ధర్మరాజు కోరికపై రోమశుడు అగస్త్య మహాముని కను సవిస్తరంగా వివరించసాగాడు.
“కృతయుగంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తన అనుచరులైన కాలకేయులతో కలిసి దేవతలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వృత్తాసురుని చంపడానికి మార్గం చెప్పమన్నారు. బ్రహ్మదేవుడు “మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకలను దానంగా అడిగి తీసుకుని ఆ ఎముకలతో ఆయుధాన్ని చేయండి. ఆ ఆయుధంతో వృత్తాసురుని సంహరించండి” అని చెప్పాడు.
దేవతలు దధీచి మహర్షి ఎముకలను దానంగా అడగగానే ఆ మహర్షి శరీరాన్ని విడిచి ఎముకలను దానంగా ఇచ్చాడు. వాటితో త్వష్ట ప్రజాపతి వజ్రాయుధం చేసి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్తాసురుని సంహరించాడు. వృత్తాసురుని అనుచరులైన కాలకేయులు సముద్రగర్భంలో దాగి రాత్రివేళలో బయటకు వచ్చి జనులను ఋషులను బాధిస్తుండే వాళ్ళు.
ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తికి మొర పెట్టుకున్నారు. విష్ణుమూర్తి దేవతలతో.. “కాలకేయులు మహా బలవంతులు. పైగా సముద్ర గర్భంలో ఉన్నారు కనుక సంహరించడం వీలు కాదు. సముద్రంలో నీరు ఇంకిపోతే సంహరించవచ్చు. కనుక మీరు అగస్త్యుని వద్దకు వెళ్ళి తరుణోపాయం అడగండి” అని చెప్పాడు.
దేవతలు అగస్త్యుని వద్దకు వెళ్ళి “పూర్వం వింధ్య పర్వతం పెరిగి జగత్తుకు విపత్తుగా పరిణమించినప్పుడు తమరి వలన ఆ కీడు తొలగింది. అలాగే ఇప్పుడు కూడా మా కష్టాన్ని మీరే పోగొట్టాలి” అని అడిగారు.
అగస్త్యుని గురించి వింటున్న ధర్మరాజు రోమశుని చూసి.. “అయ్యా! వింధ్య పర్వతం పెరగటం ఏమిటి? వివరించండి ” అని అడిగాడు.
రోమశుడు ధర్మరాజుతో “ప్రతి రోజు సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తుంటాడు. అది చూసి వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. ‘సూర్యదేవా! నేను పర్వతాలకు రాజును, నువ్వు నాకు ప్రదక్షిణం చేయకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తావు?’ అని అడిగాడు. సూర్యుడు ‘బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఇలా చేస్తున్నాను’ అని పలికాడు.
ఆ మాటకు వింధ్యపర్వతానికి ఆగ్రహం కలిగింది. అలా అలా పైపైకి ఎదుగుతూనే ఉన్నాడు. అలా సూర్యచంద్రుల మార్గాలను నిరోధించాడు. లోకాలు అంధకారంలో మునిగి పోయాయి. దేవతలంతా అగస్త్యుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో వింధ్యపర్వతం వద్దకు వెళ్ళి….
“వింధ్యపర్వతమా ! నేను దక్షిణదిక్కుగా వెళుతున్నాము మాకు దారి ఇచ్చి తిరిగి వచ్చేవరకు అలాగే ఉండు” అన్నాడు.
అలాగేనని అంగీకరించిన వింధ్య పర్వతం భూమికి సమానంగా దిగి వచ్చాడు. అప్పటి నుండి పెరగడం ఆపివేసాడు. అదేవిధంగా అగస్త్యుడు దేవతల కోరికపై సముద్ర జలాలను త్రాగి వేసాడు. దేవతలు కాలకేయుడు మొదలైన వారిని సంహరించారు. చావగా మిగిలిన వారు పాతాళానికి పారి పోయారు.
దేవతలు అగస్త్యుడి వద్దకు వచ్చి “మహర్షీ! మీ దయ వలన మాకు రాక్షస బాధ తప్పింది. మరల సముద్రాలను జలంతో నింపండి” అని ప్రార్థించారు.
అగస్త్యుడు “దేవతలారా! అది నాకు సాధ్యం కాదు. సముద్రజలం నా పొట్టలో ఇంకి పోయాయి” అన్నాడు.
అగస్త్యుడు సముద్ర జలాలను తిరిగి ఇవ్వలేనని చెప్పడంతో దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ‘సముద్ర జలాలను రప్పించడం ఇప్పుడు సాధ్యం కాని పని. చాలా కాలం తరువాత భగీరధుడు ఈ సముద్రాన్ని జలంతో నింపగలడు’ అని చెప్పాడు” అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు.
రోమశుని మాటలు విని ధర్మరాజు “మహర్షీ ! భగీరధుడు సముద్రాన్ని జలంతో ఎలా నింపాడు?” అని అడిగాడు.
రోమశుడు ధర్మరాజుతో “ధర్మజా! పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉన్నాడు. అతనికి వైదర్బి, శైబ్య అనే ఇద్దరు భార్యలు. అతడికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి ప్రసన్నం చేసు కున్నాడు. సగరుడు సంతానం కావాలని శివుడిని కోరాడు. శివుడు అలాగే అని వరమిచ్చాడు. సగరుని భార్యలు ఇద్దరు గర్భం ధరించారు.
వైదర్భి గర్భాన ఒక అలబూఫలం (ఆనపకాయ) పుట్టింది. శైబ్య గర్భాన అసమంజసుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి
“రాజా ఆ కాయలోని విత్తనాలు నేతికుండలలో పెట్టి కాపాడితే నీకు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు” అని పలికింది.
సగరుడికి అరవై వేల మంది కుమారులు జన్మించారు. సగరుడి కుమారులు లోక కంటకులుగా తయారయ్యారు. దేవతలను, ఋషులను బాధిస్తున్నారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు.
బ్రహ్మదేవుడు దేవతలతో “వారి గర్వం ఎక్కువ కాలం ఉండదు. త్వరలోనే వారు చనిపోతారు” అని చెప్పాడు.
సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను కుమారులకు ఇచ్చాడు. యాగాశ్వం నీళ్ళు లేని సముద్రంలోకి వెళ్ళి మాయమైంది. సగరుడి కొడుకులు యాగాశ్వాన్ని వెదుకుతూ సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్యంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది.
కపిలుడే తమ అశ్వాన్ని దొంగిలించాడని సగర కుమారులు అతడిని అవమానించారు. ఆ మహాముని కోపాగ్నితో సగరకుమారులను భస్మం చేసాడు. నారదుడి వలన ఆ విషయం సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి అసమంజసునికి జనించి పెరిగి పెద్దవాడైన అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు.
సగరుడు అంశుమంతుని చూసి ” నాయనా! నాకుమారులు చనిపోయినందుకు నేను భాధపడను కానీ అశ్వమేధయాగం సగంలో ఆగిపోయింది దానిని నీవు పూర్తి చెయ్యి” అని కోరాడు.
‘అలాగే’ అని అంశుమంతుడు కపిలమహామునిని చూసి నమస్కరించి తను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. కపిల మహాముని
“అంశుమంతా! ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధయాగం పూర్తి చేస్తాడు. నీ మనుమడు భగీరధుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చి సాగరాన్ని జలంతో నింపుతాడు” అని చెప్పాడు.