షాద్ నగర్: రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ దేశ విభజన రాజకీయాలను, విచ్ఛిన్న శక్తులను ఎదిరించేందుకు “జై బాపు, జై భీమ్,జై సంవిధాన్” కార్యక్రమాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్ధృతంగా చేపడతామని హెచ్చరించారు.మంగళవారం షాద్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే వీర్ల శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో భాగంగా టీపిసిసి చీఫ్ ప్రసంగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా అవమానించారని గుర్తు చేశారు.బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని, మనుస్మృతిని అమలు చేయాలని కుటిలంగా ప్రయత్నిస్తోందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా గల్లి నుండి ఢిల్లీ వరకు “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.ప్రధాని మోదీ, అమిత్ షా దేశ సమగ్రతకు, అఖండతకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారని మహేష్ గౌడ్ మండిపడ్డారు.
అంతకుముందు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కార్యాలయం నుంచి ఈడెన్ గార్డెన్స్ వరకు “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీ జరిగింది. భారీ జనసందోహంతో ర్యాలీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి పాల్గొన్నారు.
*దేశం విచ్ఛిన్నం చేయలనే కుట్ర*
అధికారమే పరమావధిగా, అధికారం లేకుంటే బతకలేమనే విధంగా బీజేపీ నాయకుల తీరు జీర్ణించుకోలేని విధంగా ఉంది.రాజకీయ స్వలాభం కోసం బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశ విచ్ఛిన్న శక్తులను తిప్పికొట్టేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమం చేపడుతున్నాం. పదేళ్ల కేంద్ర పాలనలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉంది.400 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు, అయినా వారిలో మార్పు రాలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా అర్థం చేసుకున్నారు.
*సామజిక న్యాయానికి పెద్దపీట*
దేశంలో అసమానతలు, ఆర్థిక వ్యత్యాసాలను రూపుమాపేందుకు రాహుల్ గాంధీ కుల గణనకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కుల గణన పూర్తి చేసి, ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారో స్పష్టం చేశారు. ఖర్గే, రాహుల్ గాంధీ సూచనల మేరకు ఒక బీసీ, ఇద్దరు ఎస్సీలకు కేబినెట్ లో చోటు ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టాం.టిపిసిసి కార్యవర్గంలో 70% శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, మహిళలకు కేటాయించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం.పాకిస్థాన్పై యుద్ధం అంటూ ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ, ట్రంప్ చెప్పగానే తోక ముడిచారు.92 వేల పాక్ సైనికులను ముక్కును నేలరాసిన చరిత్ర అపర ఖాళీమాత ఇందిరా గాంధీది. ప్రధాని పదవిపై మోదీకి యావ ఉంది కానీ, దేశంపై ప్రేమ లేదు.పాకిస్థాన్పై యుద్ధంలో దేశం సాధించింది ఏంటి? కోల్పోయింది ఏంటి? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందని టీపిసిసి చీఫ్ వ్యాఖ్యానించారు.