Nadendlamanohar: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అందుకోసం పూర్తి స్థాయిలో సాంకేతికత సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ధాన్యం అమ్మకం నుంచి మిల్లు ఎంపిక చేసుకునే వరకు రైతుకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో రైతుకి భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని తెలిపారు. ఐదేళ్ల పాలన గురించి ఒక్క రోజు కూడా గర్వంగా చెప్పుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అద్భుతం చేశామని మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. నిజాయతీ ఉంటే రైతులకు రబీ ధాన్యం బకాయిలు ఎందుకు చెల్లించుకుండా వెళ్లిపోయారో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా తగ్గకుండా నిజాయతీగా ప్రజల పక్షాన నిలబడ్డామని మంత్రి అన్నారు.
శుక్రవారం సాయంత్రం విజయవాడలో పది జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అనుసరించాల్సిన విధివిధానాలపై వర్క్ షాపు నిర్వహించారు. ఆనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రైతును ఆదుకునే విధంగా, రైతు కష్టపడి పండించిన ప్రతి గింజకు భరోసా ఇచ్చే విధంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించబోతున్నాం. అందుకు సన్నద్దంగా పది జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్, కో ఆపరేటివ్, వ్యవసాయ శాఖల అధికారులతో వర్క్ షాపు ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ఈ వర్క్ షాపులు నిర్వహిస్తాం. సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ప్రతి రైతుకీ గౌరవం ఇచ్చే విధంగా, కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను ఉపయోగించి ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కొనుగోళ్లు పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశాము. రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు క్షేత్ర స్థాయిలో రవాణాకి ఇబ్బందులు లేకుండా పెద్ద సంఖ్యలో లారీలు సిద్ధం చేస్తున్నాం. జీపీఎస్ కి అనుసంధానం చేసి ప్రతి బస్తా ట్రాన్స్ పోర్టు డేటా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశాం. పూర్తి స్థాయిలో సంచులు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి ,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మేరకు రైతు ధాన్యం మిల్లరుకు అప్పగించిన 48 గంటల్లోపు వారి బ్యాంకు ఖాతాలకు డబ్బు చెల్లించేందుకు సిద్ధమవుతున్నాం. వ్యవసాయ రంగానికి పూర్తి భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మనోహర్ వెల్లడించారు.