Karimnagar: వినోద్ కుమార్ నీ దుకాణం బంద్: బీజేపీ కన్వీనర్ ప్రవీణ్ రావు

BJPKarimnagar:  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. స్వయం ప్రకటిత మేధావి గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించిందేమీలేదని.. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడించినప్పటికీ వినోద్ కుమార్ బుద్ది మారలేదని మండిపడ్డారు. జనం మెచ్చిన నాయకుడి పై విషం కక్కుతూనే ఉన్నారని.. బండి సంజయ్ తిట్ల పురాణం బంద్ చేయాలని పచ్చి అబద్దాలు వల్లిస్తున్నరని దుయ్యబట్టారు. బూతులకు, తిట్లకు కేరాఫ్ అడ్రస్ కేసీఆరే అయితే.. నీతులు చెప్పేది మీరా అని ప్రశ్నించారు? కమిషన్లకు కక్కుర్తి పడి కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా దారి మళ్లించిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని.. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోద్ కుమార్ రాజకీయ దుకాణం బంద్ అయ్యిందని.. ప్రజలు ఎప్పుడో ఆయన రాజకీయ జీవితానికి గుడ్ బై చెప్పేశారని జోస్యం చెప్పాడు. జనం ఛీత్కరించుకోకముందే సగౌరవంగా రాజకీయాల నుండి తప్పుకుంటే మంచిదని ప్రవీణ్ రావు హితవు పలికారు.

బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధికి ఎన్ని నిధులు తెచ్చిండో వివరాలతో సహా గత ఎన్నికల్లోనే ప్రజల ముందుంచారని ఈ సందర్భంగా ప్రవీణ్ రావు గుర్తు చేశారు. ఎంపీగా గెలిచిన తరువాత రాజకీయాలకు అతీతంగా అభివ్రుద్ది కోసం సంజయ్ పాటుపడుతున్నాడని.. రూ.25 కోట్లతో మల్యాల నుండి కాచారం వరకు డబుల్ లేన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సంగతి వినోద్ కు తెలియదా? అని నొక్కి వక్కాణించారు. కరీంనగర్ నుండి వరంగల్ కు, ఎల్కతుర్తి నుండి సిద్దిపేట వరకు, కరీంనగర్ నుండి జగిత్యాల వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం వేల కోట్లు నిధులు తెచ్చారనే సోయి వినోద్ మర్చిపోయిండా? తెలంగాణలోనే అత్యధికంగా సీఆర్ఐఎఫ్ నిధులను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన విషయం తెల్వదా? తన నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అభివ్రుద్ధి కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన సంగతి మర్చిపోయిండా? అని ప్రవీణ్ రావు నిలదీశారు.

Optimized by Optimole