IndiraGandhi Birthanniversary:
ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా ‘సౌత్ గ్లోబ్’ అని మనం గొంతెత్తుతున్నామే… అభివృద్ది చెందని-వెనుకబాటు ‘దక్షిణ ప్రపంచ’ దేశాలకు ఒక ఉమ్మడి ఊపిరయింది. ఆ ధీర-గంభీర స్వరం వేరెవరిదో కాదు…. భారత ఉక్కుమహిళా ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీది. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిర్వహించిన తొలి ప్రపంచ పర్యావరణ సదస్సు (1972) వేదికగా సాగిన ఆమె ప్రసంగ విశ్వరూప విన్యాసమే కాదు… అంతకు ముందు, ఆ తర్వాత దేశంలో ఆమె ఆలోచనలు, చేపట్టిన కార్యక్రమాలు, తెచ్చిన చట్టాలే అర్థశతాబ్ది తదనంతర పరిస్థితులకుదిశానిర్దేశ్యమవుతున్నాయి. అటు అజర్బైజాన్లో మొదలైన కాప్-29 సదస్సు, ఇటు ఇందిరాగాంధీ జయంతి వేడుకలు… యాదృచ్ఛికమే అయినా తప్పక స్మరణీయం.
ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవ కారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు ‘పర్యావరణ మార్పు’ దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ది చెందుతున్న దేశాలకు అభివృద్ది చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ‘పదమూడేళ్ల కింద (2011 కొపెన్హెగెన్) మీరే అంగీకరించి, సంసిద్దత ప్రకటించినట్టు యేటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీమీ వ్యాపారాల వృద్దికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది.
అజైర్బైజాన్లోని ‘బాకు’లో భాగస్వామ్య దేశాల కాప్-29 సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది. ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, ప్రతిదీ శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కాప్ సదస్సుల విధానాలు-నిర్ణయాలను ప్రభావితం చేయలేకపోతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వంలేకపోవడమేనన్నది కొట్టచ్చినట్టు కనిపించే వాస్తవం. సమ్యక్దృష్టి కలిగిన నాయకత్వ సమస్య మన ఒక్కరిదే కాదు, అది ఇవాళ ప్రపంచ సమస్య. కానీ, యాబై యేళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి. తదుపరి అయిదారు దశాబ్దాల్లో రాగల విపరిణామాలను ఆమె అప్పుడే పసిగట్టారు. అభివృద్ది-పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న-పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనావేశారు. అభివృద్ది పేరిట ప్రకృతి వనరులను అవసరాలకు, దామాషాకు మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు. పేదరిక నిర్మూలన అన్నది ఉమ్మడి అభివృద్ది నినాదంలో అంతర్భాగం కావాలని ఆమె అభిలషించారు.
స్టాక్హోమ్ సదస్సు కన్నా ముందే!
భారత దేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971-72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని దృవీకరిస్తాయి. పారిశ్రామికీకరణ తర్వాతి కాలంలో పెరిగిన కాలుష్యాలపై అసలైన ప్రపంచ దృష్టి సారింపు రెండో ప్రపంచ యుద్దం తర్వాతే మొదలైంది. ముఖ్యంగా అరవైల తర్వాత ఐరోపా, అమెరికాలో ప్రస్పుటమైన ఆలోచనలు మొదలయ్యాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్య సమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్హోమ్లో 1972 జూన్లో జరిగింది. కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక-సమన్వయ జాతీయ కమిటి’ (ఎన్సీఈపీసీ) భారత్లో ఏర్పాటయింది. దీని ఏర్పాటు ఇందిరాగాంధీ చొరవ అయితే, ఆమె దాదాపు ఒక దశాబ్దకాలం పాటు వెల్లడిరచిన పర్యావరణ దృక్పథం, చేసిన ప్రసంగాలు, తీసుకున్న నిర్ణయాల వెనుక ఎన్సీఈపీసీ శాస్త్రవేత్తలు, నిపుణులు అందించిన సమాచారం, డాటా ఉండేదని అప్పట్లో ప్రచారం. ఆ కమిటీయే 1985లో కేంద్ర పర్యావరణ`అటవీ మంత్రిత్వ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్తో యుద్దం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో…. పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ బుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు. అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ది పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనం..
స్టాక్హోమ్ పర్యావరణ వేధికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన, ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది, దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవి`వన్యప్రాణి-సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు. స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదారణంగా ఎండగట్టారు. అభివృద్ది- పర్యావరణ ఘర్షణ ను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు. ‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే… యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు ఛైర్మన్గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు.
‘ప్రకృతి పరిరక్షణ`పర్యావరణ వాదన అనేది అభివృద్ది- పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదని, అదే వారి జీవనప్రమాణాల వృద్దికి దోహదపడుతుందని వివరిస్తూ, వారికి మనం నిరూపించాల్సి ఉంద’నీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించుకోజాలమని ఇందిరాగాంధీ ఆనాడే హెచ్చరించారు.
ముందు- వెనక చూపు..
పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైకా గ్రహం’ వంటి మాటల్ని ఇందిరాగాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ది పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. 1953 లో తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించినపుడు ‘ప్రపంచ అత్యున్నత శిఖరాన్ని జయించిన మనిషి’ అన్న ప్రచారాన్ని నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తప్పుబట్టారని, ‘జయించడమేమిటి? అదొక పొగరుబోతు మాట, మనమంతా ప్రకృతి విధేయులమ’ని నెహ్రూ పేర్కొన్నట్టు ఆమె గుర్తు చేశారు. సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని సంఘ సంస్కర్తగా బుద్దుడు, పాలకుడిగా అశోకుడు రెండు వేల యేళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు.
కర్భన ఉద్గారాలు, కట్టలు తెగిన కాలుష్యం వల్ల భూతాపోన్నతి ‘వాతావరణ మార్పు’గా పెను ప్రమాదమై ముంచుకొస్తోంది. పాలకులు, ప్రభుత్వాలు, కంపెనీలు, కార్పొరేట్లు, పౌర సమాజం, ప్రజా సంఘాలే కాదు వ్యక్తులుగా అందరూ చేతనతో ఉండాల్సిన సమయం. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్హోమ్లో చెప్పిన ‘‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!