Hindutemple: పాతబస్తీలో దేవాలయంపై దాడిలో కుట్రలు..

BhulakshmiAlayam:

‘రక్షాపురం’ పేరులో ‘రక్షణ’ ఉన్నా ఆ ప్రాంతంలో హిందువులకు రక్షణ లేదు. ఎప్పుడేమీ జరుగుతుందనే అభద్రతాభావంతో హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. యావత్‌ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే కృష్ణాష్టమి వేడుకల వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనలతో గడిపారు. పాతబస్తీ శివారులలో ఉన్న డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ, బీడీఎల్‌ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరికి ఇప్పుడు రక్షణ లేకుండా పోవడం విచారకరం.

ఆగస్టు 26 సోమవారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో రక్షాపురంలో ఒక అమ్మవారి దేవాలయంపై ముష్కరులు దాడి చేసి అందులోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడంతో స్థానికుల్లో అభద్రతాభావం నెలకొంది. భాగ్యనగరంలో అందులో ముఖ్యంగా పాతబస్తీలో అర్థరాత్రులలో కూడా జనసంచారం సర్వసాధారణమే. ఆ సమయంలో పాతబస్తీలో ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఆలయంపై కొందరు యువకులు పనిగట్టుకొని దాడి చేశారంటే వీరి ధైర్యం వెనుక ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. సహనంతో ఉండే హిందువుల దేవాలయాలపై దాడులు చేయడం, తర్వాత పోలీసులు వచ్చి మతిస్థిమితం లేని వారు ఈ పనిచేశారని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం ఒక రివాజుగా మారింది. పది పదిహేను రోజుల తర్వాత ఘటనను మర్చిపోవడం ప్రజల వంతు అయ్యింది. అయితే రక్షాపురంలో జరిగిన ఈ ఘటన మతిస్థిమితం లేని ఒక మానసిక రోగి చేసింది కాదు. ఒక మతోన్మాద పిచ్చితో చేసింది. దీని వెనుక భారీ కుట్ర ఉంది.

రాజకీయ లక్ష్యంగా హిందువులపై కుట్రలు
పాతబస్తీలో ఎన్నికలు, రాజకీయ అంశాలు, ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ మతప్రాతిపదికనే జరుగుతాయనేది బహిరంగ రహస్యమే. ఈ ప్రాంతంలో మెజార్టీగా ఉన్న ముస్లింల అండతో ఓట్ల రాజకీయల్లో పైచేయి సాధిస్తున్న మజ్లీస్‌ పార్టీ తన పట్టును మరింత పెంచుకోవడానికి చేయవలసినదంతా చేస్తుంది. అయితే తెరవెనుక ఉండి నడిపించే ఈ కుయుక్తులకు అధికార, అనధికార అండదండలు నిత్యం ఉంటాయి. అక్రమంగా వలస వచ్చి పాతబస్తీ శివారులలో తిష్టవేసిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు అన్ని రకాల గుర్తింపు కార్డులిప్పించి పబ్బం గడుపుకుంటున్న ఆ పార్టీ మరోవైపు హిందువులు నివసించే ప్రాంతాలలో భయభ్రాంతులు సృష్టించి వారు అక్కడి నుండి పారిపోయే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అవకాశ రాజకీయాలతో గానీ, భయంతో గానీ ఆ పార్టీ వారికి పాలకులు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తూ వ్యవహరిస్తుండడంతో వీరి ఆడగాలకు అంతే లేకుండా పోయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తీరే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మజ్లీస్‌ పార్టీ ఆధిపత్యం ఉండే పాతబస్తీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంతో సహా అన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో ఆ పార్టీకి ఇతర పార్టీలతో ప్రధానంగా బీజేపీతో గట్టిపోటీ ఉండేది. పునర్విభజనలో ఎవరు చక్రం తిప్పారో కానీ సంబంధిత స్థానాల్లో మైనార్టీలు అధికంగా ఉండేలా విభజన చేయడంతో పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు మిగతా ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో కూడా ఇప్పుడు ఆ పార్టీకి ఎదురే లేకుండా పోయింది.

భాగ్యనగరం దక్షిణాన చార్మినార్‌కు కూతదూరంలో ఉండే గుల్జార్‌హౌజ్‌, శాలిబండ, హరిబౌలి, లాల్‌దర్వాజ, గౌలిపుర, సుల్తాన్‌షాహీ, పార్థివాడ, అలియాబాద్‌, జంగమ్మేట్‌, ఛత్రినాక, నల్లవాగు, ఉప్పుగూడ, అరుంధతి కాలనీ, రక్షాపురం వంటి ప్రాంతాల్లో హిందువులే మెజార్టీగా ఉండేవారు. 1990, 1992 పాతబస్తీలో అల్లర్లు, ఆ తర్వాత కాలంలో కూడా ఆయా ప్రాంతాల్లో అడపాదడపా శాంతిభద్రతల సమస్యలు రావడంతో భవిష్యత్‌పై ఆందోళనతో చాలా ప్రాంతాల్లో మెజార్టీ హిందూ కుటుంబాలు పాతబస్తీని వీడి నగరంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడడంతో సదరు ప్రాంతాల్లో హిందువులు సంఖ్యాపరంగా మైనార్టీలుగా మారారు. ఇప్పుడు పాతబస్తీలో హిందువులు అధికంగా నివాసించే ప్రాంతాలు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. రక్షాపురం ఘటనకు, పాతబస్తీ రాజకీయాలకు, హిందువుల వలసలకు దగ్గర సంబంధం ఉండడంతోనే వీటి గురించి చర్చించాల్సి వచ్చింది. స్థూలంగా ఏమిటంటే హిందువులను పాతబస్తీలోని పలు ప్రాంతాల నుండి వీలైనంతగా పారిపోయేలా చేసి రాజకీయంగా మరింత బలపడేందుకు చేయాల్సిన ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. రక్షాపురంలో దేవాలయంపై దాడికి కూడా ప్రధాన కారణం ఇదే అని పలు కారణాలు నిరూపిస్తున్నాయి. కార్యాలయాలకు దగ్గరగా ఉంటుందని రక్షణ శాఖ సంస్థల సిబ్బంది ఏర్పాటు చేసుకున్న రక్షాపురం కాలనీ గతంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. విశాలమైన రోడ్లు, పార్కు, వసతులతో ఉండే ఆ కాలనీలో ఒకప్పుడు అక్కడ ఇళ్లు దొరకాలంటే గగనంగా ఉండేది. అయితే పాతబస్తీ శివారులలో ఉండడంతోనే ఆ కాలనీ వాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలనీకి ఒక పక్క హిందువులు అధికంగా ఉండే ఉప్పుగూడ, అరుంధతీ కాలనీలుండగా, మరోవైపు ముస్లింలు అధికంగా ఉండే రియాసత్‌ నగర్‌తో పాటు పలు బస్తీలున్నాయి. దీంతో రక్షాపురం కాలనీలో పాగా వేయాలని చూస్తున్న కొన్ని దుష్టశక్తులు కాలనీలో అశాంతి కలిగేలా ఒక ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు.
రక్షాపురంలో అశాంతే ధ్యేయం
రక్షాపురం కాలనీని ఆనుకొని ఉన్న రియాసత్‌ నగర్‌ నుండి కొంత మంది పనిగట్టుకొని కాలనీ వాసులతో ఏదో అంశంపై తరచూ ఘర్షణలకు దిగుతున్నారు. దీంతో విద్యావంతులైన కాలనీవాసులోని కొందరు తమ పిల్లల భవిష్యత్‌పై ఆలోచనలతో అక్కడి నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించారు. దీన్ని అవకాశంగా తీసుకొని ముస్లింలు ఈ ఇళ్లను కొనుక్కోవడం ప్రారంభించడంతో కాలనీలో మెజార్టీగా ఉన్న హిందువుల సంఖ్య క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. గతంలో రక్షాపురం కాలనీలో 95 శాతంపైగా ఉండే హిందువులు ఇప్పుడు 40 శాతం లోపలే ఉండడం ఇందుకు నిదర్శనం. గత ఐదేళ్ల నుండి ఈ వలసలు మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఉన్న కొంత మంది హిందువులు కూడా ఇక్కడి నుండి వెళ్లిపోయేలా భయభ్రాంతులను చేయాలని కొందరు పనిగట్టుకొని కొంత కాలంగా దుశ్చర్య ఘటనలు కాలనీలో తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.


గతంలో రక్షాపురంలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే… రక్షాపురం కాలనీలో ఉన్న పార్కులో స్థానికులు వినాయక మండపం ఏర్పాటు చేయడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. పార్కు సమీపంలో ముస్లింలు ఇళ్లను కొనుగోలు చేయడంతో పార్కులో వినాయక విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పడంతో పోలీసులు యువకులు తీసుకొచ్చిన విగ్రహాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంతో అప్పటి నుండి అక్కడ మండపం ఏర్పాటు చేయడం లేదని స్థానిక యువకులు చెబుతున్నారు. మరో ఘటనలో కాలనీలో ఇతర చోట ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పశు మాంసాలను పడేసి అసభ్య వాతావరణాన్ని సృష్టించారు. ప్రస్తుతం దాడి జరిగిన అమ్మవారి దేవాలయం ద్వారాలను గతంలో జరిగిన ఒక ఘటనలో ధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే దేవాలయంపై దాడి చేశారు. రెండు ప్రాంతాల సరిహద్దులో ఉన్న ఈ దేవాలయంపై దాడి చేస్తే సంచలనం అవుతుందని, దీంతో రక్షాపురం కాలనీ వాసులు మరింత భయభ్రాంతులకు గురవుతారనే ఉద్ధేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారు. ముందస్తు ప్రణాళికలతో జరిగిన పై ఘటనలన్నింటనీ పరిశీలిస్తే రక్షాపురం కాలనీ వాసులకు రక్షణ లేకుండా చేసి వారిలో భయాలను సృష్టించి సొంత ఇళ్లను అమ్ముకొని పారిపోయేలా చేయడమే ముష్కరుల ప్రధాన లక్ష్యంగా స్పష్టమవుతుందని స్థానికులు చెబుతున్నారు.


మతిస్థిమితం ఒక సాకు మాత్రమే
పవిత్రమైన శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున జరిగిన ఈ ఘటన వెనుక భారీ కుట్ర ఉంది. దాడి చేసిన వారిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు ఒక మతిస్థిమితం లేనివాడని పోలీసులు చెబుతుండడం అనేక సందేహాలకు తావిస్తుంది. స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ద్విచక్రవాహనాలపై కొందరు యువకులు దేవాలయం సమీపంలోకి రాగా, వారిలో ఒకడు దేవాలయం ద్వారాలను పగులగొట్టి లోపలున్న అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశాడని, ఈ అలికిడితో చుట్టుపక్కలుండే స్థానికులు ఘటనాస్థలానికి చేరుకునే లోపలే దుండగులు పారిపోయారు.

నిందితుడు మతిస్థిమితం లేనివాడే అయితే, అతని వెంట వచ్చిన వారు పిచ్చి వాడు చేస్తున్న పిచ్చి పనులను ఆపకుండా చూస్తూ కూర్చున్నారా..? వారెందుకు మౌనంగా ప్రోత్సాహించారు..? లేకపోతే వారు కూడా మతిస్థిమితం లేనివారేనా..? ఇది మతిస్థిమితం లేని వాడొక్కనే చేసిన దుశ్చర్యే అయితే పోలీసులు ముగ్గురిని ఎందుకు అరెస్టు చేసినట్టు..? వారందరికీ మతిస్థిమితం లేదా..? ఘటనా స్థలంలో విగ్రహాలు ధ్వంసం అయిన తీరును చూస్తే దుండుగులు ఏదో పెద్ద బండరాయి లేదా మరో పెద్ద వస్తువుతో దాడి చేస్తేనే అమ్మవారి తల ముక్కలైనట్టు కనిపిస్తుంది. ఒక పిచ్చివాడు ఒక్కడే విగ్రహ ధ్వంసానికి బరువైన రాయిని లేదా బరువైన వస్తువును లోపలికి మోసుకెళ్లగలిగాడా..? విగ్రహాన్ని ధ్వంసం చేసిన మతోన్మాది అమ్మవారి విగ్రహానే లక్ష్యంగా చేసుకున్నాడు. దేవాలయంలో ఉన్న ఇతర వస్తువుల వద్దకు, హుండీ జోలికెళ్లలేదు. మానసిక స్థితి లేని వాడు ఒకే లక్ష్యంగా పని పూర్తి చేస్తాడా..? స్థానికులు చెబుతున్న దాని ప్రకారం గతంలో ఇదే దేవాలయం ద్వారాన్ని ధ్వంసం చేసింది కూడా ఈ దుష్టుడే. స్థానికులు చెప్పిందే నిజమైతే ఒక దుండగుడు ఒక దేవాలయం ధ్వంసమే లక్ష్యాన్ని నిర్ధేశించుకోవడాన్ని మానసికస్థితి సరిగ్గాలేదని అంటారా..?

ఈ ఘటనలో మరో విచిత్రమేమిటంటే దుండగులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి పట్టుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొద్ది సేపటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఎంఐఎం కార్పొరేటర్‌ తానే దుండుగులను గుర్తించి పోలీసులకు అప్పగించినట్టు చెపుకుంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇదే నిజమైతే పోలీసుల కంటే ముందే కార్పొరేటర్‌ నిందితుడిని ఎలా గుర్తించారో..? పోలీసులకు, ఆ కార్పొరేటర్‌కే తెలియాలి. ఘటనా స్థలం దేవాలయానికి సమీపంలో కార్పొరేటర్‌ ఇల్లు ఉండడంతో కొందరు హిందువులు ఆవేశంగా ఘటనపై ఆయనను ప్రశ్నించడానికి వెళ్తే వారు తనపై దాడికి ప్రయత్నించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఆయన నిజాయితీ బట్టబయలైంది. ఘటనపై స్థానికులు నిలదీస్తున్న ఈ ప్రశ్నలకు పోలీసుల వద్ద నుండి సరైన సమాధానమే కరువవడంతో అనేక సందేహాలకు తావిస్తుంది.
హిందువుల మనోభావాలే లక్ష్యంగా దాడి
అమ్మవారి విగ్రహాల ధ్వంసం కోసం దుండుగుడు ఎంచుకున్న సమయాన్ని పరిశీలిస్తే ఈ కుట్ర వెనకున్న దురుద్ధేశాలు బయటపడుతున్నాయి. శ్రావణ మాసంలో హిందువులకు అమ్మవారు ఆరాధ్య దైవం. పవిత్ర సోమవారం, కష్ణాష్టమి. తెల్లారితే శ్రావణ మంగళవారం రోజున అమ్మవారిని మంగళగౌరీగా హిందూ మహిళలు పూజిస్తారు. ఇంతటి పవిత్ర దినాలలో దేవాలయంలో ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ కుట్రకు తెరదీశారు. అంతేకాక త్వరలో వినాయక ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. నగరంలో ప్రధానంగా పాతబస్తీలో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. హిందూ ఐక్యత ఈ దుష్టశక్తులకు కంటగింపుగా మారడంతో ఈ ఉత్సవాల సమయంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించాలనేది వీరి మరో కుట్రగా కనిపిస్తుంది. అంతేకాక రక్షాపురం పార్కులో ఇప్పటికే వినాయక మండపం ఏర్పాటును అడ్డుకున్న వీరికి, కాలనీలోని ఇతర ప్రాంతాలలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే వారిలో కూడా ఒకరకమైన భయానక వాతావరణం కల్పించాలని వీరి దురాలోచన. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఈ ఘటనకు ఒక కారణం కావచ్చనే మరో వాదన కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ‘హైడ్రా’ కింద నగరంలోని పలు అక్రమ కట్టడాలను నేలకూల్చుతున్న పరంపరలో ఎంఐఎం నేత ఓవైసీ కుటుంబానికి చెందిన భవనాలు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయనే ప్రచారం జరగుతోంది. దీనిపై ఓవైసీ సోదరులు మాటల యుద్దాన్ని మొదలుపెట్టి ప్రభుత్వాన్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హైడ్రా’ అంశాన్ని మరుగున పర్చేలా పాతబస్తీలో ఏదో విధంగా అల్లర్లు రేపి పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ కుట్రకు తెరలేపారనే వ్యాఖ్యలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి.
సనాతన ధర్మాన్ని పాటించే వారిని భయపెట్టాలని హిందూ వ్యతిరేక శక్తులు ఎన్ని కుట్రలకు తెరలేపినా పాతబస్తీలోని హిందువులు వీటిని ఐక్యంగా, ధైర్యాంగా అడ్డుకున్నారు. రక్షాపురంలో ఆలయంపై దాడి జరిగిన నిమిషాల్లోనే స్థానికులతో పాటు వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ, బీజేపీ, పలు హిందూ సంఘాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దీంతో అన్నివైపుల నుండి ఒత్తిడి తీవ్రమవడంతో స్వల్ప కాలంలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత మేల్కొనే కంటే ముందస్తుగానే కలిసికట్టుగా జాగ్రత్తపడితే హిందువులపై కన్నెత్తడానికే దుష్ట శక్తులు జంకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా, సనాతన ధర్మాని పరిరక్షించేలా ఆ పరాశక్తి హిందువులను జాగృత పరిచే విధంగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుందాం.

=========


-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ(ఎనలిస్ట్)

Optimized by Optimole