ఆర్ దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్):
మడత నలగని ఖద్దర్ తెల్లచొక్కా, వేళ్లకు బంగారపుటుంగరాలు, అలాంటి ఎడంచేతి వేళ్ల మధ్య పొగ గక్కే ఓ సిగరెట్టు…. కుడి చేత్తో కలం పట్టి, సీరియస్ గా తెగ రాసేస్తుంటే, ‘ఏంటో…! ఏకంగా పొగాకు యాపారిని పొలికల్ రిపోర్టింగ్ కి తెచ్చినట్టుంది మన యాజమాన్యం’ అని లోలోపల సనుక్కునే వారు సోమాజిగూడ ‘ఈనాడు’ బంగళాలో సహచర ఉద్యోగులు కొందరు. అవి తొంబై దశకం తొలి యేళ్లు! కందుకూరు టు హైదరాబాద్ వయా ఒంగోల్ వచ్చిన రిపోర్టర్ కంచర్ల రామయ్య. కాస్త ఎత్తు తక్కువగా ఉండే రామయ్య శరీరపు నలుపు రంగు, తెల్ల చొక్కాల వెనుక దాగేది కాదు. ఆ నలుపు వెనుక తెల్లని మనసూ దాగేది కాదు! తెలిసినోళ్లను, తెలియనోళ్లనూ ఒక్కలాగే నవ్వుతా పలుకరించేది. ఒక పిసరు ప్రకాశం యాస ఎక్కువ ఉండేదే తప్ప, ఏం మాట్లాడినా స్పష్టత ఎంతో… స్వచ్ఛతా అంత ఉండేది. మేము అప్పుడప్పుడే రిపోర్టింగ్ లో కుదురుకుంటున్నాము. గోవింద్, హరీందర్, మహేశ్వర్, నేను….. జనరల్, సిటీ, రంగారెడ్డి ఇలా వివిధ బ్యూరోల్లో ఉండే మేము అప్పుడప్పుడు పొలిటికల్ అసైన్మెంట్లకో, ఆపద్ధర్మంగా అసెంబ్లీ రిపోర్టింగ్ కో వెళ్లాల్సివస్తే ….. ‘ఏరా! నువ్వా? అసెంబ్లీకా? ఓహో…. !!’ అంటూ కృష్ణారావు బాబాయ్, కరీం వంటి సీనియర్లు ఎకసక్యాలాడే రోజులు. మా అందరి మధ్యలోకి రామయ్య రావడం రావడంతోనే పొలిటికల్ బ్యూరో, అదీ తెలుగుదేశం బీట్! అప్పటికే ఆయనకు టీడీపీ లీడర్లతో సన్నిహిత పరిచయాలుండేవి. ఇన్సైడ్ సమాచారం తెస్తూ రాజకీయ కథనాలల్లేది. నాటి ‘న్యూస్టుడే’ ఎండి రమేష్ బాబుకు రామయ్య మాంచి నమ్మకస్తుడు. తద్వారా చైర్మన్ రామోజీరావుకు కూడా దగ్గరయ్యారు. దాంతో, రాజకీయ నేతలకు సన్నిహితంగా వెళ్లటం, వారితో అల్లుకుపోవడం ఆయనకు తేలికయింది. ఇది, ఇతర సీనియర్లకు అంత తేలికగా జీర్ణమైన విషయం కాదు. కానీ, రామయ్య కలుపుగోలుతనం వల్ల అదంతా గాలికి దూదిపింజల్లా కొట్టుకుపోయేది. నేను ఆయన్ని మర్యాదగా ‘అన్న’ అని పిలిచేది.
ఆనాడు ‘ఈనాడు’లో అంతగా చొరవతో కల్పించుకునే వారు లేని జర్నలిస్టు యూనియన్ వ్యవహారాల్లో, రామయ్య అప్పటికే రాటుదేలి వున్నారు. రాష్ట్ర సంఘానికి (APWJU) ఉపాధ్యక్షుడిగా ఉండేవారు. రాజధాని నగరం వచ్చిన కొత్తలో, బషీర్ బాగ్ (దేశోద్ధారక భవన్) ప్రెస్ క్లబ్ లోనే ఓ గది అద్దెకు తీసుకొని ఉండేది. సరిగ్గా అదే రోజుల్లో ఆయన ప్రోద్బలం, ఒత్తిడి వల్లే నేను జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ సభ్యుడినయ్యా! సర్కారు సబ్సిడీ రేటుతో స్థలం ఇస్తే ఏర్పడ్డ గోపనపల్లి జర్నలిస్టు కాలనీ (ఫేజ్-3) లో నేను లబ్దిదారుడినయ్యానంటే, అది కేవలం కంచర్ల రామయ్య చలువే! ఆయనతో, ఇతరత్రా ఈ విషయం చాలా సార్లు చెప్పాను.
ఎన్టీరామారావు పెద్దళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు, రామయ్యకు చాలా సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరూ ప్రకాశం జిల్లా వారే అవడం ఒక కారణమేమో! వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నపుడు కొంత మదనపడ్డారు. తమ వైఖరిని, రాజకీయ పంథాను మీడియా, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు దన్నుగా ఉండే ‘ఈనాడు’ ఎలా చిత్రిస్తుందో? అనే భయం వారికి ఉండింది. అప్పుడు నేను ఈనాడు పొలిటికల్ బ్యూరో చీఫ్ గా ఉన్నాను. ‘అయ్యో అక్కడ మన దిలీపే ఉన్నాడు, he is a true professional, నేను మీకు పరిచయం చేసి కలిపిస్తాను. మీ మనసు పంచుకోండి, వక్రీకరణ లేకుండా ఉన్నది ఉన్నట్టు రాస్తాడు’ అని రామయ్య నన్ను ఆ దంపతులకు పరిచయం చేశారు. నేను వారిరువురితో మాట్లాడి, వారు ఏ పరిస్థితుల్లో పార్టీ మారుతున్నది జనాలకు తెలిసివచ్చేలా ఈనాడులో రాశా! 2004 సార్వత్రిక ఎన్నికలు, కాంగ్రెస్ వేదిక నుంచి ఎన్నికల రాజకీయాల్లో వారిద్దరి గెలుపు, తదనంతర పరిణామాలు అందరికి తెలిసినవే!
తన స్వస్థలం కందుకూరులో రామయ్య ఇంజనీరింగ్ కాలేజీ నెలకొల్పి, అది నిలదొక్కుకున్న తర్వాత నన్నొకసారి ఆహ్వానించి పిల్లలకు ఒక ప్రేరణ ఉపన్యాసం ఇప్పించారు. నేనపుడు ఉమ్మడి రాష్ట్ర సమాచార (RTA) కమిషనర్ గా ఉన్నాను. ఎంత వాత్సల్యం చూపారో నాపైన! కాలేజీ పిల్లలు కూడా ‘రామయ్య మాష్టారు’ అంటూ ఆయన పట్ల అపార భయభక్తిని కనబరచడం నా పరిశీలనను దాటిపోలేదు. కాలేజీ పెట్టిన నుంచి పిల్లల సర్వతోముఖ వికాసానికి ఆయన ఎంతో శ్రమపడేది. రాజకీయ ఆలోచన, మొగ్గువంటివి ఎలా ఉన్నా రామయ్య గారు మాత్రం చక్కని వ్యక్తిత్వం గల నిర్మల మనస్కుడు, స్నేహశీలి. అవసరాల్లో ఉన్నవాళ్లకు గీత దాటి అయినా సహాయం చేయడానికి వెనుకాడని తత్వం ఆయనకుండేది. పెద్ద కొడుకు కాలేజీ వ్యవహారాలు చూసుకుంటుంటే, చిన్న కొడుకు ఏపీ శాసనమండలి సభ్యుడిగా రాజకీయాల్లో ఉన్నారు.
74 ఏళ్ల వయసులో, హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం పరమపదించారు. నాకు సోదర సమానుడైన రామయ్యకు నా కన్నీటి నివాళి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.