హైదరాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై ఉన్న హాథిరామ్ బావాజీ మఠంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బంజారా పీఠాధిపతులకు మాత్రమే పూజలు చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శనివారం బంజారాహిల్స్ లోని నివాసంలో పలువురు బంజారా పీఠాధిపతులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. తిరుమలలోని హాథిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠిధిపతులకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులకు అవకాశం ఇచ్చారని తెలిపారు. తమకు అవకాశం ఇచ్చేలా టీటీడీ చైర్మన్, పాలకవర్గంపై ఒత్తిడి తేవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఫోన్ లో మాట్లాడారు. శ్రీ హాథిరామ్ బావాజీ మఠంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బంజారా పీఠాధిపతులు మాత్రమే పూజలు చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ పాలక మండలి సమావేశంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.