Tollywood: ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాల ఫిర్యాదు మేరకు విజయ్ పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు.. పాకిస్థాన్ వాళ్లు చేసిన బుద్ధి లేని పనులివి ” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అవమానంగా భావించిన గిరిజన సంఘాలు నిరసనలకు దిగాయి. ఆయన తమ జాతిని టెర్రరిస్టులతో పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై ట్రైబల్ కమ్యూనిటీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. తాజాగా న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసు నేపథ్యంలో సినీ వర్గాల్లో, సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ స్పందన ఎలా ఉంటుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తన వ్యాఖ్యలపై విజయ్ వివరణ ఇవ్వాల్సిందిగా పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.