Telangana: తెలంగాణ బీజేపీలో బీసీ నేతల వర్గపోరు… కమలం పార్టీలో అంతర్యుద్ధం?

BJPTELANGANA:తెలంగాణ బీజేపీలో బీసీ నేతల మధ్య జరుగుతున్న వర్గపోరు ఆ పార్టీకి పెను సవాలుగా మారింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో ముదిరి పాకనపడ్డాయని కమలం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పైకి మాత్రం రెండు వర్గాల నేతలు శాంతంగా కనిపిస్తున్నా..లోలోపల మాత్రం ఒకరి గొయ్యి..మరొకరు తవ్వే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల కాళేశ్వరం విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు సైతం వీరి వైరానికి అద్దం పడుతున్నాయని బహిరంగంగానే కాషాయం సైనికులు, పార్టీ సానుభూతి పరులు చర్చించుకుంటున్నారు.


ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యవహారశైలి కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఆయన నోటి దురుసు కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని కాషాయం సైనికులు వాపోతున్నారు.దీనికి తోడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం కమలం పార్టీలో మరో చర్చనీయాంశం అయ్యింది. కొద్ది రోజుల ముందు బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన మాట్లాడటం సొంత పార్టీ నేతలకి మింగుడు పడటం లేదు. పార్టీ నేతలతో పాటు,రాష్ట్ర అధ్యక్షుడి పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఇక బీజేపీలో మరో వివాదం ముదిరుతోంది. బీజేపీ ఎంపీ అరవింద్ తండ్రి, మాజీ కాంగ్రెస్ నేత డి. శ్రీనివాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారన్న వార్తలు బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. “తాను చనిపోతే తన శవంపై కాంగ్రెస్ పతాకం ఉంచాలనుకుంటున్నాను” అన్న వ్యక్తి విగ్రహాన్ని బీజేపీ నేతతో ఆవిష్కరించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు కార్యకర్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

మొత్తంగా ఈ సంఘటన వల్ల బీజేపీ పార్టీ క్రమశిక్షణను దెబ్బతీశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి క్షేత్రస్థాయిలో బలపడే అవకాశాలు ఉన్నపటికీ.. నాయకత్వ లోపం, వర్గ పోరు వంటివి పార్టీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికైనా బీజేపీ హైకమాండ్ మేల్కొని, రాష్ట్ర నాయకత్వాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Optimized by Optimole