ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే!

ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే!

Nancharaiah merugumala senior journalist:  (ఇందిర, సంజయ్, రాజీవ్‌ లకు ‘గాంధీ’ ఇంటిపేరుగా మారడంతో అసలు గాంధీకే చెడ్డపేరొచ్చింది!ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే!)

==================

జర్నలిస్టు–మేధావి, ‘స్వతంత్ర’ కాంగ్రెస్‌ నేత నేత ఫిరోజ్‌ గాంధీతో కూతురు ఇందిరా ప్రియదర్శిని (అప్పటికి 24 ఏళ్లు) పెళ్లి సమయంలో (1942, మార్చి 26న) పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ చేసిన ఒక ‘పాపం’ భారతదేశంలో ‘గాంధీ’ అనే గుజరాతీ వైశ్య ఇంటి పేరుకు చెడు లేదా దుష్ట స్వభావాన్ని ఆపాదించేసింది. గుజరాతీ జొరాష్ట్రియన్‌ (ఫార్సీ లేదా పార్శీ) కుటుంబంలో పుట్టిన ఫిరోజ్‌ జహంగీర్‌ (రెండో మాట ఆయన తండ్రి పేరు) ఘాండీ (Ghandy) ఇంటిపేరు ‘ఘాండీ’ నెహ్రూజీకి ఎందుకో ‘ఇబ్బందికరంగా’ కనిపించింది. అత్యంత ఆధునికుడిగా ముద్రపడిన నెహ్రూ జీకి ఫిరోజ్‌ ఏ కారణంగానో నచ్చ లేదు. అల్లుడు రాసే, మాట్లాడే ఇంగ్లిష్‌ అంటే కూడా ఆయనకు చిరాకేనట. కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాగాని చిన్నప్పుడు అలహాబాద్‌ లో తండ్రి మోతీలాల్‌ జీ ప్రభావం, ఇంగ్లండ్‌ స్కూలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో చదువుల వల్ల తనకు ఇష్టంలేని అల్లుడు ఇంటి పేరు వింతగా కనిపించింది నెహ్రూ గారికి. అందుకే, ‘కనీసం నీ ఇంటి పేరు ఘాండీ ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ Ghandy ని శాశ్వతంగా Gandhi అని మార్చుకో,’ అని ఆయన పట్టుబట్టారు లేదా సూచించారు మన తొలి ప్రధాని. అంటే తాను తండ్రిగా ప్రేమించే, పూజించే మోహన్‌ దాస్‌ కే గాంధీ ఇంటి పేరులా అల్లుడి కుటుంబనామం మారితే ఎవరికీ వింతగా ఉండదని నెహ్రూ జీ అనుకున్నారు. కాదు, తన అల్లుడు ఫిరోజ్‌ మహాత్మా గాంధీ బంధువు అని జనం భ్రమపడతారనే ఆశ కూడా జవాహర్‌ లాల్‌ కు అప్పట్లో ఉండేదనేది కొందరు నెహ్రూ వ్యతిరేకుల అభిప్రాయం.

ఏదైతేనేమి–అల్లుడు ఫిరోజ్‌ తో తన కూతురు ఇందూ పెళ్లి నెహ్రూజీకి నచ్చకపోవడంతో ఈ ఫార్సీ యువకుడిని మహాత్మా గాంధీ దత్తత తీసుకున్నారనే ప్రచారం లేదా అభిప్రాయం ఇప్పటికీ చదువుకున్న కోట్లాది మంది భారతీయుల్లో ఉంది. వాస్తవానికి అత్యున్నత వ్యక్తిత్వం, నెహ్ర కుటుంబ సభ్యులకు లేని నిజాయితీ, విలువలు ఉన్న ఫిరోజ్‌ ను గాంధీ దత్తత తీసుకున్న మాట పూర్తిగా అబద్ధం. ఇది కేవలం కట్టుకథ మాత్రమే. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రాసిన (లండన్‌ కింగ్స్‌ కాలేజీ ఇండియా ఇనిస్టిట్యూట్‌ లో డైరెక్టర్‌ హోదాలో పాఠాలు చెప్పిన అధ్యాపకుడు ఆయన) సింధీ మేధావి ప్రొఫెసర్‌ సునీల్‌ ఖిల్నాణీ ఒక ఇంటర్వ్యూలో కూడా ధ్రువీకరించారు. ఇప్పుడు దిల్లీ సమీపంలోని అశోకా యూనివర్సిటీలో ఖిల్నాణీ రాజనీతిశాస్త్రం, చరిత్ర బోధిస్తున్నారు. ఏదేమైనా–ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ పరిపాలనలో అవకతవకలు, అవినీతి కారణంగా వారు పెట్టుకున్న ‘గాంధీ’ అనే ఇంటి పేరు ఉన్నవారికేగాక, మహాత్మా గాంధీకి కూడా ‘చెడ్డపేరు’ వచ్చిందనే అభిప్రాయం కొన్ని వర్గాల ప్రజల్లో విస్తృతంగా వ్యాపించింది.