మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఎన్నికల హాల్ లో ఉన్నాడని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని, జగ్గయ్యపేటకు చెందిన వాడని తెలిపారు. జగ్గయ్యపేట పీఎస్ లో ఆయనపై రౌడీషీట్ కూడా ఉందని చెప్పారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి జగన్, మోహన్ బాబు, విష్ణులతో సాంబశివరావు దిగిన ఫొటోలను, కొన్ని వీడియోలను ఎన్నికల అధికారికి పంపించారు. ఓటర్లను సాంబశివరావు బెదిరించారని… ఆయన బెదిరింపులకు భయపడిన ఓటర్లు విష్ణు ప్యానల్ కి ఓట్లు వేశారని చెప్పారు. మా సభ్యులు కాని వారిని ఎన్నికల హాల్ లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకుని విష్ణు ప్యానల్ తిరిగిందని చెప్పారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు.