bjp telangana,bjp,

BJP: ద‌క్షిణాదిన‌ పుంజుకున్న‌ బీజేపీ..

BJP: 

‘‘ఉత్తరాదికి చెందిన భారతీయ జనతా పార్టీ బలం దక్షిణాదిన నామమాత్రమే… హిందీ బెల్టు రాష్ట్రాల్లో ఆధిపత్యం చెలాయించే బీజేపీకి ఇక్కడ ఉనికే లేదు…’’ అంటూ ప్రతిపక్షాలు, మేధావులుగా చెప్పుకునే రాజకీయ విశ్లేషకులు నిత్యం చేసే ప్రకటనలు తప్పని 2024 దేశ సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీ ఈ ఎన్నికల్లో దక్షిణ భారత దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కూడా గణనీయమైన ఫలితాలను సాధించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండీ’ నేతలు మరింత రెచ్చిపోయి అవకాశవాద రాజకీయాల కోసం ఉత్తర, దక్షిణ భారతీయుల మధ్య విభేదాలు సృష్టించేలా ఉత్తర, దక్షిణ అనే విభజన రేఖను గీయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నించాయి. 

ఎన్నికల యుద్ధానికి ముందే నరేంద్ర మోదీని ఎదుర్కోలేమనే నిర్ణయానికి వచ్చిన ‘ఇండీ’ కూటమి నేతలు దేశవ్యాప్తంగా బలపడిని బీజేపీని దక్షిణాదిన అడ్డుకుంటే ఎన్డీఏను కేంద్రంలో అధికారానికి దూరం చేయవచ్చనే ఆలోచనలతో ఎన్నికలకు ముందే ప్రణాళికలు రూపొందించారు. మోదీ ప్రభుత్వంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, అభివృద్ధిపై వివక్ష చూపిస్తున్నారని, నిధులు కేటాయించడం లేదని నిరాధరమైన ఆరోపణలు చేశారు. దేశంలో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్న కాంగ్రెస్‌ వెనుక ఉండి తమ మిత్రపక్షాలతో సెంటిమెంట్‌ ప్రకటనలు చేయించింది. వీటికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే, జాతీయ రహదారుల కల్పనలో దేశ వ్యాప్తంగా ఒకే విధంగా అభివృద్ధి చేయడం, రాష్ట్రాలకు రావాల్సిన కేంద్ర నిధుల కేటాయింపులో నిస్పక్షపాతంగా వ్యవహరించిన తీరును లెక్కలతో నిరూపించడంతో ప్రతిపక్షాలు తమ బాణిని మార్చాయి.
మైనార్టీల బుజ్జగింపే లక్ష్యంగా పాలన..
ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా రాజకీయ కుట్రలను మొదలుపెట్టాయి. ద్రవిడవాదం సెంటిమెంట్‌ అధికంగా ఉండే తమిళనాడులో అధికార డీఎంకే ప్రధాన నేతలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ సనాతన ధర్మంపై తలాతోక లేని వాదనలు చేశారు. కేరళలో అధికారంలో ఉన్న  వామపక్ష ప్రభుత్వం మైనార్టీ ఓటర్లు దూరమవుతారనే జంకుతో రాష్ట్రంలో సంఘ్‌ పరివార్‌, ఇతర హిందూ సంస్థల, బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీ ఓట్లే లక్ష్యంగా వారిని బుజ్జగిస్తూ హిందువులపై అకారణంగా దాడులు చేసినా పట్టించుకోలేదు. తెలంగాణలో కొత్తగా గద్దెనెక్కిన కాంగ్రెస్‌ సర్కార్‌ ముస్లిం ఓట్లు పొందేందుకు ఎంఐఏం అధినేత ఓవైసీ ప్రాప్తం కోసం పాకులాడిరది. ఈ రాష్ట్రలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కొంచెం భిన్నం. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అస్యమతస్తుల ఆగడాలను అడ్డుకోకుండా చోద్యం చూసింది. రాష్ట్రంలో బలమైన హిందూ సంఘాలున్నా అవి కలిసికట్టుగా సంఘటితంగా లేకపోవడం ఇక్కడ బలహీనత.
దక్షిణ భారత దేశంలో ఐదు రాష్ట్రాల్లోనూ ప్రత్యర్థి ప్రభుత్వాలు ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి ఈ ప్రాంతంలో ఎన్నికలు గట్టి సవాలు విసిరినా మెరుగైన ఫలితాలు సాధించిందని గణాంకాలు నిరూపిస్తున్నాయి. దక్షిణాదిన 2019, 2024 రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ 29 స్థానాలే గెలిచింది. గత ఎన్నికల కంటే ఇప్పుడు ఒక్క సీటు కూడా అదనంగా గెలవని బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ఐదు రాష్ట్రాల్లోనూ గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకొని పార్టీ పునాదులను పటిష్ట పర్చుకొంది. పార్టీకి ఉనికే లేదని విమర్శలు ఎదుర్కొన్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది. 
మర్రి వృక్షం చెంత నుండి బయటపడిన బీజేపీ..
దక్షిణాదిన అత్యధికంగా 39 స్థానాలున్న తమిళనాడులో బీజేపీకి 2024 ఎన్నికలు ప్రత్యేకమైనవి. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని బీజేపీకి ఇక్కడ ఈ సారి కూడా రిక్తహస్తమే ఎదురయినా పార్టీ గణనీయంగా పుంజుకుంది. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యం ఉండే ఈ రాష్ట్రంలో మూడో పార్టీకి ఉనికి లేకుండా పోయింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు ఇక్కడ గెలవాలంటే ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ చెంతన చేరాల్సిందే. రాష్ట్రంలో ఇతర పార్టీల ఎదుగుదలను అడ్డుకుంటూ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మర్రి వృక్షంలా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో అన్నాడీఎంకేతో జతకట్టిన బీజేపీ ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో చిన్నపార్టీలను ఎన్డీఏలో చేర్చుకొని పోటీ చేసింది. ఐపీఎస్‌ అధికారిగా పనిచేసిన అన్నామలైను రాష్ట్ర చీఫ్‌గా ఎంపిక చేసిన బీజేపీ ఈ ఎన్నికల్లో డీఎంకేకు ముచ్చెమలు పట్టించింది.
తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో ‘ఇండి’ కూటమి మొత్తం 39 స్థానాలు గెల్చుకున్నా, ఒక్క సీటు గెలవని బీజేపీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని కచ్చితంగా చెప్పవచ్చు. లోగడ జరిగిన పలు ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 2024లో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. 2019 లోకసభలో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ 3.6 శాతం,  2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 3 శాతం లోపే ఓట్లను పొందిన బీజేపీ సొంతంగా 2024లో 11 శాతానికి పైగా ఓట్లను సాధించింది. ఎన్డీఏ కూటమి 18 శాతానికి పైగా ఓట్లను పొందింది. పొత్తులో భాగంగా 23 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 9 స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం కూడా పార్టీ బలపడుతుందని చెప్పడానికి నిదర్శనం. అన్నామలైను డీఎంకే సర్కారు అధికార దర్పంతో ముప్పతిప్పలు పెట్టింది. జాతీయవాద వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా పొందేందుకు డీఎంకే సనాతన ధర్మంపైనే దాడి చేసి ఇబ్బందులకు గురిచేసినా బీజేపీ ఓట్ల శాతాన్ని పెంచుకొని రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా అవతరించింది. 
కర్ణాటకలో బీజేపీపై ముప్పేట దాడి…
కర్ణాటకలో 28 స్థానాలకు గాను బీజేపీ అత్యధిక సీట్లలో గెలిచింది. సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో 38 శాతం ఓట్లనే సాధించిన బీజేపీ 2024లో 46 శాతం ఓట్లు పొందింది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఇక్కడ అధిక స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ రాష్ట్రంలో 13 శాతానికి పైగా ఉన్న ముస్లిం ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిరది. రాష్ట్రంలో పలు హిందూ సంస్థలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదు. హనుమాన్‌ చాలీసా పారాయణ పెట్టుకున్న వారిపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితులనే ఇబ్బంది పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సున్నితమైన అంశాలతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది కాంగ్రెస్‌.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ బీజేపీ అగ్ర నేతలపై రాష్ట్రంలో పలు కేసులు నమోదు చేయించి చికాకుపర్చేందుకు ప్రయత్నించింది. ఐదు గ్యారెంటీల హామీలతో గద్దె ఎక్కిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారినా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వాటిని అమలు చేస్తున్నట్టు ప్రజల్లో భ్రమలు కలిగిస్తూ జనాకర్షణ పథకాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించింది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంపై కొంత సానుకూలత ఉండడం సర్వసాధరణం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ రాష్ట్రంలో కనీసం 15`20 స్థానాల్లో గెలవాలని విశ్వప్రయత్నాలు చేసినా బీజేపీ పరిస్థితులకు ఎదురీదుతూ 17 స్థానాల్లో గెలిచింది. దాని మిత్రపక్షం జేడీ(ఎస్‌) మరో రెండు స్థానాల్లో గెలిచింది. అధికార కాంగ్రెస్‌ 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో 25 స్థానాలు పొందిన బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి స్వయంప్రకటిత మేధావులకు పలు ఎన్జీఓ సంఘాలు తోడై చాపకింద నీరులా పనిచేయడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నష్టపోయింది. ఈ ముప్పేట దాడులను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఈసారి ముందు జాగ్రత్తగా జేడీ(ఎస్‌)తో పొత్తు పెట్టుకొని కర్ణాటక కాంగ్రెస్‌ సర్కారుకు గట్టి సవాలు విసిరి విజయం సాధించింది.
దేవభూమిలో బలపడిన బీజేపీ…
దేవభూమిగా పిలవబడే కేరళ బీజేపీకి, సంఘ పరివార్‌కు మొదటి నుండి కొరకరాని కొయ్యగా తయారయ్యింది. రాష్ట్రంలో ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు నిర్ణయాత్మకంగా ఉండడంతో బుజ్జగింపు రాజకీయాలతో ఇక్కడ వామపక్షాలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటముల ఆధిపత్యమే కొనసాగుతూ వచ్చింది. రాష్ట్రంలో 2011 అధికారిక జనాభా లెక్కల ప్రకారమే హిందువులు సుమారు 54 శాతంకు పైగా , ముస్లింలు 26 శాతంకు పైగా , క్రిస్టియన్లు 18 శాతంకు పైగా ఉన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో అనధికారికరంగా ప్రస్తుతం మైనార్టీల సంఖ్య హిందూ జనాభాను ఎప్పుడో దాటిపోయి ఉంటుంది. హిందూ ఓట్ల బదులు గంపగుత్తగా మైనార్టీల ఓట్లు సాధిస్తే అధికారం ఖాయమనే వైఖరితో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, వామపక్షాల నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటములు హిందువులపై వివక్షను చూపిస్తూ పాలించసాగాయి. 
రాష్ట్రంలో మైనార్టీల రాజకీయ ప్రభావం ఎంతమేర ఉంటుందో చెప్పుకోవాలంటే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ గెల్చిన వయనాడ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్నే ఉదహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముస్లింలు 41 శాతం, క్రిస్టియన్లు 13 శాతం ఉండడంతో ఇది సురక్షిత స్థానమని భావించిన రాహుల్‌ ఇక్కడ నుండి పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గంలో ముస్లిం సంఘాల ఆధిపత్యం ఎంత ఉంటుందంటే స్వయాన రాహుల్‌ గాంధీ పాల్గొన్న రోడ్‌షోలో చివరికి మువన్నెల జాతీయ పతకానికి దగ్గరగా ఉండే కాంగ్రెస్‌ జెండాలు ఎగరేయడానికి కూడా ఆ పార్టీకి మద్దతిచ్చిన ముస్లిం సంఘాలు అనుమతించలేదు.
ఈ రెండు కూటముల్లో ఎవరు అధికారంలో ఉన్నా హిందూ సంఘాలపై దాడులు నిత్యం దాడులు జరగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడమే మానేశాయి. అంతేకాక హిందువులంటే చులకన భావం కలిగిన ఎల్‌డీఎఫ్‌ సర్కార్‌ హయాంలో హిందువుల ఆరాధ్య దైవమైన అయ్యప్ప స్వామి దేవాలయం శబరిని వివాదాస్పదం చేశారు. కమ్యూనిస్టు ప్రభుత్వ వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా పలు హిందూ సంఘాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అక్కడ నిత్యం యుద్ధమే. ఎంత మంది హిందూ సంఘాల కార్యకర్తలు బలిదానాలు చేశారు లెక్కేలేదు. ఇంతటి ఘర్షణ వాతావరణం మధ్య మొదటిసారి కేరళలో బీజేపీకి సంతోషకరమైన పరిణామాలు ఏర్పడ్డాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 19 శాతం ఓట్లు సాధించిన బీజేపీ త్రిశూర్‌లో 74 వేలకు పైగా మెజార్టీతో గెలిచింది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 13 శాతం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం,  2021 అసెంబ్లీ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు పొందిన బీజేపీ రాష్ట్రంలో అననుకూల రాజకీయ వాతావరణంలో 2024లో 19 శాతంకు పైగా ఓట్లు పొందడం సాధారణ విషయం కాదు. 2019లో తిరువనంతపురంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ 2024లో చివరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయింది. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో పట్టిన్‌మిట్ట, కన్నూర్‌ నియోజకవర్గాల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. మొత్తం మీద 2024 ఎన్నికల ఫలితాలతో కేరళలో బీజేపీ కూడా ఒక ప్రధాన పార్టీగా అవతరించిందని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సత్ఫలితాలు…
ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో నోటాతో పోటీపడి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న బీజేపీ ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకొని సత్ఫలితాలను పొందింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ మొత్తం 25 స్థానాల్లో పోటీ చేసి కనీసం ఒక్క శాతం ఓట్లు, ఒక్క ఎంపీ స్థానం కూడా పొందలేదు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న బీజేపీ 6 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసి 11 శాతం పైగా ఓట్లతో అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం స్థానాల్లో గెలిచింది. జగన్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లు చీలకుండా కలిసికట్టుగా పోటీ చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల్లో విజయవంతం అయ్యింది.
తెలంగాణలో బీజేపీకి రెట్టింపు స్థానాలు…
మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అనంతరం ఒంటరి పోరుకు ప్రాధాన్యతిచ్చి ప్రతి ఎన్నికల్లో బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లతో ఒక్క సీటే గెలిచిన బీజేపీ అనంతరం ఐదు నెలల వ్యవధిలో జరిగిన 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 19 శాతం ఓట్లతో 4 స్థానాల్లో గెలిచింది. అనంతరం జరిగిన జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్ల ఎవరూ ఊహించని విధంగా గణనీయమైన సీట్లు సాధించి, హుజురాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సాగుతున్న క్రమంలో పార్టీలో అంతర్గత విభేదాలు, సంస్థాగతంగా బలపడకపోవడం వంటి కారణాలతో 13 శాతం ఓట్లతో 8 స్థానాలకే పరిమితమైంది. ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 2019లో వచ్చిన 4 సీట్లను రెట్టింపు చేసుకొని 2024లో 35 శాతం ఓట్లతో 8 స్థానాల్లో గెలిచింది. 
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పదేళ్లు అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌ బలహీనపడడంతో మొత్తం 17 స్థానాలకు గాను ఏకపక్షంగా 14 సీట్లకు పైగా గెలవాలని అధికారంలో ఉన్న  కాంగ్రెస్‌ ప్రయత్నాలను బీజేపీ తిప్పికొట్టింది. అధికారంలో ఎవరుంటే వారి పంచన చేరే ఎంఐఎంను మచ్చిక చేసుకున్న కాంగ్రెస్‌ సర్కార్‌ తమకు అనుకూలంగా ముస్లింలు ఓటేయాలని అసదుద్దీన్‌ చేత  ప్రకటన చేయించారు. సీఎం రేవంత్‌ మరో అడుగు ముందుకేసి బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం అనే అంశాన్ని వక్రీకరిస్తూ మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ల విధానానికే వ్యతిరేకమంటూ ఫేక్‌ వీడియోలను వైరల్‌ చేశారు. కాంగ్రెస్‌ చేసిన అన్ని కుట్రలను బీజేపీ సమగ్రంగా ఎదుర్కొని మెరుగైన ఫలితాలను సాధించింది. కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా గల్లీలో ఎవరున్నా, ఢల్లీిలో మోదీయే ఉండాలని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు. 
తెలంగాణలో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడిన బీజేపీకి రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు రావడంతో బీజేపీ విజయం బలమా..? వాపా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మోదీ చరిష్మాతోపాటు, జాతీయ అంశాల ఆధారంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు పొందిన బీజేపీకి ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ బలహీనపడడం పార్టీ అభివృద్ధికి ఒక సదావకాశం. 8 స్థానాల్లో గెలిచిన పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే 56 అసెంబ్లీ సెగ్మంట్లలో కూడా పార్టీ బలోపేతనికి సంబంధిత ఎంపీలు కృషి చేస్తే సగం రాష్ట్రంలో పార్టీ పటిష్టపడినట్లే. గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు, రెండో స్థానంలో నిలిచిన మరో ఏడుగురు ఎంపీ అభ్యర్థులతో పాటు ఇప్పటికే ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా కలిసికట్టుగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తే బీజేపీకి తెలంగాణలో అధికారం అందని ద్రాక్ష కాదు. 
భిన్న సంస్కృతి, సంప్రదాయాలతో దేశంలో ప్రత్యేకత కలిగున్న దక్షిణ భారత దేశంలో మరింత బలపడి ఉత్తరాది పార్టీ అనే పేరును చెరిపేసుకునేందుకు బీజేపీ ఈ ఐదు రాష్ట్రాల్లో విభిన్న ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ లోక్‌సభలో సానుకూల ఫలితాలను అందుకుంది. సీట్ల గెలుపుతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ పార్టీ పునాదులను పటిష్టం చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ భారతీయుల పార్టీ అని నిరూపించుకునే అవకాశం ఎంతో దూరంలో లేదు.
==============================
డా॥ ఐ.వి.మురళీ కృష్ణ శర్మ
ఫోన్‌ నెం.9949372280