అడ్వాన్స్ బుకింగ్ తోనే సంచలనాలు సృష్టించిన సినిమా బాక్సాఫీస్ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్ ‘. మెగా పవర్ స్టార్ రాంచరణ్ _ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రూ.1000 కోట్ల మార్క్ను సులభంగా అందుకునే అవకాశం ఉందన్నారు.
కాగా రూ. 500 కోట్ల భారీ బడ్జెతో తో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్ ‘.. నార్త్ లో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే రూ.73 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ములేపుతున్న ‘ ఆర్ఆర్ఆర్ ‘.. మున్ముందు ఇండియన్ బాక్స్ ఆఫీసు చరిత్రలో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.