బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు .
=============
తెలంగాణలో ప్రభుత్వం మారినా ప్రజల జీవితాలు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అష్టకష్టాలు పడిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడితే ఆకాశమే హద్దుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లోనే చేతులెత్తేసి ప్రజలను వంచించడంలో బీఆర్ఎస్కు తానేమి తక్కువ కాదని నిరూపించింది. బీఆర్ఎస్ బంగారు తెలంగాణ అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే అలవికానీ హామిలిచ్చిన కాంగ్రెస్ ప్రజలకు త్రిశంకు స్వర్గం చూపెడుతోంది.
క్రమశిక్షణ లేని ఆర్థిక విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది బీఆర్ఎస్ సర్కారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదనే నెపంతో కాలయాపన చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు. అధికారమే లక్ష్యంగా ఆరు గ్యారెంటీలు, అరవై ఆరు పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందంటూ గత ప్రభుత్వ విధానాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ తమ చేతకానితనాన్ని, ఇచ్చిన అబద్దపు హామీలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఆరు గ్యారెంటీలతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారం చేపట్టాక అమలు విషయానికి వచ్చేసరికి మీనమేషాలు లెక్కపెడుతోంది రేవంత్ సర్కారు. కాంగ్రెస్ హామీలకు వ్యారెంటీ లేకపోవడంతో అవన్నీ ఫోర్ ట్వంటీలుగా మారిపోయాయి. అనేక వాగ్దానాలు నీటి రాతలుగానే మిగిలాయి. ఆరు గ్యారెంటీలపై తెస్తామని చెప్పిన చట్టం ఎక్కడుంది..? పగ్గాలు చేపట్టగానే రైతులకు చేస్తామని చెప్పిన రుణమాఫీ ఎక్కడ..? మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇస్తామని చెప్పిన 2500 రూపాయలు ఒక్కరికైనా ఇచ్చారా..? అన్నదాతలకు ఇస్తామని చెప్పిన 15 వేల రూపాయల రైతు భరోసాను ఎందరికిచ్చారు..? విద్యార్థులకు అందజేస్తామని చెప్పిన 5 లక్షల రూపాయాల విద్యా భరోసా ఎక్కడ..? పేదలందరికీ అందిస్తామని చెప్పిన 10 లక్షల ఆరోగ్య బీమా ఎందరికి కల్పించారు..? ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన కాంగ్రెస్ మొదటి బడ్జెట్లో మహాలక్ష్మి రూ.2500, రెండు లక్షల రుణమాఫీ నిరుద్యోగ భృతి, వ్యవసాయ కూలీలకు రూ.12000, జర్నలిస్ట్లకు వెల్ఫేర్ ఫండ్ ప్రస్తావనే లేదు.
ఇలా చెప్పుకుంటే పోతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభత్వం కూడా అంకెల గారెడీతో, మాయ మాటలతో తెలంగాణ ప్రజలను పస్తులు ఉంచే పన్నాగం పన్నింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన ఆర్థిక తప్పిదాల బాటలోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుంది. వాస్తవికతకు దూరంగా రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడం, బహిరంగ మార్కెట్ రుణాలను 50 శాతానికి పెంచడం, ఉద్యోగ కల్పనకు మేలు చేసే రంగాలైన ఎమ్ఎస్ఎమ్ఈ, ఐటీ సెక్టార్లకు తక్కువ నిధులు కేటాయించడం, విద్యా ఆరోగ్య రంగాలకు దేశ తలసరి కంటే తక్కువ నిధులు కేటాయించడం ఉదాహరణలుగా చెప్పవచ్చు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలకు కావల్సింది అక్షరాల లక్షా 80 వేల కోట్ల రూపాయలు. కానీ బడ్జెట్లో ప్రవేశ పెట్టిన నిధులు రూ.53,196 కోట్లు. అదీ అంచనా బడ్జెట్. (గత 9 ఏళ్ల నుండి ప్రవేశపెట్టిన బడ్జెట్కు వాస్తవిక ఖర్చు సుమారు 25 శాతం తక్కువగా ఉంటుంది.) మరి మిగిలిన సుమారు లక్షా 20 వేల కోట్ల బడ్జెట్ నిధులు ఎక్కడి నుండి సమకూరుస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాధ్యతాయుతంగా చెప్పాలి. నిధుల కోసం రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకుండా ఆర్థిక వనరులైన ఎమ్ఎస్ఎమ్ఈ, ఐటీ రంగాలపై శీత కన్ను వేసింది. నిధుల కోసం కేసీఆర్ ప్రభుత్వం వలే మద్యాన్ని ఏరులై పారించడంతో పాటు పెట్రోల్, డీజిల్పై పన్నులు పెంచుతారా..? నిధుల సేకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతంగా ప్రజలకు తెలియజేయకపోతే రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలై పెనంలోంచి పొయ్యిలోకి పడడం ఖాయం.
రేవంత్రెడ్డి పాలన కేసీఆర్ మార్గంలోనే నడుస్తుండడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే తాను ముక్కలే అన్నట్టున్నాయి. ఈ రెండు పార్టీల జెండాలు వేరైనా అజెండాలు ఒకేలా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నుండి గెలిచిన వారు బీఆర్ఎస్లో చేరి మంత్రులవ్వగా, ఇప్పుడు కేసీఆర్ అనుయూయులు పదవుల కోసం పాకులాడుతూ కాంగ్రెస్లో చేరుతున్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ను అదుపులో ఉంచుకున్న ఎమ్ఐఎమ్ ఇప్పుడు కాంగ్రెస్ హస్తవాసిని కూడా తానే నిర్ణయిస్తోంది. బీఆర్ఎస్ వలే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీ కనుసన్నుల్లోనే నడుస్తోంది. నాడు బీఆర్ఎస్తో అంటకాగిన ఎమ్ఐఎమ్ నేడు కాంగ్రెస్తో చెట్టపట్టాలు వేస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్న వారి పంచన చేరి బీజేపీని దెబ్బతీయడమే ఎమ్ఐఎమ్ ప్రధాన లక్ష్యం అని ప్రజలు గమనించాలి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజన మహిళను దేశంలో అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా చేయాలని నిర్ణయిస్తే ఈ రెండు పార్టీలు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం బీజేపీ చారిత్రాత్మక చట్టాలు తెస్తే పార్లమెంట్ ముందు ధర్నాలు చేశాయి ఈ పార్టీలు. త్రిబుల్ తలాక్ రద్దుకు, ఆర్టికల్ 370 రద్దుకు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి, శత్రు దేశాలపై సర్జికల్ స్ట్రైక్ అంశాలపై ఈ రెండు పార్టీలు అడ్డం పొడుగు మాటలతో దేశ గౌరవాన్ని చులకన చేశాయి.
గతంలో పొత్తులు పెట్టుకొని అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కృష్ణా నీటి విషయంలో రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు కన్నీటిని మిగిల్చాయి. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ప్రజా ధనాన్ని వృథా చేస్తూ ఈ రెండు పార్టీలు మాటలతో రక్తికట్టిస్తూ అవాకులు చెవాకులు పలుకుతూ నువ్వు గిల్లు నేను ఏడుస్తా అంటూ కొత్త నాటకాలకు తెరదీస్తున్నాయి. వీరి దొంగ నాటకాలకు ఎమ్ఐఎమ్ తోడు పలుకుతూ తన పాత్రను పోషిస్తోంది.
ఓటుకు నోటు బదులుగా కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీనీ నీరుగారుస్తోంది కాంగ్రెస్ సర్కారు. ఓటుకు నోటు కేసు నుండి రేవంత్ రెడ్డిని రక్షించినందుకు ప్రతిఫలంగా కాళేశ్వరం అవినీతి నుండి బీఆర్ఎస్ నాయకులను తప్పించే కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ అవినీతి నుండి కారు పరివారంను కాపాడి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది హస్త పరివారం.
నేడు తెలంగాణలో సోనియమ్మ బంట్లు ఒకవైపు…శ్రీ రామ బంట్లు మరోవైపు ఉండి పోరాడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే. బీఆర్ఎస్ది కల్వకుంట్ల సారు జపం అయితే కాంగ్రెస్ది సోనియమ్మ మేడం జపం… కానీ బీజేపీది మాత్రం శ్రీ రామ జపం. బీఆర్ఎస్ కాంగ్రెస్ల లక్ష్యం కుటుంబ అభివృద్ధి అయితే బీజేపీ లక్ష్యం దేశ అభివృద్ధి.
ఈ రెండు పార్టీలది పేగు బంధం. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ నాయకులు కొట్లడిన సందర్భాలు ఎన్ని…? ఈ అంశాలపై ఒకరికొకరు అనుకుంటూ సాగుతున్న తీరు వీరి దోస్తానాకు నిదర్శనం కాదా..? బీఆర్ఎస్ అవినీతిపై కొట్లడిరది బీజేపీనే. ప్రజల పక్షాన పోరాడిరది బీజేపీనే.
కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కోసం దీక్షలు చేస్తే బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం దీక్షలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం తెలంగాణ ప్రజల కోసం పోరాటాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటుంది.