హైదరాబాద్: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మహా న్యూస్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దాడిని ఆయన “హేయమైన చర్య”గా అభివర్ణించారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.
చానల్ కార్యాలయంపై కొందరు గుండాలు, రౌడీల మాదిరిగా దాడికి పాల్పడటం దుర్మార్గంగా అభివర్ణించారు. మీడియా సంస్థలపై భయభ్రాంతులు కలిగించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం సహించదన్నారు.
గతంలో బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని వెల్లడించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులు, సినీతారలు, న్యాయమూర్తులు, మహిళా ఐఏఎస్ అధికారులు, చివరికి తమ పార్టీ నాయకుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ చర్యను ఆయన “దేశ చరిత్రలో అమానుషమైన చర్య”గా పేర్కొన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్రగా అభివర్ణించిన మహేష్ గౌడ్, ఐపీఎస్ అధికారి ఉండాల్సిన స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రావును ప్రత్యేకంగా నియమించారని తెలిపారు. అతన్ని ఫోన్ ట్యాపింగ్ కు వెసులుబాటుగా ఉపయోగించారని ఆరోపించారు.
“వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరిచ్చారు?” అని ప్రశ్నించిన ఆయన, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కేవలం ప్రభాకర్ రావు, రాధాకృష్ణ మాత్రమే బాధ్యులు కాదని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, సంబంధిత అధికారులు, డీజీపీ, లీగల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం సెక్రటరీలూ దీనికి బాధ్యత వహించాల్సిందిగా పేర్కొన్నారు.