వికారాబాద్ లో సరికొత్త రాజకీయానికి నేతలు తెరలేపారు. అధికార బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే పనిపోయిదంటు సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తుంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఉద్యమకారులు మాపార్టీకి మేమే దిక్కంటూ దూసుకొస్తున్నారు. అటు కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లో ఎండగడుతూ దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సైతం రేసులో నేనున్నాంటూ తగ్గేదెలే తరహాలో ప్రచారంలో నిమగ్నమయ్యారు.
బిఆర్ఎస్ లో అధిపత్య పోరు..
వికారాబాద్ బీఆర్ఎస్ లో అధిపత్య పోరు నడుస్తోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి.. ఎమ్మెల్యే ఆనంద్ కు ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. అవకాశం దొరికిన ప్రతిసారీ రెండు వర్గీయులు అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఓసమావేశం సందర్భంగా జెడ్పీ ఛ్కెర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించలేదని ..ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు ఆమెపై దాడి చేశారు. రెండు వర్గాలు బాహాబాహికి దిగడంతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారింది.
ఎమ్మెల్యేపై ఉద్యమకారులు ఫైర్..
ప్రత్యేక తెలంగాణ కోసం కోట్లాడిన కార్యకర్తలు మేము.. అలాంటింది చుట్టంలా వచ్చిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ..నేనే రాజు నేనే మంత్రి నన్నెవడూ ఆపేది తరహాలో వ్యవహరిస్తున్నారని ఉద్యకారులు నిప్పులు కక్కుతున్నారు. సీఎం కేసీఆర్ చెప్పాడని ఇన్నాళ్లు అవమానాలను భరించామని..ఇకపై తగ్గేదెలే అంటూ ఆవేశంతో ఊగిపోతున్నారు. మరోవైపు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాహాటంగానే ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. తాను చెప్పినట్లు వినకపోతే .. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. మరో మాటల చెప్పాలంటే పార్టీలో వర్గపోరుకు ఎమ్మెల్యే ఆద్యంపోస్తున్నాడని ఆవేదన వెల్లకక్కుతున్నారు. అంతేకాక ఈసారి టికెట్ ఆనంద్ కు ఇవ్వొద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో సీనియర్ నేతలు ఉన్నట్లు తెలిసింది.
ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు లైన్ క్లియర్ గా ఉంది. పార్టీ నుంచి చాలా మంది నేతలు వెళ్లిపోయినా.. క్యాడర్ ను కాపాడుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. వివాదరహితుడిగా పేరున్న మాజీ మంత్రికి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. గతంలో మంత్రిగా చేసిన అభివృద్ధి పనులను ప్రజలు ఇప్పటికి గుర్తుచేసుకుంటున్నారు. ఈసారి ఆయన పోటిచేస్తే గెలుపు నల్లరేపై నడకే అన్నది పార్టీ నేతల అభిప్రాయం.
వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పుంజుకుంటుంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ రావు 23 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేయడం..లోకల్ గా ఆయనకు మంచి పట్టు ఉండటం పార్టీకి కలిసొచ్చే అంశం. ప్రజలతో సత్ససంబంధాలు కలిగిఉన్న ఆయన..ఈసారి పోటిచేస్తే హోరాహోరి ఖాయమన్నది కాషాయం నేతలు మాటగా తెలుస్తోంది.
మొత్తంగా బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఆనంద్కు టికెట్ కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఉద్యమకారుడు వడ్ల నందుతో పాటు ఓపారిశ్రామికవేత్త టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరగుతుంది.