భూపాలపల్లి: సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, సింగరేణి సంస్థ బలోపేతమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మంగళవారం సాయంత్రం భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సింగరేణి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, డిసిసి ప్రెసిడెంట్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే లతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ… మారిన మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి సంస్థ ఎదగాలని అధికారులకు సూచించారు. బొగ్గుతో పాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి సింగరేణి విస్తరించాలని సూచించారు. సుమారు 45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలోపేతం కావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సింగరేణి లాభాల్లో ఉండి సంస్థ ఉద్యోగులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన ఆలోచన అని తెలిపారు. గతంలో బొగ్గు రంగంలో సింగరేణి, కోల్ ఇండియాలది ఏకచత్రాధిపత్యం. కానీ, ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు రంగంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో మార్కెట్లో పోటీకి తట్టుకొని సింగరేణి నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ కంపెనీల బొగ్గు ఉత్పత్తి వ్యయం, ఆ కంపెనీలు బహిరంగ మార్కెట్లో బొగ్గు ఏ ధరకు అమ్ముతున్నాయి, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం, బహిరంగ మార్కెట్లో సింగరేణి బొగ్గుకు ఉన్న ధర ఎప్పటికప్పుడు అధికారులు పోల్చుకోవాలని సూచించారు. ఈ ఉత్పత్తి వ్యయం, బహిరంగ మార్కెట్లో బొగ్గు ధరలకు సంబంధించిన వివరాలను సింగరేణి కార్మికులకు అవగాహన కలిగేలా మైన్స్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, సింగరేణి కార్మికులు, అధికారులకు అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం సూచించారు. సింగరేణికి భవిష్యత్ ఆలోచన లేకపోతే రాబోయే ముందు తరాలకు నష్టం చేసినట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని స్థానికులు తెలిపారు, ఈ అంశంపై విచారణ చేయాలని, సింగరేణి మైన్స్ కోసం భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన జాబితాపై విచారించాలని అర్హుల జాబితా పంపాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం రూ.1 కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఇటీవల కల్పించామని గుర్తుచేశారు. సింగరేణిలోని శాశ్వత ఉద్యోగులకే కాదు కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తున్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. అనంతరం ఓసీ – 2 ఉపరితల గని ప్రదేశాన్ని వ్యూ పాయింట్ నుండి డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులు పరిశీలించారు.