నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు: నారా లోకేష్

APpolitics: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడని.. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్  పిరికితనాన్ని చాటిచెపుతోందని లోకేష్  స్పష్టం చేశారు.

తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టిన  అంగన్ వాడీలపై నిన్న పోలీసుల నిర్బంధం తీరు నిర్ఘాంతపరిచిందన్నారు లోకేష్. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన ఆ మహిళలపై అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, వ్యతిరేక గళాలు ఉంటాయన్న విషయం జగన్ తెలుసుకోవాల్సి ఉందన్నారు. అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసనలకు దిగిన మహిళలు, నేతలపై పోలీసుల దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారని.. అతి త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి పాడెకడతారు అని లోకేష్ హెచ్చరించారు.

 

Optimized by Optimole