Journalism: మనవాడు.. మహ గట్టివాడు..!

manikondachalapathirao: 1983 మార్చి 25వ తేదీ… సాయంకాలం. ఢిల్లీలో అలవాటు ప్రకారం ఈవెనింగ్ వాక్ కి వెళుతున్నారో పెద్దాయన. అది కాకానగర్. అక్కడ చాయ్ తాగడం ఒక పాత అలవాటు. వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ పెట్టే యాదవ్ సింగ్ పెద్దాయన్ని చూసి కిచెన్ లోకి వెళ్ళాడు. కుర్చీలో పెద్దాయన ఒక పక్కకి వాలిపోయాడు. అది చూసిన అక్కడి బోయ్ ఒకడు యాదవ్ కి చెప్పాడు. ఒక చెక్క మంచమ్మీద పడుకోబెట్టారు. ఆయన వొళ్ళు చల్లబడిపోయింది. పెద్దాయనెవరో అక్కడెవరికీ తెలీదు. పోలీసులకి చెప్పారు. వచ్చి, శవాన్ని పెద్దాసుపత్రికి అప్పజెప్పారు.

ఎం.సీ.గా ప్రసిద్ధుడైన మానికొండ చలపతిరావు మన తెలుగువాడు. జవహర్లాల్ నెహ్రూకీ, ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్ పిళ్ళైకి సన్నిహిత మిత్రుడు. మర్నాడు ఫోన్ చేసిన ఇందిరా గాంధీకి ఎం.సీ కనిపించడం లేదని తెలిసింది. ఆమె సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. అనాధ శవాల గురించి ఎంక్వయిరీ జరిగింది. ఆస్పత్రి మార్చురీలో ఒక శవం వుందని తెలిసింది. శంకర్ పిళ్ళై వెంటనే వెళ్లి, అది చలపతిరావు గారేనని చెప్పాడు. ఎం.సీ పెళ్లి చేసుకోలేదు. ఒంటరివాడు. ఇండియా గర్వించదగ్గ సంపాదకుడు. ఆయనిక లేడన్న వార్త ఇందిరా గాంధీని, ఇతర పెద్ద జర్నలిస్టుల్నీ కలచివేసింది. 27వ తారీఖున ఢిల్లీలో అంత్యక్రియలు జరిగాయి.

1957లో దేశంలో ఎన్నికలు జరుగుతున్నపుడు ప్రచారం కోసం నెహ్రూ బొంబాయి వెళ్లారు. అక్కడ ఆంగ్ల దినపత్రిక నేషనల్ హెరాల్డ్ ఆఫీస్ కి వెళ్లి, చీఫ్ ఎడిటర్ ఎం.సీని కలిశారు. ‘నా ఎన్నికల సభలన్నీ మీరే స్వయంగా వచ్చి కవర్ చేయాలి’ అని కోరారు. నెహ్రూతో పాటు ప్రతిరోజూ ఎన్నికల ప్రచార సభలకు వెళ్లడం, సాయంత్రం లేటుగా వచ్చి నెహ్రూ ప్రసంగాలని రాయడం చలపతిరావు పని. కొన్నిరోజుల తర్వాత, ఒకనాడు ఎందుకో ఎం.సీకి నెహ్రూతో వెళ్లడం కుదర్లేదు. అయినా, మర్నాడు నేషనల్ హెరాల్డ్ లో నెహ్రూ ప్రసంగం, సభ విశేషాలతో వివరంగా వార్త వచ్చింది. ఇంత చక్కని ఇంగ్లీషులో వార్త రాసిందెవరు? అని ఆశ్చర్యపోయిన ఎం.సీ, సీనియర్ జర్నలిస్టుల్ని పిలిచి ‘ఇదెలా జరిగింది?’ అని అడిగారు. ‘రాత్రి లేట్ గా ప్రధాని నెహ్రూగారే ఆఫీసుకు వచ్చి, ఆయనే వార్త రాసి ఇచ్చారు’ అని వాళ్ళు చెప్పారు. ఈ తీయని జ్ఞాపకాన్ని ఒక వ్యాసంలో ఎం.సీ.నే రాశారు.

చలపతిరావు తెలుగు పత్రికల్లో పనిచేయకపోవడం వల్ల ఆయన మన వాళ్ళకి పెద్దగా తెలీదు. ఎం.సీ ఢిల్లీలో, బొంబాయిలో మాట్లాడుతుంటే కొమ్ములు తిరిగిన జర్నలిస్టులంతా చేతులు కట్టుకుని వినేవాళ్లు. నెహ్రూ, ఇందిరా గాంధీ ఎం.సీని ఆదరించి, సొంత ఇంటి మనిషిలా గౌరవించేవారు. ఎం.సీ ఇంగ్లీషు వ్యాసాలు, రాజకీయ విశ్లేషణలూ, వ్యాఖ్యానాలూ మాలాంటి అరకొర జర్నలిస్టులకు పాఠ్యపుస్తకాలు.

శ్రీకాకుళం జిల్లాలో ‘అంబఖండి’ అనే కుగ్రామానికి చెందినవారు ఎం.సీ. 1910లో విశాఖలో జన్మించారు. 1936 నుంచీ ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రికల్లో పనిచేశారు. 1946లో ప్రతిష్టాత్మకమైన నేషనల్ హెరాల్డ్ ఇంగ్లీష్ డైలీకి ప్రధాన సంపాదకుడయ్యారు. 1978 వరకు 36 సంవత్సరాల పాటు పత్రికను అద్భుతంగా నడిపించారు. 1968లో తనని వరించి వచ్చిన ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చివేశారు. ‘జర్నలిస్టు అయినవాడు గొప్ప కమ్యూనికేటర్ కావాలి. అలా ప్రజలతో కమ్యూనికేట్ చేయగలిగిన వాడూ, స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం పోరాడినవాడూ అయిన మహాత్మా గాంధీ దేశంలోకెల్లా అత్యుత్తమ జర్నలిస్టు’ అన్నారు ఎం.సీ.

‘చలపతిరావు లాంటి సమర్థవంతుడైన, నిజాయితీపరుడైన ఎడిటర్ ని ఈ దేశంలో మరొకరిని నేను ఊహించలేను’ అన్నారొకసారి నెహ్రూ. వామపక్ష జర్నలిజం తండ్రిగా గుర్తింపు పొందిన మద్దుకూరి చంద్రశేఖరరావు తొలి స్మారకోపన్యాసం ఎం.సీ చేశారు. విజయవాడలో 1982లో ‘విశాలాంధ్ర’లో ఈ సభ జరిగింది. తొలి ప్రెస్ కమిషన్, ప్రెస్ కౌన్సిల్, జర్నలిస్టుల వేజ్ బోర్డు… అన్నీ ఎం.సీ చలవే, ఎం.సీ చొరవే!

అంతటి మహోన్నతుడి గురించి తెలుగులో వచ్చిన తొలి పుస్తకం ‘భారతీయ జర్నలిజం ధృవతార – మానికొండ చలపతిరావు’. సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య ఎంతో శ్రద్ధగా ఈ పుస్తకం రాశారు. మరికొందరు సీనియర్లు రాసిన వ్యాసాలు కూడా ఇందులో వున్నాయి. నిరాడంబరతకీ, నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచిన, ఆదర్శంగా బతికిన ఎం.సీ గురించి 40 సంవత్సరాల తర్వాతైనా ఒక మంచి పుస్తకం రావడం ఎంతో బావుంది. అమరయ్య గారూ.. మీ కృషి తెలుగు జర్నలిజం చరిత్రలో ఎప్పటికీ నిలిచి వుంటుంది. పాత తరానికి ఎం.సీ ఆదర్శం అయినట్టే, అమరయ్య గారి నిబద్ధత ఈ తరానికి ఆదర్శం కావాలని కాంక్షిస్తున్నాను. ఎం.సీ రాసిన విలువైన పుస్తకాలు చదవాలని ఇప్పటి జర్నలిస్టులను కోరుతున్నాను.
ఎం.సీ ఒక విజ్ఞానదీపం
ఒక మానవత్వపు పరిమళం
ఎప్పటికీ తలవంచని జాతీయగీతం!

– TAADI PRAKASH

Optimized by Optimole