వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం: పవన్ కళ్యాణ్

Janasena : తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆరు నూరైనా సీటూ, గెలుపూ మనదేనని స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి సమర్థ నాయకుడినీ, ఎన్నుకున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధినీ తెనాలి ప్రజలు ఎప్పటికీ మరచిపోరని చెప్పుకొచ్చారు.

మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ ఆత్మీయంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులను ఒక్కక్కరినీ అధినేతకు మనోహర్   పరిచయం చేశారు. అనంతరం పవన్  మాట్లాడుతూ “ మనోహర్ తన హయాంలో చేసిన సేవలను తెనాలి నియోజకవర్గం ప్రజలు విస్మరించలేదన్నారు. ఇప్పటికీ నియోజకవర్గం అభ్యున్నతి కోసం తపిస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెనాలికి ఆయన అవసరం ఉందని.. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తూ ఉంటుందని .. ఇందుకు భిన్నంగా పాలక పక్షం ఆలోచిస్తుందన్నారు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు అంటారు.. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు… నేను బాగుండాలి.. నేనే బాగుపడిపోవాలి అనేది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి.. దాన్ని గ్రహించాను కాబట్టే మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నానని పవన్ తేల్చిచెప్పారు. ప్రజలు ఎంతో సానుభూతితో తండ్రి లేని పిల్లాడు.. సంవత్సరం నుంచి నడుస్తున్నాడని జాలితో ఓట్లు వేశారు..ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడుతున్నారని జనసేనాని పేర్కొన్నారు.

వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం

ఆంధ్రప్రదేశ్ కు స్థిరత్వం ఇవ్వాలని బలమైన కాంక్షతోనే జనసేన పార్టీ పనిచేస్తుందన్నారు పవన్. రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి అనేదే ప్రాథమిక ఎజెండాగా ఎలా ఎదగాలన్నది నాయకులు పట్టించుకోలేదాని.. కేవలం వ్యక్తిగత ఎదుగుదల తప్ప, ప్రజా క్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం మీద నిబద్ధతతో నిలబడి ఉందని ఆయన స్పష్టం చేశారు . తాము చెప్పే ప్రతి మాట రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని చెబుతున్నదేనని.. అర్ధశాస్త్రంలో పన్నులను ఎలా విధించాలనే అంశంపై నిపుణులు చెబుతూ ‘పూల మీద మకరందం తీసుకునే సీతాకోకచిలుకలా ప్రభుత్వం పన్నుల విషయంలో వ్యవహరించాల’ని పవన్ చెప్పుకొచ్చారు.

 

 

 

Optimized by Optimole