కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండిచేయి చూపారన్నారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. ఎపీకి ప్రత్యేక హోదా అంశంగానీ, విభజన చట్ట హామీల అమలుకు చర్యలుగానీ ఈ బడ్జెట్లో లేకపోవడం విచాకరమన్నారు.వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు లేదని మండిపడ్డారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలకు నిధుల ఊసే లేదన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తోంది రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగకరంగా ఉందన్న రుద్రరాజు.. పేదలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదన్నారు. 2024లో లోక్సభ ఎన్నికలను, 2023లో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకుని కేంద్రం ఈ బడ్జెట్లో అంకెల గారడీ చేసిందని ఆరోపించారు. కర్నాటకలో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా.. ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆంధ్రరాష్ట్రానికి మొండి చేయి చూపించారన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల ఊసే లేకపోవడం బాధాకరమన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు, ఎరువులు, పురుగు మందులు, పంటల భీమా, ఇరిగేషన్ వ్యవస్థ మెరుగుదల, గిట్టుబాటు ధరలు అమలు గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమని రుద్రరాజు పేర్కొన్నారు.