తెలంగాణా: జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె..సభకి సంబంధించి తండ్రి కేసిఆర్ కి లేఖ రాశారు. ఆ లేఖ లీక్ కావడంతో ఇండైరెక్టుగా కేటీఆర్, సంతోష్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. తదనంతర పరిణామాలతో ఆమె పార్టీ మార్పుపై అటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ… ప్రజల్లో తీవ్ర చర్చ రేకెత్తింది. కవిత సొంతగా పార్టీ పెడుతుందని, కాంగ్రెస్ లో చేరుతుందంటూ ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటికి కవిత చెక్ పెడుతూ నేను ఏ పార్టీలోనూ చేరడం లేదంటూ ఆమె కుండ బద్దలు కొట్టారు.
*జాగృతి కమిటీలతో జోరు*
జాగృతి కమిటీల ఏర్పాటుతో రాజకీయంగా బలపడేందుకు కవిత వ్యూహాత్మాకంగా అడుగులు వేస్తున్నారు. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గ్రామ స్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేసి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీ, బహుజన నినాదం ఎత్తుకొని.. ఓ పక్క గ్రామాల్లో , జిల్లాల్లో పర్యటిస్తూనే అదే స్థాయిలో గ్రేటర్ కు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ కు కాళేశ్వర నోటిసులపై కవిత ధర్నా నిర్వహించారు. బిఆర్ఎస్ నేతల నుంచి ఆశించిన మేర స్పందన లేకపోవడంతో జాగృతి పేరిట ధర్నా నిర్వహించి తనదైన శైలిలో అధికార పార్టీని ఎండగట్టారు.
*గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి*
రాబోయే మూడు నెలలకి సంబంధించి రాజకీయ కార్యాచరణను కవిత ఇప్పటికే సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు జాగృతి ద్వారా బతుకమ్మ పండుగను ప్రధానంగా నిర్వహిస్తూ వస్తున్నారు. రానున్నది పండుగల సీజన్ కావడంతో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఆషాడంలో బోనాలు, వినాయకచవితి, దేవినవరాత్రులు, బతుకమ్మ పండుగలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని కవిత భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే పట్టణాల్లో బస్తీ నిద్రలు, బస్తీ కమిటీలు వేస్తున్నారు. అటు పల్లెల్లో పల్లె నిద్రలు, కమిటీలపై సైతం ప్రధానంగా దృష్టి సారించారు. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించి పలు ఏరియాల్లో బస్తీ కమిటీలను వేసేందుకు ప్రణాళికలను రచించారు.
ఉప ఎన్నికల్లో కీ రోల్..
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో జాగృతి పాత్ర కీలకంగా ఉండేలా కవిత ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
ఏదైనా డివిజన్ ఇన్ చార్జ్ గా పనిచేయాలని ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్లు..ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్ రావునగర్, రెహమత్ నగర్, యూసఫ్ గూడ,షేక్ పేట్, సోమాజి గూడలపై ప్రత్యేక దృష్టి సారించారు. వీటిలో పలు డివిజన్లలో ఇప్పటికే కమిటీలపై కసరత్తు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ గ్లలీ చిన్నది గరిబోళ్ల కథ పెద్దది అంటూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఈ పాటను కూడా మరోసారి ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా పాటను సిద్ధం చేయాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.