Varahi Navratri: వారాహీ నవరాత్రుల ప్రత్యేకత..!

VarahiNavratri: ఆదిశక్తి అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. అలాంటి తపస్సుకి శ్రేష్ఠ సమయంగా భావించబడే వారాహీ నవరాత్రులు ఈ జూన్ 26న ప్రారంభమవుతున్నాయి. భూదేవి సంరక్షణ కోసం అవతరించిన శ్రీవరాహస్వామికి, ఆయన శక్తిస్వరూపిణి అయిన వారాహీ అమ్మవారిని ఈ నవరాత్రులు పేరిట పూజించడం ఆనవాయితీగా వస్తోంది.

*వారాహీ – భూమాతా స్వరూపిణి*

వారాహీ అంటే కేవలం శక్తి కాదు సాక్ష్యాత్తు
భూమాత స్వరూపిణి. ఆమె చేతిలో శంఖం, చక్రం, నాగలి, రోకలితో సహా పలు ఆయుధాలు అన్నం ఉత్పత్తి చేసే సామర్థ్యానికి సంకేతం. అన్నప్రదాయినిగా, సస్యశ్యామల భూమిని పరిపాలించే స్వరూపంగా ఆమెను భావిస్తారు.

*గుప్తనవరాత్రులలో వారాహీ ప్రత్యేకత*

నాలుగు ప్రధాన నవరాత్రుల్లో ఒకటైన వారాహీ నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకుంటారు. వీటిని ‘గుప్తనవరాత్రులు’ అంటారు. రాత్రి వేళల్లో అమ్మవారికి దీక్షలు, ఉపవాసాలు, నైవేద్యాలు సమర్పించడంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఈ కాలంలో అమ్మవారి భక్తికి లభించే ఫలితాలు అంతులేనివిగా పురాణోక్తి.

పురాణాల ప్రకారం బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, చాంద్రాణీ, చాముండా అనే సప్తమాతృకలలో వారాహీ అమ్మవారు ఒకరు. శివునికి పరిచర్యలు చేసే ఈ శక్తులు సృష్టి, స్థితి, లయకు మూలాధారాలు. వారాహీకి ‘ప్రత్యంగిరా’ అనే పేరు కూడా ఉంది. భూమిపై జరిగిన తగాదాలకు, వివాదాలకు పరిష్కారం చూపే దేవతగా ఆమెను పూజిస్తారు.

కాశీలోని గ్రామ దేవత..

వారాహీ అమ్మవారు కాశీ నగరాన్ని రక్షించే గ్రామదేవతగా ప్రసిద్ధి. అగాధ రాత్రుల్లో ఆమె నగర సంచారిని చేస్తుందని నమ్మకం. అక్కడి శైవులు, వైష్ణవులు, బౌద్ధులు ప్రత్యేకంగా అమ్మవారిని కొలుస్తారు. శంఖచక్రాల ధరణ, అష్టభుజాలతో దర్శనమిచ్చే ఆమె రూపం భక్తులను భయానకంగా కాదు,శాంతంగా అనిపిస్తుంది.

*లలితా దేవి సేనాధిపతిగా వారాహీ*

వారాహీ అమ్మవారు లలితా త్రిపురసుందరి సైన్యంలో సర్వసైన్యాధిపతిగా ప్రసిద్ధి. ఆమె కిరీ చక్ర అనే ప్రత్యేక రథంలో విహరిస్తూ దుష్టశిక్షణ చేస్తారు. 1000 వరాహాలు లాగే ఆ రథంలో స్థంభినీ దేవి సారధి. ఆమె సేనాధిపత్యం లలిత సేనలోని ప్రతి ఒక్క శక్తి చేతికి పట్టింది.

*వరాహస్వామికి ప్రియురాలిగా వారాహీ*

హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, వరాహస్వామి అవతరించి భూమిని రక్షించగా, అమ్మవారు ప్రేమవశంగా వరాహ ముఖం ధరించారని పురాణంలో పేర్కొనబడింది. అందుకే వారాహీ అంటే శ్రీమహాలక్ష్మీ సాక్షాత్ స్వరూపమే అని భావించబడుతుంది. శ్రీలక్ష్మీ సహస్రనామంలో “వారాహీ ధరణీ ధ్రువా” అనే పేరు ద్వారా ఆమె స్థిరత్వాన్ని, భూశక్తిని సూచించబడింది.

*అమ్మవారి స్వరూప విశేషాలు*

వరాహ ముఖం, అష్టభుజాలతో శంఖ, చక్ర, హల, ముసల, పాశ, అంకుశ, అభయ, వరదముద్రలతో అమ్మవారు దర్శనమిస్తారు. ఇది మహావారాహీ స్వరూపం. అలాగే లఘువారాహీ, స్వప్నవారాహీ, ధూమ్రవారాహీ, కిరాతవారాహీ రూపాల్లోనూ అమ్మవారిని భక్తులు తలుస్తారు.

వారాహీ ఉపాసన కేవలం శత్రు నాశనం కోసం కాదు. ఆమె ధ్యానం వల్ల కర్మశుద్ధి, మనస్సు శాంతి, ధ్యాన సామర్థ్యం కలుగుతాయి. మానవుడిలో అంతఃశత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటి దోషాలు తొలగిపోతాయి. భూవివాదాలు, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యల పరిష్కారానికి వారాహీ ఉపాసన శ్రేష్ఠ మార్గం.

ఆషాఢం వర్షాకాలం ప్రారంభం. రైతులు భూమిని దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధమవుతారు. వారాహీ అమ్మవారిని సస్యలక్ష్మిగా భావించి పూజిస్తారు. ఆమె పూజ అనేది వాస్తవానికి వ్యవసాయం చేస్తే సహజంగా జరుగుతున్న ఉపాసనే. భూమిని శుద్ధి చేసి, సాగు చేసి భక్తితో జీవిస్తే అది వారాహీ తత్వాన్ని అవలంబించినట్టే.

వారాహీ అమ్మవారు ఉగ్రరూపం కాకుండా..అత్యంత శాంతదాయకమైన రూపంగా భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు. భక్తితో ఆమెను పూజించిన ప్రతి ఒక్కరికీ ఆమె అనుగ్రహం లభిస్తుంది. ఈ నవరాత్రుల సమయంలో భక్తితో అమ్మవారిని పూజిద్దాం. భూదేవిని పరిరక్షించిన అమ్మ ఆశీస్సులతో మన జీవితాల్లోని అనిశ్చితి తొలగిపోవాలని ప్రార్థిద్దాం.

_anrwriting✍

Optimized by Optimole