Social media:
మన దేశ జనాభాలో 66 శాతం 35 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారత్. మిలీనియల్స్, జెన్ జీ గా పరిగణించే వీరిలో 98 శాతం మంది స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. వీళ్లు రోజూ కనీసం ఒక్క వీడియో అయినా చూసే జాబితాలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా స్మార్ట్ గా తయారయ్యాయి. సంప్రదాయ టీవీ, పత్రికల కంటే నేరుగా చేతిలో ఉండే ఫోన్ కే సందేశం పంపించడానికి దారులు వేసుకున్నాయి. దీనికోసం పార్టీలు, నాయకులు సొంతంగా యూట్యూబ్ చానెల్స్ సహా ఇన్ స్టా గ్రాం, ఫేస్ బుక్ పేజీలు సృష్టించుకున్నారు. వీటికి అనుసంధానంగా వేలాది వాట్సాప్ గ్రూపులు కూడా పని చేస్తున్నాయి. దీనికోసం రాజకీయ పార్టీలు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి, డిజిటల్ వాలీంటర్లను కూడా రిక్రూట్ చేసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ రకం యాక్టివిటీకి కొదువలేదు. ఎన్నికల సీజన్ కావడం వల్ల ఆన్ లైన్ సందడి పెరిగింది. ఇటీవలి కాలంలో యువతలో రాజకీయ ఆసక్తి పెరగడం, రాజకీయ పార్టీలు, నాయకులు కొత్త ఓటర్లను లక్ష్యం చేసుకోవడం… ఈ రెండు పరిణామాలు పరస్పర ఆధారితాలే!
కోవిడ్-19 సంక్షోభం తర్వాత సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో పార్టీలు సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే, 2019 ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఫేస్ బుక్, ఈ ఎన్నికల్లో చతికిల పడింది. ఈ ఎన్నికల్లో యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం, వాట్సాప్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ సమయంలో రాజకీయ పార్టీల అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న ఎంగేజ్ మెంట్ గత కొన్ని రోజులుగా ఎలా మారుతూ వచ్చిందో పీపుల్స్ పల్స్ బృందం అధ్యయనం చేసింది.
క్షేత్రస్థాయిలో యువతతో మాట్లాడుతున్నప్పుడు… తాము ఒక సమస్యను అర్థం చేసుకోవడానికి, ఆ సమస్యపై అభిప్రాయాన్ని రూపొందిచుకోవడానికి యూ ట్యూబ్ చానెల్స్ చూస్తామని ఎక్కువమంది చెప్పారు. గత నెల రోజులుగా జాతీయంగా ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, బీజేపీ విధానాలపై చేస్తున్న విశ్లేషణాత్మక వీడియోల్ని సగటున 2 కోట్ల మంది వ్యూయర్స్ చూశారు. 1.9 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ఈ చానెల్ లో గత మూడు వారాల్లో అప్లోడ్ చేసిన వీడియాలు 11 కోట్ల మందికి చేరాయి. అదే సమయంలో యూట్యూబ్ లో 2.3 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ య్యూ ట్యూబ్ చానెల్ లో గత మూడు వారాల్లో పెట్టిన అత్యధిక వీడియోలకు వచ్చిన వ్యూస్ వేలల్లోనే ఉన్నాయి. 52 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూ ట్యూబ్ చానెల్ లో గత మూడు నాలుగు వారాల్లో అప్లోడ్ చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. య్యూ ట్యూబ్ అధికారిక డేటా ప్రకారం గత నెల రోజుల్లో అన్ని చానెళ్లలో కలిపి ఎక్కువమంది రాహుల్ గాంధీ ఉన్న వీడియోలనే చూశారు. రాహుల్ గాంధీ వీడియోలకు 43.5 కోట్ల వ్యూస్ రాగా, రెండో స్థానంలో ఉన్న నరేంద్రమోడీ వీడియోలకు 25.1 కోట్లు, ధ్రువ్ రాఠీ వీడియోలకు 16.7 కోట్లు, ప్రముఖ జర్నలిస్టు రావిశ్ కుమార్ వీడియోలకు 16.4 కోట్లు, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్ వీడియోలకు 4 కోట్లు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ వీడియోలకు 37 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ డేటానికి పరిశీలిస్తే, నెటిజన్స్ ఎవరిని ఎక్కువగా ఆసక్తిగా గమనిస్తున్నారో ఈ వ్యూస్ చూస్తే అర్థమైపోతుంది. అయితే, ఈ వీడియోల్ని కేవలం చూసి వదిలేస్తున్నారా? లేక వీటి ప్రభావం ఎన్నికలపై ఉంటుందా? అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది.
టీవీ చానెళ్లలో 24 గంటలు బలవంతంగా చెప్పే న్యూస్ కి ఆధారణ తగ్గింది. కానీ, సోషల్ మీడియాలో ఎంత కావాలంటే అంతే చెప్పేందుకు అవకాశం ఉంది. దీంతో తమకు కావాల్సిన కస్టమైజ్డ్ సమాచారం లేదా విశ్లేషణ కోసం ప్రజలు యూ ట్యూబ్ చానెళ్లను చూస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ జాతీయ న్యూస్ చానెళ్ల కంటే కూడా… ద్రూవ్ రాఠీ యూట్యూబ్ చానెల్ నే ఎక్కువమంది చూడటం దీనికి తార్కాణం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సొంతంగా ప్రధాన స్రవంతి మీడియా లేకున్నా, సోషల్ మీడియా, యూ ట్యూబ్ చానెళ్లు ప్రధాన పాత్ర పోషించాయి.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 65 శాతం మంది స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. 18-19 ఏళ్ల వయసున్న కొత్త ఓటర్లు తెలంగాణలో 9 లక్షల మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో 10.3 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లు మొత్తం సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. కాబట్టి, వీరిపై సోషల్ మీడియానే ప్రభావం తీవ్రంగా ఉంది. 5 నెలల క్రితం, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ యూ ట్యూబ్ చానెల్ సబ్ స్క్రైబర్స్ లక్షా పదివేల మంది ఉన్నారు. ఇప్పుడు అది 64 శాతం పెరిగి లక్షా 81 వేలకు చేరింది. అదే సమయంలో తెలంగాణ బీజేపీకి 24 వేలు ఉండగా, 304 శాతం పెరిగి 92 వేలకు చేరింది. కాంగ్రెస్ కి లక్ష ఉండగా, అది 150 శాతం పెరిగి నుంచి 2 లక్షల 50 వేలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో 5 నెలల కింద వైఎస్సార్సీపీకి 4.5 లక్షలు ఉండగా, ఇప్పుడు అది 26 శాతం పెరిగి 5.7 లక్షలకు చేరింది. టీడీపీకి సుమారు 2.4 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉండగా, ఇప్పుడు అది 85 శాతం పెరిగి 5.2 లక్షలకు చేరింది. జనసేనకు 13 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉండగా, ఇప్పుడు అది సుమారు 20 శాతం పెరిగి, 15.6 లక్షలకు చేరింది. ఈ ఎంగేజ్ మెంట్ ని జాగ్రత్తగా గమనిస్తే నెటిజన్స్ ఎవరివైపు చూస్తున్నారనేదానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.
ఇన్ స్టా గ్రామ్ లో వైసీపీ అధికారిక ఖాతాకు ప్రస్తుతం 2.1 లక్షల మంది ఫాలోవర్స్, టీడీపీకి 3.2 లక్షల మంది, జనసేనకు 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవారికి ఎక్కువ ఓట్లు వస్తాయని కాదు. ఫాలోవర్స్, స్పాన్సర్డ్ వీడియోలను పక్కనపెడితే, గడిచిన మూడు వారాల్లో వైసీపీ పెట్టిన వీడియోల కంటే, టీడీపీ, జనసేన పేజీలలో పెట్టిన కంటెంట్ కి ఎక్కువ ఎంగేజ్ మెంట్ కనిపిస్తోంది. జగన్ గులక రాయి దాడి వీడియోలు, వైసీపీ పేజీల కంటే కూటమి పేజీల్లోనే ఎక్కువగా చూశారు. తాము గెలుస్తున్నామని జగన్ ఐ ప్యాక్ ప్రతినిధులతో మాట్లాడిన వీడియో ఆయన ఇన్ స్టా గ్రాం ఖాతాలో 5 లక్షల మందికి మాత్రమే చేరింది. వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తే… నెటిజన్స్ ఎటువైపు ఆసక్తి కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారిక ఖాతాల్లో పోస్ట్ చేసిన కంటెంట్ కంటే, బీజేపీ తెలంగాణ షేర్ చేసిన కంటెంట్ కి ఎంగేజ్మెంట్ పెరిగింది. ఈ కోణంలో నెటిజన్స్ షిఫ్ట్ అవుతున్న తీరును అధ్యయనం చేస్తే ఆంధ్రాలో ఎక్కువమంది కూటమి, తెలంగాణలో అత్యధికులు బీజేపీ వైపు ఆసక్తి చూపిస్తున్నట్టు చూచాయగా తెలుస్తోంది. జాతీయ డిజిటల్ మీడియా ముఖ చిత్రాన్ని తాజాగా గమనిస్తే… బీజేపీపై నెటిజన్స్ అసంతృప్తి కనబరుస్తున్నట్టుగా, గతంలో కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు తరలి వెళ్లినట్టు ట్రెండ్స్ చెప్తున్నాయి. అయితే, ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్ ఇస్తున్న సంకేతాలు, ఎన్నికల తుది ఫలితాలు సమాంతరంగా ఉంటాయా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం జూన్ 4న తెలుస్తుంది.
– జి.మురళికృష్ణ,
రీసెర్చర్, పీపుల్స్పల్స్ రీసెర్చ్ సంస్థ,
Email: peoplespulse.hyd@gmail.com