం మాత్రమే) భజన్‌లాల్‌ ప్రమాణం చేసే వరకూ దక్షిణాది ప్రజలకు ఉత్తరాదిన బిష్ణోయి అనే కులం ఉందనే సంగతే తెలియదు. విశేషం ఏమంటే…భజన్‌లాల్‌ సీఎం అయ్యేనాటికి (45 సవంత్సరాల క్రితం) 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో ఒకే ఒక్క బిష్ణోయీ ఎమ్మెల్యే భజన్‌లాల్‌. అప్పుడు రాష్ట్రంలో బిష్టోయీల జనాభా కేవలం లక్ష మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే కుల స్పృహ–చైతన్యం కాస్త ఎక్కువే ఉన్న హరియాణాలో ఇలా ఏకైక బిష్ణోయీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావడం దివంగత ప్రధాని పీవీ నరసింహారావు గారి మాటల్లో చెప్పాలంటే ‘ప్రజాస్వామ్య అద్భుతం’. వాస్తవానికి బిష్ణోయీ సాంప్రదాయ స్థాపకుడు గురూ జంబేశ్వర్‌ రాజస్థాన్‌కు చెందినవాడైనప్పటికీ ఈ ఎడారి రాష్ట్రానికి చెందిన (రాజస్తానీ) బిఫ్ణోయీ  నాడు భజన్‌లాల్, నేడు పంజాబీ బిష్ణోయీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయీ మాదిరిగా పేరుప్రతిష్టలు సంపాదించలేదు.

బిష్ణోయీల పండగ ఆశ్వయిజ అమావాస్య వల్ల హరియాణా పోలింగ్‌ తేదీ మార్పు..

కిందటి నెల బిష్ణోయీల పూజ్య గురువు జంబేశ్వర్‌ స్మృత్యర్ధం అక్టోబర్‌ ఒకటిన జరిపే పర్వదినం ఆశ్వయిజ అమావాస్య కారణంగా హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను అక్టోబర్‌ 5కు వాయిదా వేసింది ఎన్నికల కమిషన్‌. ఆ రోజు రాజస్థాన్‌ సందర్శించే హరియాణివీ బిష్ణోయీల ఓటు హక్కును కాపాడడానికి ఇలా పోలింగ్‌ తేదీ ముందుకు జరిపామని సర్కారు ప్రకటించింది. అయినా కాంగ్రెస్‌ ఈ నిర్ణయంపై విరుచుకుపడింది. బిష్టోయీల జనాభా తక్కువేగాని వారి జీవకారుణ్య సిద్ధాంతాలు ప్రపంచ ప్రజల గుర్తింపు పొందాయి 20వ శతాబ్దం చివర్లో. హిమాలయ ప్రాంతాల్లో (ఉత్తరాఖండ్, హిమాచల్‌ రాష్ట్రాలు) చెట్లను కాపాడాలనే లక్ష్యంతో దీర్ఘకాల ఉద్యమం ‘చిప్కో’ నడిపిన గాంధేయ ఉత్తరాఖండీ బ్రాహ్మణుడు సుందర్‌ లాల్‌ బహుగుణకు స్ఫూర్తి, ఆదర్శం కూడా రాజస్తానీ బిష్ణోయీలే.

అయితే, రాజస్తాన్‌లో కృష్ణజింకను వేటాడి, సల్మాన్‌ ఖాన్‌ ‘పాపం’ చేసేనాటికి ఐదేళ్ల బాలుడైన లారెన్స్‌ బిష్ణోయీలో అందుకు ‘కండలవీరుడు’ సల్లూభాయ్‌పై పగ రగలడం నిజంగా దైవికంగా ఉందని సినీ దర్శకుడు పి.రాంగోపాల్‌ వర్మ నిన్న ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యానించడం విశేషం. తాను ఇకముందు సినిమా తీయడానికి లారెన్స్‌ జీవితం చాలా అనుకూలంగా ఉందని కూడా వర్మ చెప్పారు. ఇప్పటి వరకూ అంతర్జాతీయ స్థాయిలో మహారాష్ట్రకు చెందిన కొంకణీ ముస్లిం దావూద్‌ ఇబ్రాహీం కస్కర్‌ అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌గా గుర్తింపు సంపాదిస్తే, అతనికి ఒక మోస్తరు పోటీదారుగా ఎదిగి పతనమైన చోటా రాజన్‌ అనే మరో గ్యాంగ్‌స్టర్‌ కూడా ఆగ్నేయాసియా ప్రాంతంలో (థాయిలాండ్‌ బ్యాంకాక్‌) తన నేర కార్యకలాపాలతో కొన్నాళ్లు పేరు మ్రోగింది. ఇంటర్నేషనల్‌ గ్యాగస్టర్‌గా సర్కారు సాయంతో ఎదిగిన రాజేంద్ర నికాల్జీ అనే చోటా రాజన్‌ పారిశుద్ధ్య పనిచేసే దళితకులంలో పుట్టాడు. ఇప్పుడు ఉత్తరాది ఓబీసీ అయిన లారెన్స్‌ బిష్ణోయీ కెనడాలో కూడా తన గ్యాంగ్‌తో నేర కార్యక్రమాలు నిర్వహిస్తూ అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌గా పేరు సంపాదించడంతో ఈ అవాంఛనీయ వృత్తిలో బిష్ణోయీలకు భాగస్వామ్యం ఉందనే కీర్తి తీసుకురావడం గొప్ప విజయం. 20వ శతాబ్దం ఆరంభం నుంచే ఉత్తరాది, హిందీ రాష్ట్రాల్లో బడాబడా నేరాలు చేసే ముఠాలను నడిపే ‘బాహుబలులు’గా, గ్యాంగస్టర్లుగా పేరుమోసిన అనేక మంది బ్రాహ్మణలు భారత నేర ప్రపంచంలోనూ ఇలా కొద్దికొద్దిగా తమ గుత్తాధిపత్యం కోల్పోతున్నారు.