Nancharaiah merugumala senior journalist
అంగలూరు + అరెకపూడి = ఆంధ్రోడు కాదు
త్రిపురనేని రామస్వామి సొంతూరు అంగలూరులోనే పీఏసీ ‘గాంధీ’ పుట్టాడు!
పదేళ్ల క్రితం అరెకపూడి గాంధీ శేరీలింగంపల్లి నుంచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు కృష్ణా జిల్లాలో మా నాన్న తల్లిండ్రులిద్దరూ పుట్టిపెరిగిన సొంతూరు ‘అంగలూరు’ వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడనే ఆనందం కలిగింది. అదీగాక, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణ అవతరణతో బాగా నష్టపోయిన తెలుగుదేశం తరఫున సైబరాబాద్ ప్రాంతమైన శేరిలింగంపల్లి నుంచి ఐటీఐ మాత్రమే చదివిన అరెకపూడి గాంధీ గెలవడం నాకెంతో మంచిగా అనిపించింది. గుడివాడ సమీపంలోని అంగలూరు గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. ఎందుకు? అనే ప్రశ్న వేయడం మొదట కొడుకుకు నేర్పించిన హేతువాది, సంఘ సంస్కర్త, బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రతిఘటించిన జస్టిస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి (చౌదరి అనే తోక ఆయనకు అవసరం లేదు, పేరొక్కటే చాలు) గారిది కూడా అంగలూరే. 1915 నాటికే 70 శాతానికి పైగా అక్షరాస్యత సాధించిన పెద్ద ‘కమ్మటూరు’ అంగలూరు. తర్వాత కొన్నేళ్లకు మహాత్మా మోహన్దాస్ గాంధీ వచ్చినప్పుడు అంగలూరు మహిళలు సైతం తమ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాల్లో ఏదో ఒక నగను ఆయనకు విరాళంగా ఇచ్చారు. మా నాయనమ్మ టీచర్ మెరుగుమాల (లోయ) నాగరత్నం కూడా తన ముక్కుపుడకను గాంధీజీకి విరాళంగా ఇచ్చిందని మా అమ్మ చాలాసార్లు చెప్పేది. కాంగ్రెసన్నా, ‘బాపూ’ అన్నా అప్పట్లో తీవ్రంగా ద్వేషించిన నాకు మా టీచర్ నాయనమ్మపై కోపమొచ్చేది ఆమె చేసిన పనికి. తర్వాత ఈ ఊరుకే చెందిన మాజీ కమ్యూనిస్టు, హేతువాది త్రిపురనేని వెంకటేశ్వరరావు గారు తెలుగునాట తొలి సిరామిక్ టైల్స్ కంపెనీ స్పార్టెక్ లిమిటెడ్ స్థాపించారు. ఆ కాలంలోనే రాజమండ్రి ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ రచయిత్రి ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి అనేక ప్రజాదరణ పొందిన తెలుగు నవలలు రాసి అంగలూరు కోడలిగా, ఆ ఊరి కమ్మ ఇంటిపేరు ఆరికెపూడిని తన పుట్టింటి ఇంటిపేరు కోడూరికి జతచేసి బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. నేను 2003–2007 మధ్య రామోజీఫిల్మ్ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న రోజుల్లో అక్కడ గణనీయ సంఖ్యలో పనిచేస్తున్న మా గుడివాడ ప్రాంత ఉన్నతోద్యోగులతో పరిచయం బాగా పెరిగింది. ఒక తరహా స్నేహంగా మారింది.
‘మీది అంగలూరైతే మీరు త్రిపురనేనివారా, ఆరికెపూడి వారా, బొప్పన వారా?’
ఆర్ఎఫ్సీ క్యాంటీన్లో భోజనమయ్యాక వారితో రాజకీయాల గురించి నేను లెక్చర్లు దంచేవాణ్ని. వారిలో ఎక్కువ మంది నాకు అభిమానులయ్యారు. ఈ క్రమంలో నా మాటతీరు చూసిన ఈ కమ్మ ఆర్ఎఫ్సీ ఉద్యోగులు కొందరు.. నేను కూడా వారి సామాజికవర్గానికి చెంది ఉంటాననే అంచనాతో, ‘ మీది కృష్ణా జిల్లాలో ఏ ఊరండీ?’ అని అడిగినప్పుడు వెంటనే, ‘గుడివాడ’ అని జవాబిచ్చేవాణ్ని. ‘కాదండీ, మీ నాన్నగారి తరఫు తాతముత్తాతల సొంతూరు ఏదో చెప్పండి,’ అని వాళ్లు అడిగేవారు. దానికి నేను, ‘గుడివాడ నుంచి మచిలీపట్నం పోయే దారిలో రెండో ఊరు అంగలూరు నుంచి మా తాత, నాయనమ్మ గుడివాడ వచ్చారు. మా నాన్న గుడివాడలోనే పుట్టినా సొంతూరు అంగలూరు అని చెబుతుంటాను. మా నాయనమ్మకు గుడివాడ మునిసిపల్ గాల్స్ స్కూల్కు బదిలీకావడంతో అంగలూరు నుంచి వచ్చేశారు,’ అని వివరంగా చెప్పేవాణ్ని. అంగలూరు అనీ అనగానే, ‘అయితే నాంచారయ్య గారూ, మీరు త్రిపురనేని వారా? ఆరికెపూడి వారా? బొప్పన వారా?’ అని చిరునవ్వుతో వారు ప్రశ్నించేవారు. దానికి నేను, ‘ ఈ మూడు ఇంటిపేర్లలో ఏ ఒక్కటీ నాది అయ్యే అవకాశం లేదు. మేం ఎర్ర గొల్లలమండీ. మా ఇంటిపేరు మెరుగుమాల,’ అని అనగానే ఆ కమ్మ మిత్రులు శానా ఇబ్బంది పడుతూనే షాక్ నుంచి కాస్త కుదుటపడి, ‘ దాందేముందిలెండి. ఏ కులమైనా మీరు చాలా మంచి ఆసక్తికరమైన విషయాలు చెబుతారు. అయినా, మా ఊళ్లలో కమ్మవారూ, యాదవులూ అన్నదమ్ముల్లా ఉంటామండీ,’ అని చెప్పేవాళ్లు. ఈ ఆర్ఎఫ్సీ మిత్రులే కాదు చదువుకున్న మధ్యతరగతికి చెందిన ఏ కులపోళ్లయినా వారిలాగానే మాట్లాడతారు. ఆలోచిస్తారు. ఒకరకంగా చూస్తే. కులం విషయంలో ఈ తరహా ఆర్ఎఫ్సీ ఉద్యోగులే చాలా వరకు మేలనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా అనాజ్పూర్ గ్రామ పరిధిలో నిర్మించిన ఆర్ఎఫ్సీలో పనిచేసిన అనేక మంది గుడివాడ చుట్టుపక్కలి తూర్పు కృష్ణా జిల్లాకు చెందినోళ్లు పై తరహాలో నాతో మాట్లాడడం వల్ల ఆరికెపూడి అనే ఇంటిపేరు చాలా బాగా గుర్తుండిపోయింది. (ఒక గ్రామంలో ఒక కులంలోని ఒకే ఇంటిపేరున్నోళ్లు ఎక్కువ మంది ఉంటే పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు పాలివాళ్లలో చావుల వల్ల ఆగిపోకుండా వారు ఇంటిపేరు స్పెలింగ్ కొద్దిగా మార్చుకుని రెండు మూడు కుదుళ్లుగా విడిపోతుంటారు. అందుకే త్రిపురనేని, త్రిపుర్నేని, తిపిర్నేని, ఇంకా ఆరికెపూడి, అరెకపూడి అని రకరకాలుగా మార్చుకుంటారు) చివరికి అరెకపూడి గాంధీ శేరీలింగంపల్లి శాసనసభ్యుడు కావడంతో హైదరాబాదులో అరెకపూడికి శాశ్వత గుర్తింపు వచ్చేసింది.
అంగలూరుకు పేరుప్రఖ్యాతులు తెచ్చిన త్రిపురనేని రామస్వామి, గోపీచంద్..విద్య, ఆరోగ్యం, సాగునీటి సౌకర్యాలు సమృద్ధిగా మొదటి నుంచీ ఉన్న అంగలూరులో సంపన్న, ఆధిపత్య వర్గం కమ్మల తర్వాత గౌడలు, గొల్లలు, మాలలు, మాదిగలు, ఇతర బీసీ కులాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండేవి నూరేళ్ల క్రితమే. కమ్మ వర్గం రెండు గ్రూపులుగా చీలి ఉంటే మిగిలిన అన్ని కులాల జనం కూడా ఈ రెండు వర్గాల అనుచరులుగా చీలి వారి వెంట నడిచేవారట. అంగలూరుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన త్రిపురనేని రామస్వామి 1914లో ఇంగ్లండ్ వెళ్లారు. అక్కడ (డబ్లిన్) బార్ అట్ లా, ఇంగ్లిష్ సాహిత్యం చదివారు. బ్రిటన్ నుంచి తిరిగి వస్తూ అక్కడి నుంచి తెచ్చిన హెర్క్యులస్ సైకిల్ అంగలూరుకు తీసుకొచ్చారు రామస్వామి గారు. సైకిల్ను అంగలూరు చెరువు పక్కన ఆయన నిలబెడితే–ఊరు జనం దాన్ని వింత జంతువును చూసినట్టు చూశారని పాత తరం వారు చెప్పిన మాటలు నా వరకూ తెలిశాయి. అయితే, బ్రిటిష్ వ్యతిరేకపోరాటానికి, సాహిత్య, సాంఘిక ఉద్యమాలకు పొరుగు జిల్లా గుంటూరులోని మం చి పేరున్న పట్టణం తెనాలిని కార్యక్షేత్రంగా రామస్వామి చేసుకున్నారు. బ్రిటిష్వారి హయాంలో జరిగిన తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో త్రిపురనేని రామస్వామి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన కొడుకు త్రిపురనేని గోపీచంద్ గారు ప్రసిద్ధ మేధావి, రచయిత, మహామనీషి అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గోపీచంద్ గారు అంగలూరులో గడిపిన రోజులు తక్కువేగాని నాటి మద్రాసులో సినీ దర ్శకుడిగా కొన్నేళ్లు ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్గా మాసాబ్ట్యాంక్ ఆఫీసులో పనిచేసినప్పుడు–తన దగ్గర అటెండర్గా పనిచేసిన ఉద్యోగి తెలంగాణ యాసను, తెలుగును పదే పదే మెచ్చుకునేవాడని ఇప్పటికీ కథలు కథలుగా చెబుతారు. వందేళ్ల క్రితమే 1925లో అంగలూరులో జరిగిన కమ్మ మహాసభల్లో ఆమోదించిన తీర్మానంలో ‘‘ మన కమ్మవారిలో స్కూల్ ఫైనల్ వరకూ చదివేవారి సంఖ్య బాగా తక్కువ. మనమంతా బాగా చదువుకోవాలి. అంతేగాక, ‘కమ్మవారిని నమ్మరాదు’ అని మనకు ఉన్న చెడ్డపేరును మనం తొలగించుకునేలా ప్రవర్తించాలి,’’ అని పిలుపునిచ్చారు.
అరవోళ్లూ, అంగలూరోళ్లూ ఆంధ్రా నుంచి అమెరికా దాకా కనిపిస్తారా?
నేను 1992 ప్రాంతంలో బెజవాడ ‘ఉదయం’లో పనిచేస్తుండగా ఉదయం రెసిడెంట్ ఎడిటర్, చీఫ్ ఆఫ్ బ్యూరో కొల్లు అంకబాబు గారిని ‘అవకాశమొస్తే మా పూర్వికుల ఊరుకే చెందిన ‘స్పార్టెక్’ త్రిపురనేని వెంకటేశ్వరరావు గారిని నాకు పరిచయం చేయండి,’ అని అనేకసార్లు అడిగేవాణ్ని. స్పార్టెక్ కంపెనీ విస్తరణకు సంబంధించి విజయవాడలో ఈ కంపెనీ ప్రెస్ మీట్లో మాట్లాడడానికి వచ్చిన వెంకటేశ్వరరావు గారికి నన్ను అంకబాబు గారు పరిచేయం చేస్తూ, ‘ నాంచారయ్య గారు నా కలీగ్. ఆయనది కూడా మీ అంగలూరేనండీ,’ అని చెప్పారు. దానికి త్రిపురనేని వెంకటేశ్వరరావు గారు నా వైపు చూసి, ‘‘అరవోళ్లూ (తమిళులు). అంగలూరోళ్లూ ఆంధ్రా నుంచి అమెరికా దాకా ఎక్కడైనా కనిపిస్తారు,’ అని చమత్కరించారు. ఆయన అన్నట్టే అంగలూరులో పుట్టి పెరిగిన అరెకపూడి గాంధీ ఇంటర్తో సమానమైన చదువుతో సరిపెట్టుకున్నా ప్రపంచ ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీలు కొలువై ఉన్న శేరీలింగంపల్లి నుంచి తెలంగాణ శాసనసభకు మూడుసార్లు ఎన్నికవడం చిన్న విషయం కాదు. అయితే, ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో వందలాది ఎకరాల పంటభూములు ఉన్న పెద్ద ధనిక రైతు కుటుంబం నుంచి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి రంజీ క్రికెట్ ప్లేయరేగాక అవరమున్నా లేకున్నా ఆవేశం తెచ్చుకుని వార్తల్లోకి ఎక్కడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. రాష్ట్ర మంత్రి, రాష్ట్రపతి భవన్లో ముఖ్య భద్రతా అధికారిగా పనిచేసిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధువు ఈ 36 ఏళ్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నల్లగొండ రెడ్లకు అల్లుడయ్యాక స్వయం కృషితో కోటీశ్వరుడైన తొలి ముదిరాజు, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను పొట్టివాడని ఎగతాళి చే స్తూ మాట్లాడిన దూకుడు కౌశిక్ది. మరి అంగలూరు వంటి గొప్ప బ్రాండ్ వాల్యూ ఉన్న ఊరి నుంచి వచ్చి, త్రిపురనేని రామస్వామి వారసత్వాన్ని పొందే ప్రయత్నం చేయకపోగా కరీంనగర్కు చెందిన బలిసిన రెడ్ల కుర్రాడి నోట్లో నోరు పెట్టడం ద్వారా అరెకపూడి గాంధీ అంగలూరులో కుటుంబ మూలాలున్న వేలాది మందిని నొచ్చుకునేలా చేశాడు. ప్రతి సంవత్సరం కార్తికమాసంలో తమ అంగలూరులో మూలాలుండి హైదరాబాద్లో స్థిరపడిన అన్ని కులాల వారినీ తాము గొప్పగా ఏర్పాటు చేసే వనభోజనాల కార్యక్రమానికి ఆహ్వానించే మంచి ఆనవాయితీ ఇక్కడి (సైబరాబాద్) అంగలూరు వ్యాపార, వాణిజ్య ప్రముఖులకు ఉంది. మరి వారంతా గాంధీ పోకడలు చూసి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిదే. ఇంతకీ పీఏసీ చైర్మన్ పదవిని అన్యాయంగా కాంగ్రెస్ సర్కారు పెద్దల సాయంతో పొందిన అరెకపూడి గాంధీ 63 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా అంగలూరు కమ్మ కుటుంబంలో పుట్టినవాడనే వాస్తవం పాడి కౌశిక్ రెడ్డికి తెలుసా? అంటే అనుమానమే!